breaking news
black people
-
దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!
పలానా దేశం అనగానే వాళ్లు ఇలా ఉంటారనే ఒక భావన ఒకటి ఉంటుంది. దక్షిణాఫ్రికా అనగానే నల్లజాతీయలు అని తెలుస్తుంది అందరికీ. అక్కడ ఘోరమైన ఎండలు కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా ఉంటారు. అలాంటి చోట ఒరానియా అనే ఒక విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. పైగా అక్కడ రోడ్లు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి కార్మికులు, సెక్యురిటీ గార్డు వరకు అంతా తెల్లవాళ్లే. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది . ఈ పట్టణం పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది, వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం. స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన పట్టణం ఈ పట్టణం 1991 నుంచి ఇలానే ఉంది. వారంతా 17వ శతాబ్దపు డచ్ వలసదారుల వారుసులు. దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ నది ఒడ్డున సుమారు 8 వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రవేట్ యజామాన్యంతో కలిసి ఒక పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా కూడా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణవివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దుకుంది. అయితే ఆ పట్టణ వాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్ కోతలు, స్థానికి పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. అంతేకాదు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఈ పట్టణంలో ఉండాలనుకునే నివాసితులు కొన్ని విలువలను పాటించాలి, భాద్యతగా మెలగాలి, సభ్యుత్వం పొంది ఉండాలి. ఐతే ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంతవరకు తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ నగరంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఐతే చాలామంది మాత్రం ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగానూ వర్ణవివక్షతకు పెద్ద పీఠం వేసే ప్రాంతంగానే చూస్తుండటం గమనార్హం. అంతేకాదు దక్షిణాఫ్రికా నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఈ పట్టణాన్ని పునరుద్ధరించటానికి అవిశ్రాంతంగా ప్రయత్నించారు. అందులో భాగంగా 1995లో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కలిసి ఉన్నారు కూడా. (చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!) -
అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!
న్యూయార్క్ : జాతి వివక్ష కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వైద్యురాలికి సరైన చికిత్స అందివ్వకుండా ఆమె మరణానికి కారణమైందో తెల్లజాతి వైద్యురాలు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సూసన్ మూరే (50) అనే ఓ వైద్యురాలు కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడి ఇండియానా పొలీస్లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గొంతులో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారింది. దీంతో తనకు చికిత్స అందిస్తున్న వైద్యురాలికి విషయం చెప్పింది. అయితే ఆమె మూరే మాటలు నమ్మలేదు. తొందరగా ఇంటికి పంపించడానికి చూసింది. ఈ నేపథ్యంలో మూరే తన గోడును వెల్లబోసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను తీసింది. (అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) ఆ వీడియోలో.. ‘‘ నా గొంతులో చాలా నొప్పిగా ఉంది. నలిపేస్తున్నట్లుగా ఉంది. తెల్లజాతి వైద్యురాలు నాపట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. నేను ఏం చెప్పినా నమ్మటం లేదు. నన్ను డ్రగ్స్కు బానిసలాగా చేసింది. త్వరగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేద్దామని చూస్తున్నారు. నేనో తెల్లజాతి దాన్నయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. ఇలానే చాలా మంది నల్లజాతి వాళ్లు చనిపోతున్నార’’ని అన్నదామె. ఈ వీడియోను వైద్యులకు చెందిన ఓ ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మూరే మరణించింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం
న్యూఢిల్లీ : నల్ల జాతీయులు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని భావిస్తాం. వారు ఆకలి బాధతో తపించి, రోగాల బారిన పడి అంత త్వరగా చనిపోరనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారిలో శ్వేత జాతీయులకన్న నల్ల జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నారట. ఇంగ్లండ్, వేల్స్లో నల్ల జాతీయుల్లో పురుషులు శ్వేతజాతీయులకన్నా 4.2 రెట్లు ఎక్కువ, అదే నల్లజాతీయులైన మహిళలు 4.3 రెట్లు ఎక్కువగా మరణిస్తున్నారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్)’ తెలియజేసింది. శ్వేత జాతీయులకన్నా బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత జాతికి చెందిన వారు ఎక్కువగా మరణిస్తున్నారని ఓఎన్ఎస్ పేర్కొంది. మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేది మధ్యన బ్రిటన్లో సంభవించిన మరణాలను జాతుల వారిగా విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్ఎస్ తెలిపింది. (‘లాక్డౌన్లో కూడా ప్రమాదాల రేటు మారలేదు’ ) ఓఎన్ఎస్ ప్రకారం.. ఎక్కువ మరణాలకు కారణం కొంత మేరకు వారి సామాజిక, ఆర్థిక వెనకబడిన తనం కాగా, అంతుచిక్కని ఇతర కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆరోగ్యం, వైకల్యం లాంటి ఇతర కారణాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినప్పటికీ శ్వేత జాతీయులకన్నా నల్ల జాతికి చెందిన స్త్రీలు, పురుషులు 1.9 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ఓఎన్ఎస్ అధ్యయనంలో తేలింది. అందుకే నల్ల జాతీయులతోపాటు నిమ్న జాతీయులే ఎక్కువగా మరణించడానికి దారితీస్తున్న కారణాలపై దర్యాప్తు జరపాల్సిందిగా ‘బ్లాక్ అండ్ మైనారిటీ ఎత్నిక్ (బీఏఎంఈ)’ జాతులు డిమాండ్ చేస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్హెచ్ఎస్)లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందిలో కరానో బారిన పడి 72 శాతం మంది బీఏఎంఈ జాతీయులే ఎందుకు మరణించారని ఆ జాతులు ప్రశ్నిస్తున్నాయి. -
బంజారాహిల్స్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో అయ్యప్ప దేవాలయం పక్కన ఉన్న మెట్లపై నుంచి అర్ధరాత్రి ఓ నల్లజాతి యువకుడిని అదే జాతికి చెందిన నలుగురు యువకులు కాళ్లను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్తూ తమతో పాటు తీసుకొచ్చిన కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. తాను రానంటూ సదరు యువకుడు ఏడుస్తూ పారిపోవడానికి యత్నిస్తుండగాపట్టుకొని కాళ్లకు తాళ్లు వేసి ఈడ్చుకెళ్లి కారులో(ఏపీ 10బీఈ 5107) కూర్చోబెట్టారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీరు ఎవరైందీ, పోలీసులు కారు నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా ఆ కారు నంబర్ తప్పు అని తేలింది. ఆ యువకులు ఎవరు.? తీసుకెళ్లిన నల్లజాతీయుడు ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అమెరికా అంతటా వివక్షే!
ఇండియాలో మాదిరిగానే అమెరికాలో కూడా దైనందిన జీవితంలోని అనేర రంగాల్లో తాము వివక్ష ఎదర్కుంటున్నామని అన్ని జాతుల్లోనూ అత్యధిక ప్రజానీకం వాపోతోంది. అగ్రరాజ్యానికి చెందిన ప్రఖ్యాత నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్), రాబర్ట్వుడ్ జాన్సన్ ఫౌండేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ టీహెచ్ చాన్ స్కూలాఫ్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో 70 శాతం జనాభాతోపాటు దాదాపు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న తెల్లజాతివారు (వైట్స్) సైతం తమపై వివక్ష ఉందని చెప్పారు. శ్వేతజాతీయుల్లో 55 శాతం ‘అమెరికాలో తెల్లజాతివారికి కూడా వివక్ష ఎదురౌతోంది’ అని తెలిపారు. ఉద్యోగం చేసే ప్రదేశం నుంచి ఆస్పత్రి వరకూ తాము ఫలానా జాతివారమనే కారణంగా ఎదర్కుంటున్న అన్యాయం, వివక్షపై జనం అనుభవాలపై ఈ సర్వేలో అనేక ప్రశ్నలడిగారు. శ్వేతజాతీయులు, నల్లజాతివారు, లాటినోలు(స్పానిష్ భాష మాట్లాడే హిస్పానిక్లు), ఆసియన్ అమెరికన్లు, స్థానిక అమెరికన్లు(రెడ్ ఇండియన్లు), ఎల్జీబీటీక్యూలుగా గుర్తింపు పొందిన వారిని ఈ సర్వేలో ప్రశ్నించారు. కిందటి జనవరి 26 నుంచి ఏప్రిల్ 9 వరకూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 3,453 మంది తమ అనుభవాలు వెల్లడించారు. మొదట ఆఫ్రికన్ అమెరికన్ల(నల్లజాతివారు) అనుభవాలపై మంగళవారం ఈ సర్వే ఫలితాలు ప్రకటించారు. అమెరికా వచ్చినప్పటి నుంచీ నల్లవారికి వివక్షే! తమ జాతివారు ఆఫ్రికాఖండం నుంచి అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ తరతరాలుగా అత్యధికస్థాయిలో సమాజంలో జాతి వివక్ష ఎదుర్కొన్నామని 802 మంది చెప్పారు. పోలీసులతో వ్యవహారాలు, ఉద్యోగం కోసం దరఖాస్తు, ప్రమోషన్కు అభ్యర్థన, అపార్ట్మెంట్లలో అద్దెకు దిగడం, ఇళ్ల కొనుగోలు, వైద్యశాలలో డాక్టర్ను చూడడం వంటి నిజ జీవితంలోని ప్రధాన సందర్భాల్లో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వాపోయారు. పోలీసులు తమపై వివక్ష చూపారని 57 శాతం నల్లజాతి పురుషులు తెలిపారు. అద్దె ఇళ్లు సంపాదించడం, గృహాల కొనుగోలులో తమకు సమానావకాశాలు లేవని 54 శాతం నల్లజాతి పురుషులు చెప్పారు. ఓటేసే విషయంలో, రాజకీయాల్లో పాల్గొనే సందర్భాల్లో కూడా వివక్ష ఉందని 19 శాతం ఆఫ్రికన్ అమెరికన్లే అభిప్రాయపడ్డారు. డాక్టర్ను కలవడానికి లేదా ఆస్పత్రికి వెళ్లినప్పుడు తాము వ్యక్తిగతంగా జాత వివక్ష చవిచూశామని ఈ సర్వేలో పాల్గొన్న నల్లజాతీయుల్లో మూడో వంతు(32శాతం) చెప్పగా, తమను సరిగ్గా చూడరనీ, సవ్యమైన చికిత్స అందదనే భయంతో దవాఖానేకే తాము పోవడంలేదని 22 శాతం మంది తెలిపారు. తాము నల్లజాతివారమనే కారణంగా తమను, తమ కుటుంబసభ్యులను పోలీసులు అన్యాయంగా ఆపి, దౌర్జన్యం చేయడం సర్వసాధారణమని 60 శాతం మంది ఈ సర్వేలో తెలిపారు. ఒకే రకమైన సందర్భంలో తెల్లజాతివారిపై చేయిచేసుకోని పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్లపై మాత్రం బలప్రయోగం చేసే అవకాశాలెక్కువని 61 శాతం అభిప్రాయపడ్డారు. నల్లజాతివారు ఎక్కువమంది ఉండే ప్రాంతాల్లోనే వివక్ష ఎక్కువ! శ్వేతజాతీయుల మధ్య స్పల్ప సంఖ్యలో బతికే నల్లజాతివారు తక్కువ వివక్షకు గురవుతుండగా, ‘బ్లాక్’ మెజారిటీ ప్రాంతాల్లో వారు ఎక్కువ అన్యాయాన్ని, అణచివేతను రుచిచూస్తున్నారు. దేశంలో 64 శాతం నల్లవారు ఇతర జాతులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే వారికి వివక్ష తక్కువే. నల్లజాతివారు మెజారిటీగా ఉన్న వాడల్లో వారికి అవసరమైన సందర్భాల్లో సైతం వివక్ష తప్పదనే భయంతో పోలీసులను పిలవడం లేదని 31 శాతం మంది చెప్పారు. నల్లజాతివారు అత్యధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో విద్యా బోధనలో నాణ్యత తక్కువని ఈ సర్వే చేసినవారికి 45 శాతం చెప్పారు. సమాజంలో జాతి వివక్ష వల్ల రోజూ అమెరికాలో 200 మందికి పైగా నల్లజాతివారు వృద్ధాప్యానికి ముందే మరణిస్తున్నారని వైద్యసేవల్లో జాతుల మధ్య అసమానతలపై అధ్యయనం చేసిన హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డేవిడ్ విలియమ్స్ చెప్పారు. ఈ సర్వే ఫలితంగా తాము సమస్యల పరిష్కారానికి ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మండే'గాంధీ'లా
కవర్ స్టోరీ : జూలై 18 ఇంటర్నేషనల్ మండేలా డే ‘నల్లసూర్యుడు’ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల సామూహిక స్వాతంత్య్ర ఆకాంక్షకు ప్రతీక. తర తరాల జాతి వివక్ష నుంచి దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలను విముక్తం చేసిన విజయ పతాక. తొంభయ్యేళ్లకు పైబడిన నిండు జీవితం గడిపిన మండేలా జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటం చిరస్మరణీయమైనది. జీవితంలో దాదాపు మూడోవంతు జైలు గోడల వెనుక మగ్గిపోయినా, ఏనాడూ తన ఆశయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదాయన. దక్షిణాఫ్రికా నుంచి జాతి వివక్ష పోరాటాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గమే తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకున్న మండేలాను జనం ‘దక్షిణాఫ్రికా గాంధీ’గా ప్రస్తుతిస్తారు. ఇద్దరికీ నడుమ కొన్ని వ్యత్యాసాలు ఉన్నా, పోరాట పథంలో ఇద్దరికీ చాలా సారూప్యాలూ ఉన్నాయి. అందుకే ‘మండే’గాంధీలా తెల్లవాళ్ల దురాగతాలపై ఉద్యమం సాగించారు. అసలు పేరు ‘గడుగ్గాయి’ నెల్సన్ మండేలాకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు హోలిషాషా. ఖోసా భాషలో హోలిషాషా అంటే గడుగ్గాయి అని అర్థం. బడిలో చేరినప్పుడు మింగానే అనే టీచర్ ‘నీ పేరేమిటి?’ అని అడిగింది. ‘హోలిషాషా’ అని అమాయకంగా చెప్పారు మండేలా. ‘ఈ పేరేమీ బాగాలేదు. ఇక నుంచి నీ పేరు నెల్సన్’ అని ఖరారు చేసింది ఆ టీచర్. అప్పటి నుంచి నెల్సన్ మండేలాగా స్థిరపడ్డ ఆ పేరు తర్వాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. స్వేచ్ఛా పిపాసకు పర్యాయపదంగా మారింది. దక్షిణాఫ్రికా కేప్ ప్రావిన్స్లోని వెజో గ్రామంలో ఖోషా భాష మాట్లాడే థెంబు తెగకు చెందిన రాచ కుటుంబంలో 1918 జూలై 18న పుట్టారు మండేలా. తండ్రి గాడ్లా హెన్రీ ఫాకన్యిస్వా థెంబు తెగకు నాయకుడు. అయితే, మండేలాకు తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన చనిపోయారు. దాంతో జోంగింతాబా డాలింద్యెబో అనే రాచప్రతినిధి మండేలాను దత్తత తీసుకున్నాడు. తెగ నాయకుడిగా మండేలాను తీర్చిదిద్దేందుకు ఆయన అహరహం శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన శ్రద్ధ ఫలితంగానే మండేలా బడిలో అడుగుపెట్టారు. థెంబు తెగలో నియత విద్య అభ్యసించిన తొలి వ్యక్తి మండేలానే. బడిలో చదువులోను, ఆటల్లోను చురుగ్గా ఉండేవారు. చదువుకునే రోజుల్లో బాక్సింగ్పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది. మహాత్ముడే రాజకీయ గురువు విద్యార్థి దశలో మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్కింగ్, అబ్రహాం లింకన్ల సిద్ధాంతాలు, వారి ఉద్యమ కార్యాచరణ మండేలాను విపరీతంగా ప్రభావితం చేశాయి. అయితే, మహాత్ముడే తన రాజకీయ గురువు అని, తాను పుట్టిన నేలలోనే మహాత్మాగాంధీ అహింసా ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని మండేలా స్వయంగా చెప్పుకున్నారు. మహాత్ముడి సిద్ధాంతాలతో తాను స్ఫూర్తి పొందినా, జీవితంలో తాను ఆయన నైతిక స్థాయిని, నిరాడంబరతను అందుకోలేకపోయానని కూడా వినమ్రంగా ఒప్పుకున్నారు. ‘గాంధీజీ ఎలాంటి బలహీనతలు లేని ఉదాత్త మానవుడైతే, నేను చాలా బలహీనతలు గల మామూలు మనిషిని’ అని మండేలా చెప్పిన మాటలు ఆయన నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తాయి. మహాత్ముడిని అమితంగా ఆరాధించే మండేలా భారత్ను పవిత్రస్థలంగా భావించేవారు. అందుకే, ఇరవై ఏడేళ్ల జైలు శిక్ష నుంచి విడుదలయ్యాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఆయన భారత్ను ఎంచుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్-దక్షిణాఫ్రికాల బంధం బలోపేతానికి కృషి చేశారు. దక్షిణాఫ్రికా మిత్రదేశాలలో భారత్ది అగ్రస్థానమని ప్రకటించారు. మహాత్ముడి అడుగుజాడలలో నడిచిన మండేలాను భారత్ కూడా అక్కున చేర్చుకుని, 1990లో దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. ‘భారతరత్న’ అందుకున్న తొలి విదేశీయుడు మండేలానే కావడం విశేషం. ‘భారతరత్న’ అందుకున్న మూడేళ్ల తర్వాత మండేలాకు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో మండేలాను అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతితో సత్కరించింది. విద్యార్థి దశలోనే ఉద్యమమార్గం మండేలా పుట్టే నాటికే దక్షిణాఫ్రికా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది. స్థానిక నల్లజాతి వారిపై వలస వచ్చిన తెల్ల పాలకవర్గాలు అడుగడుగునా వివక్ష చూపేవారు. సహజంగానే పోరాట స్ఫూర్తిగల మండేలాకు ఇది నచ్చేది కాదు. ఎవరి ఆధిక్యతా లేని సమ సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి తర్వాత ఆయనకు తెగ నాయకత్వ బాధ్యతలను అప్పగించాలనేది వారి కోరిక. పెద్దల ఆలోచన పసిగట్టిన మండేలా ఇంటి నుంచి పారిపోయి జోహాన్నెస్బర్గ్ చేరుకున్నారు. అక్కడ నైట్ వాచ్మన్గా, లా ఫర్మ్లో గుమస్తాగా రకరకాల పనులు చేస్తూ, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత విట్వాటర్స్రాండ్ వర్సిటీలో చేరి లా చదువుకున్నారు. లా కోర్సు చదువుకుంటున్న కాలంలోనే మండేలా ఉద్యమబాట పట్టారు. తన సహాధ్యాయి ఆలివర్ టాంబోతో కలసి 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి, పార్టీలో యువజన విభాగాన్ని ప్రారంభించారు. మండేలా నాయకత్వంలో పెద్దసంఖ్యలో యువకులు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఆఫ్రికాలో జాతివివక్ష కొనసాగిస్తున్న నేషనల్ పార్టీ 1948 ఎన్నికల్లో గెలుపొందడంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దక్షిణాఫ్రికా ప్రజలందరికీ సంపూర్ణ పౌరసత్వం డిమాండ్తో అహింసామార్గంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ రూపొందించిన ‘ఫ్రీడమ్ చార్టర్’ను కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ 1955లో ఆమోదించింది. ఈ పరిణామాలు మింగుడుపడని వలస ప్రభుత్వం అదే ఏడాది మండేలాతో పాటు 155 మందిని ‘దేశద్రోహం’ కింద అరెస్టు చేసింది. ఆరేళ్ల తర్వాత వారంతా 1961లో నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే, ఈలోగానే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతల్లో పొరపొచ్చాలు తలెత్తాయి. ఉద్యమంలో అహింసా పద్ధతులు నచ్చని వారంతా మిలిటెంట్ పద్ధతులపై మొగ్గుతూ పార్టీ నుంచి చీలిపోయి, 1959లో పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ మరుసటి ఏడాదే షార్ప్విల్లో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న ఆఫ్రికన్ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 69 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మారణహోమం తర్వాత దక్షిణాఫ్రికా అల్లర్లు, ఆందోళనలతో అట్టుడికింది. అరెస్టుల పరంపర మొదలు కావడంతో మండేలాతో పాటు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ నేతల్లో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అహింసామార్గంలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని, పంథా మార్చుకోవాలని మండేలా అప్పుడే నిశ్చయించుకున్నారు. సాయుధ పోరాటబాట షార్ప్విల్ కాల్పుల దరిమిలా తలెత్తిన పరిణామాలతో సాయుధ పోరాటం వైపు మళ్లిన మండేలా, వలస ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆఫ్రికన్ జాతీయవాదుల సమావేశంలో పాల్గొనేందుకు 1962 జనవరిలో రహస్యంగా దక్షిణాఫ్రికాను వీడి ఇథియోపియా వెళ్లారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి, ప్రవాసంలో ఉన్న ఉద్యమ సహచరుడు ఆలివర్ టాంబోను కలుసుకున్నారు. అల్జీరియా వెళ్లి గెరిల్లా పోరాట శిక్షణ పొందారు. అక్కడి నుంచి 1962 ఆగస్టులో స్వదేశానికి చేరుకుని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, మండేలా తలదాచుకున్న స్థావరం ఆచూకీపై అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వానికి ఉప్పందించడంతో కొద్ది రోజుల్లోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిస్తే, కార్మికుల సమ్మెను రెచ్చగొట్టి, అక్రమంగా దేశాన్ని వీడి వెళ్లినందుకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఖైదీ నంబర్ 46664 కొద్దినెలల్లోనే జోహాన్నెస్బర్గ్లోని ఉద్యమకారుల స్థావరంపై దాడులు జరిపిన పోలీసులకు సాయుధ పోరాటానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్పై నిషేధం విధించిన దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం మండేలా తదితర ఏడుగురు నేతలపై దేశద్రోహం, కుట్ర తదితర అభియోగాలు మోపింది. కోర్టు మండేలాతో పాటు ఏడుగురికీ 1964లో యావజ్జీవ శిక్ష విధించింది. ఆ శిక్ష ఫలితంగా మండేలా 27 ఏళ్లు జైలులోనే మగ్గిపోయారు. శిక్షా కాలంలోని మొదటి పద్దెనిమిదేళ్లు రాబెన్ ఐలాండ్ జైలులోని చీకటి గదిలో ఒంటరిగా కాలం వెళ్లదీశారు. జైలులో మండేలాకు ఇచ్చిన నంబర్ 46664. అంటే, 1964 సంవత్సరంలో అక్కడకు చేరుకున్న 466వ ఖైదీ. అక్కడ ఉన్నంత కాలం ఆయన భార్య విన్నీని మాత్రమే ఆరునెలలకోసారి వచ్చి చూసేందుకు అనుమతించేవారు. నరకానికి నకలులాంటి ఆ జైలులో అన్ని సంవత్సరాలు ఉన్నా, మండేలా ఏనాడూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మండేలా విడుదల కోరుతూ ఒత్తిడి అంతకంతకూ పెరుగుతూ రావడంతో దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం కాస్త తగ్గక తప్పలేదు. మండేలాను రాబెన్ ఐలాండ్ జైలు నుంచి 1982లో ప్రధాన భూభాగంలో ఉన్న పోల్స్మూర్ జైలుకు తరలించారు. జైలులో భద్రత తక్కువగా ఉందనే సాకుతో 1988 నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో ఉదారవాద నాయకుడు ఫ్రెడెరిక్ డబ్ల్యూ డీ క్లార్క్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఎత్తివేశారు. పార్టీలోని సంప్రదాయవాదులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా 1990 ఫిబ్రవరి 11న మండేలా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. నల్లసూర్యుడి ఉదయం విడుదలైన తర్వాత మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. జాతి వివక్షను అంతం చేసి, అన్ని జాతులతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో డీ క్లార్క్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇదివరకటి ప్రభుత్వాల్లా అణచివేత చర్యలకు దిగకుండా, డీ క్లార్క్ సానుకూలంగా స్పందించారు. జాతి వివక్ష సమస్య సామరస్యంగా పరిష్కారం కావడంతో 1993 డిసెంబర్లో మండేలా, డీ క్లార్క్ ఇద్దరూ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తర్వాత 1994 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మండేలా నేతృత్వంలో పోటీ చేసి, ఘన విజయం సాధించింది. అదే ఏడాది మే 10న మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలోనే జాతివివక్షకు తావులేని కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగి, పదవి నుంచి తప్పుకున్న తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి, సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని కృషి సాగించిన మండేలా వార్ధక్యంతో అనారోగ్యం బారినపడి, 2013 డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. అయితే, మండేలా జీవించి ఉండగానే, ఆయన గౌరవార్థం ఐక్యరాజ్య సమితి 2009లో ఆయన పుట్టినరోజు జూలై 18వ తేదీని ‘అంతర్జాతీయ మండేలా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది మండేలాకు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన గౌరవం. స్ఫూర్తినిచ్చిన కవిత జైలులో మగ్గిపోయిన కాలంలో మండేలా నిరాశను దరిచేరనివ్వకుండా ఉండటానికి విలియమ్ ఎర్నెస్ట్ హేన్లీ రాసిన ‘ఇన్విక్టస్’ కవితను పదేపదే వల్లె వేసేవారు. తోటి ఖైదీలకు తరచు ఈ కవితను వినిపించేవారు. ‘ఐయామ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్... ఐయామ్ ది కెప్టెన్ ఆఫ్ మై సోల్’ అంటూ ఈ కవితను నిరంతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందేవారు. సంసారంలో మండేలా మండేలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. నర్సుగా పనిచేసే ఎవెలిన్ మేస్ను 1944లో పెళ్లాడారు. మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. మత నియమాల ప్రకారం రాజకీయంగా తటస్థంగా ఉండాలన్న ఎవెలిన్ మాటలను పట్టించుకోకుండా, మండేలా ఉద్యమాల్లో కొనసాగారు. దీంతో 1958లో ఇద్దరూ విడిపోయారు. తర్వాత మండేలా విన్నీని పెళ్లాడారు. విన్నీనే ఎక్కువకాలం మండేలాకు బాసటగా ఉన్నారు. మండేలా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దక్షిణాఫ్రికా ప్రథమ మహిళ హోదాలో కూడా కొనసాగారు. అయితే, జీవిత చరమాంకంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. విన్నీ నుంచి విడిపోయిన తర్వాత మండేలా మానసికంగా ఒంటరైపోయారు. తర్వాత రెండేళ్లకు 1998లో మొజాంబిక్ అధ్యక్షుడి మాజీ భార్య గ్రాసా మాషెల్ను పెళ్లాడారు. పెద్ద కొడుకు మగతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ 2005లో మరణించడం మండేలాను బాగా కుంగదీసింది. చదువుకునే రోజుల్లో బాక్సింగ్పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది. వెండితెరపై మండేలా జైలు నుంచి విడుదలైన తర్వాత మండేలా వెండితెరపై కూడా మెరిశారు. అమెరికాలో ఆఫ్రికన్ సంతతికి చెందిన హక్కుల ఉద్యమకారుడు మాల్కమ్ ఎక్స్ జీవితం ఆధారంగా అదేపేరుతో స్పైక్ లీ 1992లో రూపొందించిన చిత్రంలో మండేలా ఒక టీచర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా చివర్లో కొద్దిసేపే కనిపించే ఈ పాత్రలో మండేలా తరగతి గదిలో విద్యార్థులను ఉద్దేశించి మాల్కమ్ ఎక్స్ ప్రసంగాన్ని ఉటంకిస్తారు. అరుదైన గౌరవాలు మండేలాకు లభించిన బిరుదులు, పురస్కా రాల సంగతి సరేసరి! అంతకు మించిన అరుదైన గౌరవాలు కూడా ఆయనకు దక్కాయి. కేప్టౌన్ నుంచి కాలిఫోర్నియా వరకు చాలా దేశాల్లోని చాలా నగరాల్లో మండేలా పేరిట నామకరణం చేసిన వీధులు కనిపిస్తాయి. మండేలా జైలులో ఉండగానే, 1973లో లీడ్స్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్న న్యూక్లియర్ పార్టికల్కు ‘మండేలా పార్టికల్’ అనే పేరు పెట్టారు. మండేలా మరణానికి ఏడాది ముందు పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్ర పూర్వయుగం నాటి వడ్రంగి పిట్ట జాతి పక్షి శిలాజాలను కనుగొన్నారు. ఆ పక్షికి ఆయన గౌరవార్థం ‘ఆస్ట్రాలోపికస్ నెల్సన్ మండేలాయ్’ అనే పేరు పెట్టారు. ప్రపంచంలో మండేలా తృతీయ ప్రపంచ దేశాలకు మండేలా ఒక ఆరాధ్యదైవం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆయన విశ్వసనీయమైన మిత్రుడు. అగ్రరాజ్యాల దురహంకారాన్ని ధిక్కరించి మరీ తమ తమ దేశాలను ప్రగతిమార్గం పట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో (క్యూబా), గడాఫీ (లిబియా) వంటి దేశాధినేతలకు ఆయన అనుంగు చెలికాడు. మొదట్లో మండేలాపై నిస్సిగ్గుగా వివక్ష ప్రదర్శించిన పాశ్చాత్యదేశాలు ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వంద్వప్రవృత్తిని ప్రదర్శించాయి. మండేలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ‘మన కాలంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం పాటుపడిన గొప్ప శక్తుల్లో మండేలా ఒకరు’ అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ గొప్ప సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే, మండేలా పట్ల అమెరికా తన ధోరణిని మార్చుకుందనుకుంటే పొరపాటే. మండేలాను, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ను అమెరికా 2008 వరకు ‘టై వాచ్లిస్ట్’లో ఉంచింది. అంటే, మండేలాకు నోబెల్ బహుమతి దక్కిన ఐదేళ్లకుగాని అమెరికా ఆయన పట్ల తన వైఖరిని మార్చుకోలేదు. ఆత్మకథకు సీక్వెల్! మండేలా జైలు నుంచి విడుదలయ్యాక తన జీవితానుభవాలన్నింటినీ గుదిగుచ్చి రాసిన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ 1994లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణ పొందింది. ఆఫ్రికన్ భాషలు సహా ప్రపంచంలోని పలు భాషల్లోకి ఇది అనువాదం పొందింది. అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిన కాలంలోను, ఆ తర్వాతి కాలంలోను తన అనుభవాలను కూడా మండేలా వివరంగా రాసుకున్నారు. అవి ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదు. ఆత్మకథ విడుదల తర్వాత మండేలా రాసుకున్న ఈ రాతల ఆధారంగా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ సీక్వెల్ను ప్రచురించేందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘పాన్ మ్యాక్మిలన్’ గత ఏడాది సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. -
మరోసారి నల్లజాతీయులపై పోలీసుల కాల్పులు
అమెరికా: మరోసారి అమెరికాలో జాతి వివాదం తలెత్తింది. ముస్సోరి పోలీసులకు నల్లజాతీయులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఫలితంగా పలు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరు గాయాలపాలయ్యారు. మొత్తం 20 సార్లకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు. గత ఏడాది నల్లజాతీయుడు మైకెల్ బ్రౌన్ ను ఎలాంటి కారణం లేకుండా పోలీసు అధికారి డారెన్ విల్సన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించకపోగా డారెన్ విల్సన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. దీంతో భారీ ఆందోళనకు నల్ల జాతీయులు దిగారు. వీరిని నిలువరించే క్రమంలో పోలీసులు 20 రౌండ్లకాల్పులు జరిపారు.