breaking news
Bms Union
-
కేసీఆర్కు గుణపాఠం చెప్పాలి
సాక్షి, సింగరేణి: కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని వేజ్బోర్డు సభ్యుడు, జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి డాక్టర్ బీకే రాయ్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) 26వ మహాసభ జరిగింది. ఈ సభను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీకే రాయ్ మాట్లాడుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ఆలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ సాధనకు ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులను అణగదొక్కాలనే కేసీఆర్ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మిక వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమలను ప్రైవేటీకరించటం, అమ్మివేయడాన్ని బీఎంఎస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. దేశంలో బీఎంఎస్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, జీతభత్యాల పెంపు కోసం పోరాటాలు సాగిస్తోందని అన్నారు. ఇతర 11 జాతీయ సంఘాలు పోరాటాలు చేసినట్లు నటిస్తున్నాయని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి బొగ్గు రంగంలో ఇతర కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మె చేశాయని, బీఎంఎస్ మాత్రం 5 రోజుల సమ్మె చేసిందని అన్నారు. బీఎంఎస్ సమ్మె దెబ్బతో కేంద్ర మంత్రి దిగివచ్చి కోలిండియా సింగరేణిలో ఎఫ్డీఐలను అనుమతించబోమని ప్రకటించారని అన్నారు. 1991లో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఆ విధానాలనే ప్రధానులు అటల్బిహారి వాజ్పేయి, నరేంద్రమోదీలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షింపబడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు ఈ నెల 19న బీఎంఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి, బూర్ల లక్ష్మీనారాయణ, మాధవ నాయక్ల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఏబీకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీర్గరుడే, జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేశం, దక్షిణభారత సంఘటన కార్యదర్శి సామ బాల్రెడ్డి, కెంగర్ల మల్లయ్య, రవిరాజ్వర్మ, రవిశంకర్, లట్టి జగన్మోహన్, ఎం.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్ నేత రాజీనామా?
గోదావరిఖని : టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. టీబీజీకేఎస్లో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నెలాఖరులో కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీఎంఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా 2003లో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్లో ఆది నుంచి పనిచేస్తున్న మల్లయ్య అనేక కీలక పదవుల్లో పనిచేశారు. యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీబీజీకేఎస్లో ఉంటే గుర్తింపు లేదనే ఆలోచనతో మల్లయ్య బీఎంఎస్ వైపు దృష్టి సారించారు. అయితే బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
స్తంభించిన జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీలో ఉద్యోగుల ఆందోళన బుధవారం తీవ్రరూపం దాల్చింది. ప్రధాన ప్రతిపక్ష యూనియన్ బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో బంద్ పాటించారు. యూనియన్ ప్రతినిధులు ప్రధాన కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని బయటకు పంపించి, అన్ని కార్యాలయాల్లోనూ విద్యుత్ను నిలిపివేయడంతో ఎక్కడి పనులక్కడే స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించినప్పటికీ, ఒంటిగంట నుంచి ఒక్కొక్క కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. కరెంట్ తీసివేసి లైట్లు ఆపివేశారు. దీంతో నిత్యం రద్దీతో కిటకిటలాడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం బోసిపోయి కనిపించింది. సర్కిల్, జోనల్కార్యాలయాలనుంచి ప్రధాన కార్యాలయం వద్దకు భారీసంఖ్యలో చేరుకున్న ఉద్యోగులనుద్దేశించి బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్ ప్రసంగించారు. డిమాండ్లు నెరవేరేంతవరకు, సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వెనక్కు తగ్గేది లేదని పిలుపునిచ్చారు. కాగా టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్ల తరపు ప్రతినిధులతో మంగళవారం రాత్రి చర్చలు జరిపిన అడిషనల్ కమిషనర్లు సస్పెండ్ చేసిన ఇద్దరు టాక్స్ ఇన్స్పెక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించడంతోపాటు ఇతరత్రా డిమాండ్లపైనా కమిషనర్ సానుకూలంగా స్పందించినందున సమస్య సమసిపోయిందని ప్రకటించారు. అందుకనుగుణంగా బుధవారం ఉదయం కొందరు టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్లు విధులకు కూడా హాజరయ్యారు. జోక్యం చేసుకున్న కొందరు యూనియన్ నేతలు డ్యూటీల్లో ఉన్నవారందరినీ వెనక్కు పిలిపించి, కార్యాలయాలనూ బంద్ చేయించారు. బదిలీ చేయాల్సిందే: బీఎంఎస్ కమిషనర్ను బదిలీ చేయడమే తమ ఏకైక డిమాండ్ అని, అది నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి వినయ్కపూర్ స్పష్టం చేశారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ , నెలనెలా ఏదో ఒక సమస్యతో కమిషనర్ వద్దకు వెళ్లలేమని, ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలనేదే తమ ఏకైక డిమాండ్ అన్నారు. ఉద్యోగులపై అదనపు భారం మోపవద్దు: టీజేఏసీ ఉద్యోగులపై మోయలేని భారాన్ని మోపవద్దని తెలంగాణ మునిసిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ జీహెచ్ఎంఈయూ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్, ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్ , జేఏసీలోని వివిధ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిపిన వారు ఉద్యోగుల ‘జాబ్చార్ట్’ ప్రకారమే పనులప్పగించాలన్నారు. అర్హులైనవారికి వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై కార్యాచరణను గురువారం ప్రకటించనున్నట్లు సీఐటీయూ ఒక ప్రకటనలో పేర్కొంది. మేయర్ ప్రకటనతో దుమారం.. ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేరిట వెలువడిన సమాచారం దుమారం రేపింది. 9వ తేదీన మృతిచెందిన ఏఎంసీ అశోక్కుమార్ ఆత్మశాంతికోసం బుధవారం జరగాల్సిన స్టాండింగ్కమిటీ తీర్మానాలపై సమీక్షను మేయర్ వాయిదా వేసినట్లు మీడియా ప్రతినిధులకు ఎస్సెమ్మెస్లు వెళ్లాయి. దాంతోపాటే ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు కూడా పేర్కొనడంతో మేయర్, కమిషనర్ మధ్య వార్ జరుగుతోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. సమస్యలుంటే పరిష్కరిస్తాం: సోమేశ్కుమార్ ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని జీహెచ్ంఎసీ కమిషనర్ సోమేశ్కుమార్ పునరుద్ఘాటించారు. యూనియన్ నాయకులు చర్చలకు వస్తే మాట్లాడేందుకు అభ్యంతరం లేదని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు.