breaking news
Cryogenic
-
మళ్లీ బతకాలన్న ఆశతో..
మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే ఆధునిక సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్ విసురుతున్నారు. ‘ఈరోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో’ తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ, ప్రపంచంలోని కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్ చాంబర్లలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టించి భద్రపర్చుకుంటూ భవిష్యత్పై ఆశలు పెంచుకుంటున్నారు. ఖర్చు ఘనం.. క్రయోజెనిక్స్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. మరణించిన వెంటనే, శరీరాన్ని అత్యంత వేగంగా మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో (లిక్విడ్ నైట్రోజన్) గడ్డకట్టిస్తారు.ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటే, కణజాలంలో ఎలాంటి రసాయన మార్పులూ జరగవు. ఈ ప్రక్రియలో రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ అనే ద్రవాన్ని ప్రవేశపెడతారు. కణాలు దెబ్బతినకుండా, శరీరం లేదా మెదడును ‘కాలం నిలిపిన’ స్థితిలో భద్రపరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్లో ఉన్న శరీరానికి కాలంతో సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా వందల, వేల ఏళ్లు భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి శరీరం భద్రపర్చాలంటే భారతీయ కరెన్సీలో రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడు మాత్రమే భద్రపర్చాలంటే రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా దేశాల్లో ఇందుకోసం ఇన్సూ్యరెన్స్ కంపెనీలు కవరేజ్ కూడా కల్పిస్తుండటం విశేషం. ఇప్పటికే 500 మందికి పైగా మరణానంతరం తమ శరీరాలు, మెదడును ఈ క్రయోజెనిక్స్ చాంబర్స్లో భద్రపర్చుకున్నారు. అధ్యయనాల్లో భిన్నాభిప్రాయాలు.. క్రయోజెనిక్స్ అంశంపై ఇటీవల కాలంలో ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీలు, వైద్య పరిశోధన సంస్థలు అనేక అధ్యయనాలు చేస్తున్నాయి. అమెరికాలో ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ (ఆరిజోనా), క్రయోజనిక్స్ ఇన్స్టిట్యూట్ (మిచిగావ్)ల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (యూకే) జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్–2023తో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్ (యూఎస్ఏ) తమ బ్రిటిష్ మెడికల్ జర్నల్–2023లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ క్రయోజెనిక్స్పై ప్రత్యేకంగా ప్రస్తావించాయి. అయితే కాలిఫోర్నియా వర్సిటీ న్యూరో సైన్స్పై జరిపిన అధ్యయనంలో మెదడును గడ్డకట్టిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ (జర్మనీ) తమ క్రియో బయోలజీ జర్నల్–2024లో కణజాలాన్ని గడ్డకట్టే ప్రక్రియలోనే సూక్ష్మస్థాయిలో నష్టం జరుగుతుందని పేర్కొంది. చిన్న అవయవాల పునరుద్ధరణ వరకే విజయం సాధ్యమైందని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలిపింది. ఏ దేశాల్లో ముందున్నాయి.. క్రయోజెనిక్స్ రంగంలో అమెరికా, రష్యా దేశాలు ముందున్నాయి. చైనా ఇటీవలే ఈ అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. కెనడా, యూరప్,జర్మనీ, స్విట్జర్లాండ్, యూకేల్లో పరిమిత స్థాయిలో పరిశోధనలు జరుగుతుండగా, ఆ్రస్టేలియాలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రయోజెనిక్ పేషెంట్లు (మరణానంతరం) ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లోకెక్కింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ తరహా సదుపాయాలను కల్పించింది. రష్యాలోని క్రియోరుస్ అనే సంస్థ పూర్తి శరీరం, మెదడు భద్రపరిచే సదుపాయం కలిగి ఉంది. సైన్స్పై అతి నమ్మకం, డబ్బు ఇచ్చే ధైర్యం..కోల్పోయేదేముందన్న భావన ఈ తరహా ప్రయోగాలకు పురిగొల్పుతుందంటున్నారు. :::సాక్షి ప్రత్యేక కథనం -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
సింగపూర్ నుంచి ఏపీకి మూడు ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం మూడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఒక్కో ఆక్సిజన్ ట్యాంక్ నుంచి 1. 40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యం ఉన్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజెనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపిన తరువాత అవి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరతాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్టానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ఉచితంగా థాయిలాండ్ నుంచి దిగుమతు చేసుకుని అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి కావడానికి కృషి చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4. 20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. మన రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమైంది. -
భారత్కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్కు థాయ్లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ(ఎంఈఐఎల్) థాయ్లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్కు దిగుమతి చేస్తోంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్ట్కు ప్రత్యేకంగా డిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ Corona: వ్యాక్సిన్ కోసం వేరే దేశాలకు! -
ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్(నెట్వర్క్) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్ బాధితులకు ఇవ్వాలని సింఘాల్ పేర్కొన్నారు. 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్మెంట్ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తాం. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నాం. ఈ వివరాలన్నీ 104 కాల్సెంటర్ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలి. ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. ఆక్సిజన్కు ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్ పీఏఎస్లు ఏర్పాటవుతాయి. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశాం. ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరోవైపు థర్డ్వేవ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సమస్యలు లేకుండా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 104కు ఒక్కరోజే 17,649 కాల్స్ గురువారం ఒక్కరోజే 104 కాల్సెంటర్కు 17,649 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకూ 3,365 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 608 మంది స్పెషలిస్టులున్నారు. ఆస్పత్రి దగ్గరే కోవిడ్ కేర్ సెంటర్ ఆస్పత్రుల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో వీలును బట్టి 100 నుంచి 200 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి. కోవిడ్ కేర్లా ఉపయోగపడుతుంది, ఆస్పత్రిలాగా కూడా ఉంటుంది. వీలైనంత త్వరలో వీటిని ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కోరాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.100 కోట్లు ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం మరో రూ.45 కోట్లు విడుదల చేసింది. చదవండి: ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. సీసీ ఫుటేజ్లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! -
ఇస్రో క్రయోజెనిక్ అదుర్స్
సత్తా చాటుతున్న ఇంజిన్ సూళ్లూరుపేట/బెంగళూరు: నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను సైతం అంతరిక్షానికి మోసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్లో అమర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ వరుస పరీక్షల్లో సత్తా చాటుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపరుస్తున్న ఈ ‘హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్’లో 20 టన్నుల క్రయో ఇంధనాన్ని నింపి ఇస్రో ఏప్రిల్ 28న 635 సెకన్ల పాటు హాట్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. జీఎస్ఎల్వీ రాకెట్లో కీలకమైన ఈ ఇంజన్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ప్రొపల్షన్ సెంటర్లో ఇస్రో వరుసగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంజన్కు చెందిన థ్రస్ట్ చాంబర్, ఇంజెక్టర్, గ్యాస్ జెనరేటర్, టర్బో పంపులు, నియంత్రణ పరికరాలన్నీ పరీక్షల్లో బాగా పనిచేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఇంజన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వరుసగా రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా, 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యకు చేర్చడంతో పాటు మానవ సహిత అంతరిక్ష యాత్రలకూ ఉపయోగపడేలా జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ను తయారు చేసిన ఇస్రో ఇదివరకే దానిని విజయవంతంగా పరీక్షించింది. అయితే, అందులో క్రయోజెనిక్ ఇంజిన్ లేకుండానే ఆ ప్రయోగం నిర్వహించింది. ఈ ఇంజిన్ పూర్తిగా సిద్ధమైతే గనక.. అంతరిక్ష ప్రయోగాల్లో క్రయోజెనిక్ టెక్నాలజీని సొంతంగా వినియోగించే ఆరో దేశంగా భారత్ నిలవనుంది.


