breaking news
Biryani Samples
-
చికెన్ బిర్యానీ.. అక్కర్లేదంటున్న కస్టమర్లు
చికెన్ బిర్యానీలో గొడ్డుమాంసం(బీఫ్) వాడుతున్నారనే నిర్థారణ అమ్మకందారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తో అమ్మకందారులు భారీ సంఖ్యలో కస్టమర్లను కోల్పోతున్నారు. బిర్యానీ ఉందా అంటూ వచ్చిన కస్టమర్లు, చికెన్ బిర్యానీ మాట చెప్పగానే ఆమడ దూరం పారిపోతున్నారట. తమకేమీ అక్కర్లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బక్రీద్ సందర్భంగా బిర్యానీలో గొడ్డుమాంసం వాడుతున్నారనే ఫిర్యాదులతో హర్యాణాలోని మెవాత్ జిల్లాలో సేకరించిన రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ శాంపిల్స్ను అధికారులు సేకరించారు. సేకరించిన ఏడు నమూనాల్లో బీఫ్ను గుర్తించినట్టు హిసార్లోని లాలా లజ్పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నిటీ, యానిమల్ సైన్సెస్ నిర్ధారించిన సంగతి తెలిసిందే. మండాకా గ్రామ సమీపంలోని అమ్మకందారుల నుంచి ఈ నమూనాలను సేకరించారు. దీంతో బిర్యానీ అమ్మకందారులకు తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగులుతోంది. హెచ్టీ నిర్వహించిన సర్వేలో రోడ్డు పక్కన బిర్యానీ అమ్మే 30కి పైగా విక్రయదారుల్లో, సగానికి పైగా మంది తమ వ్యాపారాలను వదిలివేసినట్టు తేలింది. మొదటి సారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, తీవ్ర స్థాయిలో కస్టమర్లను కోల్పోవాల్సి వస్తుందని 12 ఏళ్లకు పైగా బిర్యానీ వ్యాపారం చేపడుతున్న మహ్మద్ అక్బర్ అనే విక్రయదారుడు విచారణ వ్యక్తంచేస్తున్నారు. తనతో పాటు ఇతర విక్రయదారులు గోస్ట్ బిర్యానీని అమ్మడం ఎప్పుడో నిలిపివేశామని, బుధవారం అధికారులు వచ్చి తమ బిర్యానీ శాంపిల్స్ కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. శాంపిళ్ల సేకరణకు అధికారులు రావడంతో, నుహ్ మార్కెట్లో 50కి పైగా అమ్మకాలు కోల్పోయినట్టు వాపోయారు. తాము కేవలం చికెన్ బిర్యానీలను మాత్రమే అమ్ముతున్నట్టు తెలిపారు.అయితే బిర్యానీ అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు కోరకోవడం లేదని, ఆవు సంరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే తాము పాటిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బిర్యానీల్లో గొడ్డు మాంసాన్ని నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ సహాయంతో హోటళ్లలో బిర్యానీలను పరిశీలిస్తామని నోడల్ ఆఫీసర్ భారతీ అరోరా తెలిపారు. -
బిర్యానీలో గొడ్డు మాంసం
బిర్యానీ శాంపిల్స్లో గొడ్డుమాంసం(బీఫ్) ఉన్నట్టు తేలింది. హర్యాణాలోని మెవాత్ జిల్లాలో సేకరించిన రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ బిర్యానీలో బీఫ్ను గుర్తించినట్టు హిసార్లోని లాలా లజ్పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నిటీ, యానిమల్ సైన్సెస్ నిర్ధారించింది. సేకరించిన ఏడు బిర్యానీ శాంపిల్స్లో బీఫ్ ఉన్నట్టు యూనివర్సిటీ అధికార వర్గాలు చెప్పాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శక్తికాంత్ శర్మ ఈ ల్యాబోరేటరీ రిపోర్టును ప్రభుత్వానికి పంపించినట్టు వెల్లడించారు. పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం బిర్యానీ శాంపిళ్లు సేకరించి పరిశీలించాలని ఆదేశాలను జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు మెహతా పోలీసులు ఫుడ్ స్టాళ్లలో ఏడు బిర్యానీ నమూనాలను సేకరించి ల్యాబ్ టెస్ట్కు పంపారు. సేకరించిన ఈ ఏడింటిలోనూ బీఫ్ పాజిటివ్ అని తేలినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెటర్నిటీ ల్యాబ్ తెలిపింది. ఇది తీవ్రమైన నేరంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తితే ఎక్కువ శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తామని మెవాత్ పశుగణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. బిర్యానీల్లో గొడ్డు మాంసాన్ని నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ సహాయంతో హోటళ్లలో బిర్యానీలను పరిశీలిస్తామని నోడల్ ఆఫీసర్ భారతీ అరోరా తెలిపారు. అయితే మైనార్టీ కమ్యూనిటీని అవమానిస్తున్నారంటూ హర్యానా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఫ్తాబ్ అహ్మద్ విమర్శిస్తున్నారు.