Bombay ariph
-
మెదక్లో 144 సెక్షన్
మెదక్ టౌన్, న్యూస్లైన్: టీడీపీ మైనార్టీ నాయకుడు బాంబే ఆరీఫ్పై శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు శనివారం మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. మెదక్ డీఎస్పీ గోద్రూ, తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డిల నేతృత్వంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే మెదక్ పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన చౌరస్తాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు నిర్వహించారు. ఆరీఫ్పై దాడికి నిరసనగా శనివారం పట్టణ బంద్కు పిలుపునిచ్చినప్పటికీ కొందరు వ్యాపారులు మాత్రమే బంద్లో పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని ముస్లిం మైనార్టీ యువకులు నిరసన ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడిచేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు. అతన్ని విచారించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూ తగాదాలే ఆరీఫ్పై దాడికి కారణమని వెల్లడించారు. గతంలోనే ఇరువర్గాలపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైన ఉపేక్షించబోమని హెచ్చరించారు. సీఐలు విజయ్కుమార్, రామకృష్ణ, గంగాధర్, నందీశ్వర్రెడ్డిలతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు గస్తీలో పాల్గొన్నారు. -
టీడీపీ మైనార్టీ నేతపై కత్తులతో దాడి
మెదక్ రూరల్, న్యూస్లైన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటన హవేళిఘణపూర్ శివారులోగల లెప్రసీ ఆస్పత్రి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మెదక్ పట్టణానికి చెందిన టీడీపీ నేత బొంబాయి ఆరీఫ్కు తొగిట పంచాయతీ పరిధిలోని సుల్తాన్పూర్ శివారులోగల పాటిగడ్డతండాలో వ్యవసాయ పొలం ఉంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆరీఫ్ తనబైక్పై మెదక్కు వస్తుండగా ఘణపూర్ శివారులోని మూలమలుపులో ఉన్న స్పీడ్ బ్రేకుల వద్ద రెండు బైక్లపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అడ్డుకున్నారు. వెంటనే తల్వార్లు, కత్తులతో దాడి చేశారు. ఇదే సమయంలో మెదక్ నుండి ఆటోపై హవేళిఘణపూర్ వైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు ఏం జరిగిందంటూ దుండగులను ప్రశ్నించగా, వారిని బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తులు హవేళిఘణపూర్కు వె ళ్లి తాము చూసిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో ఉన్న ఆరీఫ్ను, పక్కనే ఉన్న తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆరీఫ్ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించటంతో హైదరాబాద్కు తరలించారు. వాగ్మూలం సేకరణ దుండగులు చేతిలో తీవ్రంగా గాయపడిన ఆరీఫ్ పరిస్థితి విషమించటంతో న్యాయమూర్తి ప్రదీప్ నాయక్ను తీసుకువచ్చిన వాగ్మూలం తీసుకున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు.