convener saibabu
-
'ఒక్క నిమిషం'పై రేపు నిర్ణయం
కాకినాడ: ఒక్క నిమిషం నిబంధన సడలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్క నిమిషం నిబంధన సడలించాలని అనేక వినతులు వచ్చాయని వెల్లడించారు. దీనిపై శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష అనుమతించలేదు. ఇంజనీరింగ్కు రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఎంసెట్ విద్యార్థులకు రవాణా సౌకర్యం ఇబ్బంది ఎదురైతే పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో తెలిపారు. విద్యార్థులు 18004256755 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. -
'పోలీసుల సాయంతో విద్యార్థుల తనిఖీ'
కాకినాడ: ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. మెడికల్ పరీక్షా కేంద్రాల వద్ద సెల్ ఫోన్ జామర్లు పెట్టనున్నట్టు వెల్లడించారు. అనుమానిత విద్యార్థులను అవసరమైతే పోలీసుల సాయంతో తనిఖీ చేస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగానికి 328, మెడికల్ విభాగానికి 163 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీతో పాటు హైదరాబాద్ లో 2,55, 409 మంది విద్యార్థులు ఎంసెట్ రాయబోతున్నారని తెలిపారు.