-
పంచాయితీల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్ పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్ పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్పవర్పై తర్జన భర్జనలు పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్ పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచ్కి , కార్యదర్శికి చెక్పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22వ తేదీన తేలిన చెక్ పవర్ గత నెల 22వ తేదీన ప్రభుత్వం చెక్ పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్ పవర్పై ప్రొసీడింగ్స్ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్ పవర్ ప్రొసీడింగ్స్ను పంపించారు. చెక్ పవర్ వచ్చినా .. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్ పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీ–సేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ సెల్లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్ పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్పవర్ ఇచ్చినా, ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. చెక్ పవర్పై పునరాలోచన చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్ పునరాలోచన చేయాలి. – పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్ చెక్ పవర్లేక అప్పుల పాలయ్యాను మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్ పవర్ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు -
శిక్షణ లేకుండానే..!
సాక్షి, షాద్నగర్: కొత్తగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంచాయితీరాజ శాఖ ద్వారా ఎంపికైన వీరికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండానే బాధ్యతలు అప్పగించింది. వారిని నేరుగా క్షేత్రస్థాయిలోకి పంపడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు విధిగా శిక్షణ ఇచ్చిన అనంతరం బాధ్యతలు అప్పగించడం సర్వసాధారణం. కానీ, కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలూ నిర్వహించకుండానే గ్రామ పంచాయతీలను అప్పగించడంతో పాలనలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తం 301 మంది నియామకం జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శి నియమించేందుకు చర్యలు చేపట్టింది. పంచాయితీరాజ శాఖ ద్వారా జిల్లాలో 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 301 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. కొత్త కార్యదర్శులను ఏప్రిల్ 12న నియమించి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీను కేటాయించి పాలనా బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి తెలిపారు. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలివెళ్తున్నారు. పనిభారం ఎక్కువై కొందరు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేక మరికొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పులు జరిగితే చర్యలు.. గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీల నుంచి నిధులు డ్రా చేయడంలో అవకతవలు జరిగితే మాత్రం సర్పంచ్, కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్ను సర్పంచ్, కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. అయితే, నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలనే విషయంపై కొత్త కార్యదర్శులకు అవగాహన లేదు. అదేవిధంగా వీరు ప్రతినెలా తమ పనితీరును కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపర్చాలి. లేదంటే చర్యలు తీసుకోనున్నారు. ‘రియల్’పై అవగాహన అంతంతే కొత్త పంచాయతీ కార్యదర్శులకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అంతగా అవగాహన లేదు. ఎంటెక్, బీటెక్, పీజీ తదితర కోర్సులు చదవి పంచాయతీ కార్యదర్శి పోస్టులు సాధించిన యువకులు అధికంగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వానికి సంబంధించి భూముల కబ్జాలు, భవన నిర్మాణాల అనుమతులు తదితర ప్రధాన అంశాల్లో ఎన్నో కీలకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చిన తర్వాతే విధులు అప్పగించాలి. కానీ, ప్రభుత్వం అలాకాకుండా నేరుగా వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందిగా మారింది. సర్పంచ్లకు శిక్షణ.. మరీ కార్యదర్శులకు? కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే శిక్షణ తరగుతులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి ఏవిధంగా చేయాలి, నిధులు ఏవిధంగా వినియోగించాలనే అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. కానీ, కార్యదర్శులకు మాత్రం నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈనేపథ్యంలో విధుల నిర్వహణలో కొత్త కార్యదర్శులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వారికి శిక్షణ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికీ స్పష్టత లేదు. కొత్త చట్టంపై అవగాహనేదీ.? గ్రామ పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం– 2018ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నెలా పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ పనితీరును వెబ్సైట్లో నమోదుచేయాలి. అదేవిధంగా ప్లాట్ల లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులను నిర్వహించడంతోపాటుగా హరితహారాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా.. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక కీలమైన అంశాలను పొందుపర్చింది. ప్రతి గ్రామానికి ఓ నర్సరీ ఏర్పాటు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించే విధంగా బాధ్యతలను పొందుపర్చింది. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్కు చెక్పవర్ను కేటాయించారు. పైఅంశాలపై పూర్తి స్థాయిలో కొత్త పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేదు. -
చెక్పవర్ కోసం భిక్షాటన..!
సాక్షి, నల్గొండ : సర్పంచ్లుగా బాధ్యతలు స్వీకరించి 4 నెలలు దాటినా చెక్పవర్ లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో పడిపోయామని జిల్లాలోని మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. వీలేనంత త్వరగా ప్రభుత్వం స్పందించి చెక్పవర్ ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. చెక్పవర్ జీవోను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
చెక్ ‘పవర్’ ఉండేనా?
మద్దూరు(హుస్నాబాద్) : పంచాయతీ కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ ఉపసర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఉపసర్పంచ్ పదవులకు గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ పెరిగింది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు రూ.లక్షలలో ఖర్చులు చేశారు. అలాగే కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవులకు చేసిన ఖర్చులతో సమానంగా ఖర్చులు చేశాంటే ప్రభుత్వం ఉపసర్పంచ్కు చెక్ పవర్ కల్పిస్తామని చెప్పడంమే కారణం. అలాగే సర్పంచ్ పోటీలో ఉన్న ఆశావహులను ఉపసర్పంచ్ పదవులతో పార్టీలు బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. వార్డు సభ్యుల అధిక ఖర్చులు.. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ఆశావహులు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన నుంచే రూ.లక్షలలో ఖర్చులు చేశారు. ప్రతీ గ్రామం నుంచి మూడు వార్డులకు పైన ఎవరికీ వారే ఉపసర్పంచ్లగా భావించి అధిక మొత్తంలో ఖర్చులు చేశారు. అనంతరం గెలిచిన సభ్యులను ప్రలోభ పెట్టి ఉపసర్పంచ్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అంత డిమాండ్ ఎందుకంటే కేవలం చెక్ పవర్ కోసమే. మరి ఇప్పుడు ఉపసర్పంచ్కు చెక్ పవర్ ఉంటుందా? లేదా? అన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఆలోచనలో ఉపసర్పంచులు.. సర్పంచ్ ఎన్నికలు ముగిసి కొత్త పంచాయితీల బాధ్యతలు స్వీకరించి పదిహేను రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జాయింట్ చెక్ పవర్కు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని, పంచాయతీరాజ్ కమిషన్ నుంచి కాని ఎలాంటి జీఓ రాక పోవడంతో ఉపసర్పంచ్లు ఎన్నికైన వారందరిలో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. అలాగే ప్రజలు ప్రస్తుతం ఉపసర్పంచ్ చెక్ పవర్పై చర్చలు సాగిస్తున్నారు. దీనికి తోడు మహిళ సర్పంచ్లు ఉన్న దగ్గర వార్డు మెంబర్లుగా పోటీ చేసి పదవులు దక్కించుకొన్నా నాయకులు ఆలోచనలో పడ్డారు. ప్రతీ అభివృద్ధి పనిలో సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్కు చెక్పవర్పై సంతకం పెట్టాల్సి ఉండటంతో ఉపసర్పంచ్ల హవా ఉంటుందని చాల మంది లక్షలు ఖర్చులు చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంక జీఓ విడదల చేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. జీఓ విడుదలలో జాప్యం.. ఇంతకు ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి గనుక బాధ్యతతో నిధుల దుర్వినియోగం ఆరికట్ట వచ్చని వీరిద్దరికి చెక్ పవర్ ఇచ్చారు. కొత్త చట్టంలో మాత్రం పంచాయతీ కార్యదర్శికి బదులు ఉపసర్పంచ్కు చెక్ పవర్ ఉంటుందని చెప్నడమే తప్ప అధికారికంగా జీఓ విడదల కాలేదు. ఇదే ఇప్పడు చర్చకు దారి తీస్తుంది. హన్మతండాలో ఇప్పటి వరకు ఉప సర్పంచ్ ఎన్నిక కాక పోవడం కొస మెరుపు. మహిళా ఉప సర్పంచ్లే అధికం.. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది మహిళ సర్పంచ్లకు రిజర్వు అయ్యాయి దీనితో పాటు మండలంలోని 7 గ్రామ పంచాయతీలలో మహిళ ఉప్ప సర్పంచ్లుగా ఎన్నికై మహిళలల సత్తాను నిరూపించారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఉవ్విళ్లురుతున్నారు. చెక్ పవర్ ఇవ్వాలి.. ప్రభుత్వం చెపినట్లుగా ప్రజా ప్రతి నిధులను అభివృద్ధిలో భాగస్వాములు చేయుటకు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు చెక్ పవర్ అందించి ఉప సర్పంచ్లను గౌరవించాలి. – సింగపాక బాలమ్మ, అర్జున్పట్ల ఉపసర్పంచ్ అధికారిక సమాచారం లేదు.. గ్రామ పంచాయతీలలో చెక్ పవర్ ఎవ్వరెవ్వరికీ ఉంటుందనే విషయంపై ప్రభుత్వం నుంచి గాని పంచాయతీ రాజ్ కమిషన్ నుండి గాని ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. – శ్రీనివాస్ వర్మ, ఈఓపీఆర్డీ మద్దూరు -
ఉప సర్పంచ్లకు చెక్ పవర్పై సర్కారు పునరాలోచన
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో సర్పంచ్తోపాటు ఉప సర్పంచ్కు ఉమ్మడిగా చెక్ పవర్ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా... ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలని యోచిస్తోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. అయితే ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి కత్తెర వేసింది. దానికి బదులుగా సర్పంచ్తోపాటు ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం గాడి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం సాధారణంగా గ్రామ సభ తీర్మానాలు, పాలకవర్గం నిర్ణయాలకు అనుగుణంగానే గ్రామాల్లో నిధులు ఖర్చు చేస్తారు. గ్రామ కార్యదర్శి– సర్పంచ్లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉన్నప్పుడు... సర్పంచ్ ఏదైనా చెక్కుపై సంతకం చేస్తే, ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా.. లేదా వంటి అంశాలను కార్యదర్శి పరిశీలించి సంతకం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారి పరిశీలన విధానం కాకుండా.. నేరుగా ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్ పవర్ కల్పించారు. దీనివల్ల నిధుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ నిబంధనను అమలుపై సర్కారు పునరాలోచనలో పడింది. మరిన్ని అంశాలపైనా సందిగ్ధం..! కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగుస్తుందని.. అనంతరం అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్–ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టంలో నుంచి అమలు మినహాయించిన అంశాల్లో... ఉప సర్పంచ్కు చెక్ పవర్, ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్లను సస్పెండ్ చేసేలా కలెక్టర్కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగపర్చకుంటే చర్యలు, లేఔట్లు–భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. ఇందులో గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్ పవర్ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల్లో సర్పంచ్లనే బాధ్యులుగా చేయాల్సిన సర్కారు.. కార్యదర్శులపై కటువుగా ఉండటమేమిటనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని పలు నిబంధనలను సవరించడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement