breaking news
Crop Loss estimate
-
పరిహారం అందేనా..?
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో రైతులను ఓసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోతున్నా పరిహారం అందకపోవడం వారిని కుంగదీస్తోంది. నష్టంపై సర్వే చేసి నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పంటల నష్టపరిహరం అందుతుందో లేదోనని ఎదురుచూడాల్సి వస్తోంది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలగా మారింది. ఏటా పంటలు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో 58 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. రెవెన్యూ, వ్యవసాయ ఆధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దాదాపుగా రెండు నెలల కావస్తున్నా పంటల నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లో వర్షాల కారణంగా 58 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కొట్టుకుపోయాయి. 45 వేల ఎకరాల్లో పత్తి, 7,500 ఎకరాల్లో సోయా, 3,750 ఎకరాలలో కంది పంటలు వరదలో కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి పంటల నష్టం, రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. 45 వేల ఎకరాల్లో పంట వరదలకు కొట్టుకుపోయినట్లు తేల్చారు. పంట నష్టంపై వివరాల నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేశారు. పరిహారంపై స్పష్టత ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడంతో పంటల నష్టపరిహారంపై నిర్ణయం తీసుకునే వారు లేకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందజేసే పరిహారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించడానికి పోటీపడ్డ నాయకులు నష్టపరిహారం ఇప్పించడంలో చొరవ చూపాలని, త్వరగా ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. సర్వే నివేదిక అందజేశాం జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాం. నష్టపోయిన పంటల వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పంటల నష్టపరిహారం నిధులు విడుదల చేస్తే రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి. -
అధికారులపై ‘అంచనాల’ వ్యయం
సాక్షి, సంగారెడ్డి : భారీ వర్షాలు, వడగండ్ల వానలు, కరువు కాటకాలతో జరిగిన పంట నష్టంపై అంచనాల తయారీ భారం అధికారుల నెత్తిపై పడింది. నష్టపోయిన రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కంప్యూటరైజ్డ్ జాబితాలు, నివేదికలు తయారీకి ఖర్చులు క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులే భరిస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో సంభవించిన పంట నష్టంపై జిల్లా వ్యాప్తంగా గణన జరుగుతోంది. దీనికయ్యే ఖర్చు విషయమై గత నెల 28న కలెక్టర్ స్మితాసబర్వాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలువురు తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. 2009-10 మధ్య కాలంలో తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారు లు సంయుక్తంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కాలం నుంచి కంప్యూటరైజ్డ్ జాబితాల తయారీ (హార్డ్, సాఫ్ట్ కాపీలు) ప్రారంభమైంది. అదే విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఇన్పుట్ సబ్సిడీని బదిలీ చేసే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులకు పని భారం పెరిగింది. రైతుల పేర్లు, నష్టపోయిన పంటలు, విస్తీర్ణం, ప్రతిపాదించిన పరిహారం, బ్యాంకు ఖాతా నంబర్లు, బ్రాంచ్ పేరు తదితర సమాచారంతో గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తేనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నారు. వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి రెండు సెట్లు, జిల్లా ఖజానా కార్యాలయం, మండల వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలకు ఒక్కో సెట్ చొప్పున ఈ జాబితాల హార్డ్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో గ్రామానికి సంబంధించి మొత్తం ఆరు సెట్ల జాబితాలు తయారీ చేయాల్సి వస్తోంది. కంప్యూటర్లో డాటా ఎంట్రీ, ఆ తర్వాత జాబితాల ప్రింటింగ్కు అయ్యే ఖర్చులను ఇప్పటి వరకు మండల వ్యవసాయ అధికారులే భరిస్తూ వస్తున్నారు. జాబితాల తయారీకి ఒక్కో రైతుపై రూ.3 నుంచి రూ.5 వరకు వ్యయం అవుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2009 నుంచి 2012 వరకు తొమ్మిది పర్యాయాలు జరిపిన సర్వేలకు సంబంధించి మొత్తం రూ.36,55,134 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్క కట్టారు. ప్రస్తుతం పంట నష్టంపై గణన జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఖర్చు చేసిన ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని జేడీఏ కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. వీడియో అ‘ధన’పు భారం ఇదిలా ఉండగా.. ఈ సారి గణనలో నష్టపోయిన పంటల వీడియోలు తీయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. వీడియో రికార్డింగ్కు అయ్యే ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ముందే గ్రామాలకు వెళ్లి పంట నష్టపోయినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే అక్కడికి ప్రైవేటు వీడియో గ్రాఫర్లను తీసుకెళ్తున్నారు. ఈ ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు జిల్లా వ్యవసాయ కార్యాలయానికి నిత్యం సంప్రదిస్తున్నారు. మరి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో చూడాలి.