breaking news
conservationists
-
ఆయనా ఓ పులే!
ఆ రోజు నేను ఆశ్యర్య పోయాను. ఆయనో సెలబ్రిటీ అనీ, పులుల గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనీ నాకు తెలుసు. 40 పుస్తకాలు రాశాడు. ‘ల్యాండ్ ఆఫ్ ద టైగర్’ పేరిట బీబీసీ సిరీస్ చేశాడు. పులుల మీద ప్రపంచస్థాయి ‘అథారిటీ’ అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఆయన చనిపోయినప్పుడు వార్తాపత్రికల్లో విశేషమైన కవరేజి వచ్చింది. ఆయన పట్ల ఉన్న అపారమైన గౌరవాభిమానాలకు అది నిదర్శనం. ఆ స్థాయిలో తనకు గుర్తింపు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయనో ఐకాన్. వాల్మీక్ థాపర్ మృతితో ఆయన లెగసీ ఏమిటో వెల్లడైంది. ఆయన మిగిల్చిపోయే వారసత్వం, పేరు ప్రఖ్యాతులు అంతగా ఉంటాయని సొంత కుటుంబం కూడా ఊహించలేదు. ప్రకృతి సంరక్షకుడిగా, పులుల అధ్యయనకర్తగా ఆయన కనబరచిన ప్రభావం అపార మని ఆలస్యంగానైనా గుర్తించగలిగాం. ఈ తరానికిచెందిన మా కుటుంబంలో ఆయనో స్టార్. వాలూ (మేం అలా పిలుస్తాం)కి పులుల మీద వల్ల మాలిన ప్రేమ. తను కూడా ఎన్నో రకాలుగా ఒక పులి లాంటివాడు. శక్తిమంతుడు. కఠినమైనవాడు. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. ఆయన వేషభాషలు కొట్టొచ్చినట్లు ఉండేవి. భారీ మనిషి. విలక్షణమైన నవ్వు. పెద్దపెద్ద మెరిసే కళ్లు. వాలూ నవ్వాడంటే క్షణకాలం అంతా కొయ్యబారుతుంది. మరు క్షణం ఆ గదంతా నవ్వులతో పెళ్లుమంటుంది. తెలియడానికి చిన్నప్పటి నుంచీ తెలిసినా తనను నిజంగా తెలుసుకున్నది మాత్రం నా ఇరవైలలోనే. మనకు అన్నీ తెలుసు అనుకునే వయసది. ప్రియ నేస్త మైన క్లెయిర్ వింటర్ ష్లాడెన్తో కలిసి ఇండియాలో సెలవులకు వచ్చాను. ఆ సెలవులను రణతంబూరులో గడపమని వాలూ మాకు సలహా ఇచ్చాడు. ‘జీవితంలో ఒక్కసారన్నా పులిని చూడకపోతే, నువ్వసలు జీవించి నట్లే కాదు’ అంటూ రెచ్చగొట్టాడు. ‘నేను మిమ్మల్ని రణతంబూర్ తీసుకెళ్తా... అక్కడ నిజమైన పులులను చూపిస్తా, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, సరేనా’ అని చెప్పి ఒప్పించాడు.వాలూ చెప్పింది నిజం. మేం రణతంబూరుకు జీపులో బయలుదేరాం. పంజా గుర్తులను అనుసరిస్తూ వాలూ తనే జీపు నడిపాడు. అలా జీపును పోనిచ్చి చాలా పులులను కొద్ది అడుగుల దూరం నుంచే మాకు చూపించాడు. రాత్రి సరస్సు ఒడ్డున నెగడు వేసుకుని ఆయన కథలు చెబుతుంటే వింటూ రమ్ తాగాం. కథల్లోని పులులు కూడా మా కళ్ల ముందు ప్రత్యక్షమై నట్లు అనిపించింది. వాలూ అంతగా నాటకీయ ఫక్కీలో కథలు చెప్తాడు. మేం బాగా ఎంజాయ్ చేశాం. రణతంబూరులో గడిపిన ఆ రోజుల అర్థం ఏంటో నేను అప్పట్లో గుర్తించలేదు. అడవిలో సెలవులు గడపటం అదే మొదటిసారి. ఒక గర్ల్ ఫ్రెండ్తో కలిసి వెకేషన్ గడపటం అదే మొదటిసారి. మమ్మల్ని వాచ్ చెయ్యడానికి, నేను హద్దులు దాటకుండా మానిటర్ చేయ్యడానికి పేరెంట్స్ గానీ, గార్డియన్ గానీ అక్కడ లేకపోవడం అదే మొదటిసారి. కానీ వాలూకి తెలుసు. అందుకే మమ్మల్ని రణతంబూరు తీసుకెళ్లాడు. అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఒక కజిన్ ఎదుగుదలకు తన వంతు సాయం తను చేశాడు. తర్వాతి సంవత్సరాల్లో నేను జర్నలిస్టుగా మారినప్పుడు, తరచూ నన్ను డిన్నర్ కంటూ ఆహ్వానించి నాకు తెలియని విషయాలు ఎన్నో చెబుతూ ఉండేవాడు. నేను ఫాలో అయ్యే స్టోరీస్ అంతరార్థాలు, నాకు తట్టని గూఢార్థాలు విశదపరిచేవాడు. ఇదేమైనా ఆలోచించావా... అంటూ వాక్యం మొదలెట్టేవాడు. అలా ప్రారంభించాడంటే ఆ విషయం నేను ఆలోచించలేదని ముందే తెలిసిపోయేది. ఎంతో సౌమ్యంగా, ఎంతో వివేకంతో నన్ను గైడ్ చేసేవాడు. అది నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. కొన్ని కొన్నిసార్లు నా విషయ పరిజ్ఞానం పెంచేందుకు సంభాషణలకు ఇతరులను కూడా పిలుస్తూ ఉండే వాడు. మరికొన్నిసార్లు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్ చేసి మాట్లాడేవాడు. ఏదైనా వార్తాకథ నాన్ని నేను గమనించానో లేదోనని నన్ను అలర్ట్ చేసిన సంద ర్భాలూ ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ సలహా అమూల్యంగా ఉండేది. తను రాజకీయ నాయకుడు కానప్పటికీ, ఏది జనం దృష్టిని ఆకర్షిస్తుందో తెలుసు. ఏది అందరికీ ఆసక్తికరంగా ఉంటుందో, ఏది ఢిల్లీ ఉన్నత వర్గాలను మాత్రమే ఆకర్షిస్తుందో అనాలోచితంగానే వాలూకి అర్థమైపోతుంది. వాలూ నా విమర్శకుడు కూడా. అయితే ఆ విమర్శ సున్నితంగా సమంజసంగా ఉంటుంది. వేరేవారు అయితే ఆ వ్యాఖ్యలకు చిరాకు పడేవారేమో. కానీ నా ప్రోగ్రాం నిశితంగా చూసి జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాతే నాతో దాని గురించి మాట్లాడతాడని నాకు తెలుసు. వాలూ చేసిన ఒక సూచన నేను పూర్తిగా అంగీ కరించాను. కానీ అమలు చేయలేకపోయాను. మాట్లాడే ప్పుడు గొంతు పెంచవద్దన్నది ఆ సూచన. ‘నీ ఉద్వేగ ప్రదర్శన అనవసరం... ఆడియన్స్ను ఆకట్టుకోడానికి నీ మాటల్లో ఉండే కంటెంట్ సరిపోతుంది. స్వరాన్ని చివరి వరకూ ఒకే పిచ్లో ఉంచుకోవాలి’ అనేవాడు. నేను ఎప్పుడూ పాటించలేక పోయాను. ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. నా స్వరతంత్రుల మీద అదుపు కోల్పోతున్నప్పుడల్లా, గొంతు పెరుగు తున్న ప్రతిసారీ జ్ఞానదాయకమైన వాలూ సలహాను గుర్తు చేసుకుంటా. అంటే... ఆయన్ను ఎప్పటికీ మర్చి పోనన్న మాట! -కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) ఇకలేరు. టైగర్ మ్యాన్గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్తో కలిసి పనిచేశారు. Valmik Thapar, a legendary figure in the world of conservation over the past four decades - especially tigers - has just passed away. It is a great loss. Today's Ranthambore, particularly, is a testimony to his deep commitment and indefatigable zeal. He was uncommonly… pic.twitter.com/6TP60wMleo— Jairam Ramesh (@Jairam_Ramesh) May 31, 2025వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. ఇంకా ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్ థాపర్ఎవరీ వాల్మీక్ థాపర్వాల్మీక్ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్ను వివాహం చేసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.Rest in Peace, Valmik Thapar, the international voice of Indian tigers for many many years.As a tribute to him, do read the many books he penned on tigers: ‘Tiger Fire’, ‘Living with Tigers’ and others. pic.twitter.com/SJJzZeELYn— Neha Sinha (@nehaa_sinha) May 31, 2025ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్ థాపర్ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. -
ప్రాజెక్ట్ చీతా రూపకర్త అనుమానాస్పద మృతి
రియాద్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కలల ‘ప్రాజెక్ట్ చీతా’లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు విన్సెంట్ వాన్ డెర్ మార్వె అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సౌదీ అరేబియా రియాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఆయన విగతజీవిగా కనిపించడం.. పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.42 ఏళ్ల విన్సెంట్.. మార్చి 16వ తేదీన అపార్ట్మెంట్లోని హాలులో రక్తపు మడుగులో పడి కనిపించారు. ఆయన తలకు గాయం కావడంతోనే మరణించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. అయితే ఆయనపై మృతిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, అది ప్రమాదవశాత్తూ మరణం కాదని ఆయన కుటుంబ సభ్యులు ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.దక్షిణాఫ్రికాకు చెందిన విన్సెంట్ వాన్ డెర్ మార్వె.. పర్యావరణహితం, అంతరించిపోతున్న జాతుల సంరక్షణ కోసం మెటాపాపులేషన్ ఇన్షియేటివ్(TMI) పేరిట ఓ ఫౌండేషన్ నెలకొల్పారు. దీని ద్వారా ఆసియాలోనే ఆఫ్రికాలోనూ ఆయన సేవలందించారు. మూడేళ్ల కిందట.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజున మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో ఆఫ్రికా దేశాల నుంచి రప్పించిన చీతాలను వదిలిన సంగతి తెలిసిందే. అంతరించిపోయిన ఈ జాతిని భారత్లో తిరిగి ప్రవేశపెట్టడం కోసం సుమారు రూ.91 కోట్ల దాకా ఖర్చు చేశారు. నమీబియా, సౌతాఫ్రికా నుంచి 20 చీతాలను రప్పించగా.. పలు కారణాలతో కొన్ని మరణించాయి. ప్రస్తుతం 12 కూనలతో కలిపి 24 చీతాలు ఉన్నాయి. A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F— Narendra Modi (@narendramodi) September 17, 2022 అయితే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరింది విన్సెంట్ వాన్ డెర్ మార్వె కావడం గమనార్హం. జాతీయ పులుల సంరక్షణ సంస్థ(NTCA)తో సమన్వయమై ప్రాజెక్ట్ రూపొందించడం దగ్గరి నుంచి.. చీతాలను ఎంపిక చేసి ఇక్కడికి తీసుకురావడం దాకా అంతా ఈయన పర్యవేక్షణలో జరిగింది. తాజాగా.. సౌదీ అరేబియాలోనూ చీతాలను ప్రవేశపెట్టే ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసమే రియాద్కు ఆయన వెళ్లగా.. ఈలోపు ఆయన శవమై కనిపించారు. -
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్కు ప్రతిష్టాత్మక పురస్కారం!
ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. - సాక్షి సాగుబడి డెస్క్ -
తెల్ల సివంగులతో మార్నింగ్ వాక్ చేస్తుండగా..
కేప్టౌన్ : పెంపుడు తెల్ల సివంగుల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్ మ్యాథ్యూసన్(65) సివంగులు పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం సివంగులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్కు వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా ఓ సివంగి ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సివంగి కూడా దాడికి దిగింది. ( పులిని చంపి, కాళ్లు అపహరణ ) ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య సివంగుల నుంచి భర్తను రక్షించటానికి శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సివంగుల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సివంగులను సంరక్షకుడి ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. (రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్) -
‘గోరక్షణ’ హత్యలను సహించం
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక ► గాంధీ, వినోబా భావే కన్నా గొప్ప గోరక్షకులు లేరు ► గోభక్తి పేరుతో హింసకు పాల్పడటం సరికాదు ► ‘సబర్మతి’ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని అహ్మదాబాద్: గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను ఆమోదించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను మోదీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. ‘గోభక్తి పేరుతో హింసను ప్రేరేపించటం.. మహాత్మాగాంధీ ఆలోచనకు పూర్తి వ్యతిరేకం’ అని తర్వాత బహిరంగసభలో అన్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల సాధించేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ‘నేడు సబర్మతి ఆశ్రమంలో ఉండి ఈ విషయంపై మాట్లాడటం బాధగా ఉంది. చీమలు, వీధికుక్కలు, చేపలకు ఆహారం వేసే గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. ఈ గడ్డపైనే మహాత్ముడు మనకు అహింసా పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడేమైంది? ఆపరేషన్ విఫలం కావటంతో రోగి చనిపోతే.. బంధువులు ఆసుపత్రిని తగలబెడుతున్నారు. డాక్టర్లను చితగ్గొడుతున్నారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. ప్రమాదంలో ఎవరో చనిపోతేనో గాయపడితేనో కొందరు కలిసి వాహనాలు తగులబెడుతున్నారు’ అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చంపే హక్కు ఎవరికీ లేదు! ‘గోరక్ష, గోపూజలో మహాత్మాగాంధీ, ఆయన అనుచరుడు వినోబా భావేను మించినవారు లేరు. గోరక్ష ఎలా చేయాలో వారే మనకు నేర్పించారు. దేశమంతా వీరి మార్గాన్నే అనుసరించింది. భారత రాజ్యాంగం కూడా గోరక్ష గురించి చెబుతోంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని ప్రశ్నించారు. గోభక్తి పేరుతో మనుషులను చంపటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారాయన. ‘గాంధీ కలలుగన్న భారతాన్ని నిర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దాం. మన స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా భారతదేశాన్ని మార్చుకుందాం’ అని మోదీ పిలుపునిచ్చారు. గోవుకు సంబంధించి తన జీవితంలో జరిగిన ఓ ఘటనను మోదీ గుర్తుచేశారు. గోరక్ష విషయంలో చనిపోయేందుకైనా చనిపోవాలని వినోబా భావే సూచించారన్నారు. సబర్మతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆశ్రమం మొత్తం పరిశీలించిన మోదీ.. మహాత్ముడి గొప్పదనాన్ని, అహింసా వాదాన్ని సూచించే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. తర్వాత రాజ్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో 18,500 మంది దివ్యాంగులకు సహాయక పరికరాలందించారు.