breaking news
Battleship
-
విశాఖలో అమెరికా యుద్ధనౌక సోమర్సెట్..
-
సన్నద్ధం
ఈ అమ్మాయిని చూడండి. ప్రెట్టీగా ఉంది కదా! కానీ పేరేమిటో తెలీదు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ‘పత్లీ చోక్రీ’ గాప్రశంసలు అందుకుంటోంది. çపత్లీ చోక్రీ అంటే ‘సన్నటి పిల్ల’ అని అర్థం. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ‘పత్లీ’గా లేదు. ఒకప్పుడు ఉండేది. అప్పుడు అందరూ తనపై ప్రశంసల పూలజల్లులు కురిపించారు. అయితే మరీ సన్నగా ఉండడం అనారోగ్యమే తప్ప అందంగా కాదని ఆమె గ్రహించింది. ఆ గ్రహింపును ఫేస్బుక్లో ఒక పోస్ట్గా పెట్టింది! సన్నబడాలని కోరుకునే టీనేజ్ ఆడపిల్లలకు పనికొచ్చే పోస్ట్ ఇది. అందుకే ఈ పోస్ట్కు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రముఖ సోషల్సైట్ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ‘పత్లీ చోక్రీ’ రాసిన పోస్ట్లో ఏముంది?! టీనేజ్ గర్ల్స్ని ఈమె దేనికి సన్నద్ధం చేస్తోంది? ‘‘నాకప్పుడు పందొమ్మిదేళ్లు. టైఫాయిడ్ జ్వరంతో మూడు వారాలపాటు మంచం పట్టాను. ఒక్కసారిగా పదకొండు కిలోల బరువు తగ్గిపోయాను. జ్వరం నుంచి కోలుకుని కాలేజ్కి వెళ్తున్నాను. స్నేహితులంతా ఆశ్చర్యంగా చూశారు నన్ను. ‘ఏయ్! ఏం చేశావ్’ అని సంభ్రమంగా అడిగారు కొందరు. ‘చేయడానికి ఏముంది?’ ఆ ప్రశ్న అర్థం కాలేదు మొదట్లో. ‘ఎంత స్లిమ్గా ఉన్నావో తెలుసా, ఏ జిమ్కెళ్లావు’ అంటూ ప్రశంసలతో కూడిన ప్రశ్నలు. నిజమా! అంత బాగున్నానా... నాకూ విచిత్రంగానే అనిపించింది. ‘టైఫాయిడ్ జ్వరం వచ్చింది’ అని నేను మాట పూర్తి చేసే లోపు వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. ‘ఎంత అదృష్టమో నీది’ అని! జిమ్కెళ్లి వర్కవుట్లు చేసే పనిలేకుండా బరువు తగ్గినందుకు ఒకటే పొగడ్తలు. నాలో కూడా ఆసక్తి మొగ్గతొడిగింది. అప్పుడు నా బరువు 41 కిలోలు. ఇక ఏ మాత్రం బరువు పెరగకూడదనుకున్నాను. రోజూ వాంతి చేసుకోవడమే. నిజమే! భోజనం చేయడం, బాత్రూమ్లోకి వెళ్లి గొంతులో వేళ్లు పోనిచ్చి తిన్నది వాంతి చేసుకోవడం నా డైలీ రొటీన్. పత్లీ చోక్రీ (సన్నటి అమ్మాయి) అని ఎవరైనా అంటుంటే తల మీద నాకేదో కిరీటం పెట్టినట్లుండేది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. వందగ్రాములు కూడా బరువు పెరగకుండా మెయింటెయిన్ చేశాను ఆ రెండేళ్లలో. అప్పుడు తెలిసింది అదొక మానసిక సమస్య అని. బరువు పెరుగుతామనే భయంతో తిన్న అన్నాన్ని వాంతి చేసుకునే వ్యాధిని ‘బులీమియా’ అంటారని. అప్పుడు తొలిసారిగా నా ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పాను. డాక్టర్కు చూపించారు నన్ను. అప్పటి నుంచి భోజనం చేసిన తరువాత నన్ను బాత్రూమ్లోకి వెళ్లనివ్వకుండా కాపు కాశారు ఇంట్లో వాళ్లంతా. నా వంతు ప్రయత్నంగా ఆహారం పరిమాణాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయాను. నేను కోల్పోయిన బరువును తిరిగి పొందాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా దేహాకృతిని ఉన్నదున్నట్లుగా స్వీకరించడం నేర్చుకున్నాను. సన్నదనం మీద నా వ్యామోహం ఇంకా కొనసాగి ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యేవో తలుచుకుంటే భయమేస్తోంది’’.. అని 22 ఏళ్ల ముంబయి అమ్మాయి ఫేస్బుక్లో తన అనుభవాన్ని స్నేహితులతో పంచుకుంది. కౌన్సెలింగ్ కూడా ఇస్తోంది ఇప్పుడామె ‘బాడీ ఇమేజ్’ కారణంగా మానసిక ఆందోళన పడుతూ, డిప్రెషన్కు లోనయ్యే వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. అమ్మాయిలకు ఆమె చేస్తున్న సూచన ఒక్కటే. ‘మనమేమీ సినిమాల్లో నటించడం లేదు, పత్రికల కవర్ పేజీకి పోజులివ్వడమూ లేదు. అలాంటప్పుడు దేహాకృతి నాజూకుగా ఉండాలనే కోరిక అర్థం లేనిది. బాడీ ఫిజిక్ కోసం గంటలు గంటలు సమయం కేటాయించాలంటే ఉద్యోగాలతో సాధ్యమయ్యే పని కాదు. స్థూలకాయంతో అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడితే చాలు. బొద్దుగా ఉంటే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’ అని చెప్తోంది. ఆమె సోషల్ మీడియాలో చెప్పిన మంచిమాటలను ప్రధాన స్రవంతి మీడియా అందిపుచ్చుకుంది. కానీ ఆమె పేరు మాత్రం పత్లీ చోక్రీగానే ఉండిపోయింది. నవ్వులో నీరసం.. ఓ లక్షణం టీనేజ్ అమ్మాయిల్లో పాతికశాతం మంది ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతున్నారు. కొంతమంది సరిగా తినకుండా ‘అనెరొక్సియా నెర్వోజా’ బారిన పడుతుంటే, మరికొందరు తిన్న తర్వాత పావు గంట లోపే (అది జీర్ణమై శక్తిగా ఒంటికి పట్టే అవకాశం ఇవ్వకుండా) వాంతి చేసుకుంటూ ‘బులీమియా’ బారిన పడుతున్నారు. పలకరిస్తే నీరసంగా నవ్వడం, ఎక్కువ మాట్లాడే ఓపిక లేక పొడి పొడిగా మాట్లాడి సరిపెట్టుకోవడం, ఎక్కువ సేపు ఒక పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి వీళ్లలో కనిపించే లక్షణాలు. అందం అనేది సన్నగా ఉండడంలో ఉండదని, ఆరోగ్యంగా ఉండడంలోనే ఉంటుందని తెలియచెప్పడానికి ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా పత్లీ చోక్రీ కేసునే ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. – మంజీర -
యుద్ధనౌకలో మిస్ఫైర్!
• నేవీ సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్ సింగ్ మృతి • ఐఎన్ఎస్ కతార్లో పిస్టల్ శుభ్రం చేస్తుండగా ఘటన • ఆత్మహత్య అనే అనుమానాలు సాక్షి, విశాఖపట్నం/మల్కాపురం: పిస్టల్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిన (మిస్ఫైర్) సంఘటనలో తూర్పు నావికాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్ సింగ్ మరణించారు. హర్యానాకు చెందిన సింగ్ విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ కుతార్ యుద్ధ నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నౌకలో విధి నిర్వహణలో ఉన్నారు. తన 9 ఎంఎం పిస్టల్ను శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలింది. తీవ్రంగా గాయపడిన సింగ్ను వెంటనే నేవల్ ఆస్పత్రి ఐఎన్ఎస్ కళ్యాణికి తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తేజ్వీర్ సింగ్ చనిపోయారని నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని సింగ్ కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం తెలియజేశారు. అయితే సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నేవీ అధికారులు ఒక సూసైడ్ నోటును గుర్తించినట్లు తెలుస్తోంది. నౌకాదళ అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. వారి ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కేశవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సబ్మెరైన్లో విద్యుత్ షాక్తో సైలర్ మృతి ఐఎన్ఎస్ సింధుధ్వజ్ సబ్మెరైన్లో విద్యుత్ షాక్తో ఎలక్ట్రికల్ పవర్ సైలర్ పవన్కుమార్ పాండే మృత్యువాత పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేవీ అధికారుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాండే షాక్కు గురికాగానే నేవల్ ఆస్పత్రి ఐఎన్ఎస్ కళ్యాణికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఆయన మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై నౌకాదళం విచారణకు ఆదేశించింది. -
యుద్ధ నౌక జలప్రవేశం
మల్కాపురం(విశాఖ): హిందుస్థాన్ షిప్యార్డ్ నిర్మించిన యుద్ధనౌక(వీసీ11184) సోమవారం జలప్రవేశం చేసింది. భారత రక్షణ శాఖ కోసం నిర్మించిన ఈ నౌకను సముద్ర అంతర్భాగంలో పరిశోధనల నిమిత్తం వినియోగించనున్నారు. శత్రువుల సమాచారం అతి సులువుగా తెలుసుకొనే విధంగా ఈ నౌకను రూపొందించినట్లు సమాచారం. 2014లో దీని నిర్మాణానికి ఆర్డర్ తీసుకున్న షిప్యార్డ్ నిర్ణీత సమయానికంటే ముందుగానే నౌకను సిద్ధం చేసింది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకను స్థానిక షిప్యార్డ్ అధికారులు జలప్రవేశం చేయించారు. అయితే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. -
బెన్ హర్ కొత్త రీమేక్
ప్రసిద్ధ హాలీవుడ్ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఎం.జి.ఎం. వారి సింహం ప్రతి సినిమా ప్రారంభంలోనూ గర్జిస్తుంది. కానీ ‘బెన్ హర్’ చిత్రంలో ఆ సింహం గర్జించలేదు. అయినా ఐదున్నర దశాబ్దాలుగా ‘బెన్ హర్’ విజయ ఢంకా గర్జన వినిపిస్తూనే ఉంది. ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డుల్ని గెలుచుకున్న ఈ క్లాసిక్ చిత్రం తన చరిత్రని తనే విస్తరించుకుంటూ ఇంకో బెన్ హర్గానూ అవతరించబోతోంది. ఈ సందర్భంలో బెన్ హర్ గురించి ‘వివరం’గా... ముఖచిత్రం: యుద్ధనౌక మీద తెడ్డు వేసే బానిసగా బెన్ హర్ పాత్రధారి చార్ల్టన్ హెస్టన్ ఒక సినిమా ఒక్కో తరం సోపానమెక్కుతూ కాలదోషాన్ని కాచుకోవడమంటే మాటలు కాదు. అలాంటిది అవలీలగా రెండు తరాలూ దాటుకుని, నేటి మూడో తరం ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అంతే బలంగా చూరగొనడం ‘బెన్ హర్’కే చెల్లింది. కేవలం ఒక సినిమా మాత్రంగానే ఇది కాలవాహికలో ప్రయాణిస్తూ పోవడం లేదు - సర్వాంతర్యామిలా సర్వరూపాలూ ధరించేస్తూ, మనం తొడుక్కునే బట్టల దగ్గర్నుంచి గృహోపకరణాలు, ఆభరణాలు, కారొప్పొడి, పళ్ల పేస్టు, కళ్లద్దాలు, కాఫీ పొడి, వీడియో గేమ్స్, కామిక్సు... బ్లూరే వెర్షన్సు... ఐ ట్యూన్ డౌన్ లోడ్సు... వగైరా వగైరాలకు ఒక బ్రాండ్నేమ్గా తరాల తారతమ్యం లేని గమ్యంగా అప్రతిహతంగా పురోగమిస్తోంది. ప్రేమానురాగాలు, కుటుంబ - స్నేహ సంబంధాలు, ప్రతీకారాలు, మత విశ్వాసాలు వంటి సార్వజనీన భావోద్రేకాలే బెన్ హర్ని సమకాలీనం చేస్తున్నాయని ఇంకా వేరే చెప్పుకోనవసరం లేదు. ప్రత్యేకించి మత విశ్వాసాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏసుక్రీస్తు ఉనికితో ఆధ్యాత్మిక కోణం అనే అదనపు సినిమాటిక్ విలువ జతపడింది. దీనికి ఆధారం ‘బెన్ హర్ : ఎ టేల్ ఆఫ్ ది క్రైస్ట్’ (1880) అనే మహాగ్రంథం. ఆ గ్రంథ రచయిత లివ్ వాలేస్. ఆ మహోద్గ్రంథమే కాలపరీక్షకు తట్టుకుని ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా 1959 నాటికి వేలమందికి ఉపాధి కల్పించింది. ఒక కావ్యం జనసామాన్యానికి కళ్లారా కనువిందు చేసే ఏకైక సామూహిక దృశ్య మాధ్యమం సినిమాగా రూపొందే స్థాయికి చేరిందంటే అది అమరమైనట్టే. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్ నుంచి దీని యాప్స్ని ఎనభై రూపాయలకే డౌన్లోడ్ చేసుకుని ఎంచక్కా చదువుకోవచ్చన్నమాట! ఇంకేం కావాలి? సినిమాతో పాటు ఈ రచనా కాలంలోకి ప్రయాణిస్తూనే ఉంటుంది ఎల్లకాలం. ఐతే ఇప్పుడు మనం చూస్తున్న 1959 నాటి బెన్ హర్ సినిమాకి ముందు మరికొన్ని బెన్ హర్లున్నాయి. మంచిచెడులు నవంబరులోనే! బెన్ హర్ సినిమాల కంటే ముందు బెన్ హర్ నాటకమే ఉంది. ఆ నాటకం వందేళ్ల తర్వాత మొన్నటికి మొన్న 2009లో మళ్లీ స్టేజికెక్కింది. 1899 నవంబర్ 29న మొదటిసారి నాటకంగా న్యూయార్క్లో ప్రారంభమైంది. డిసెంబర్7, 1907న మూకీ లఘు చిత్రంగా తొలిసారిగా వెండితెరకెక్కింది. 1925 డిసెంబర్ ఇరవైన మరో మూకీ చిత్రంగా విడుదలైంది. ఆ నిర్మాణ స్టూడియో ఎంజీఎమ్మే తిరిగి 1959లో ఇప్పుడు మనం చూస్తున్న బెన్ హర్ని రీమేక్గా నిర్మించి నవంబర్ 18న విడుదల చేసింది. కానీ నిర్మాత సామ్ జింబాలిస్ట్ సినిమా విడుదలకి ముందే, నవంబర్ 4, 1958న షూటింగ్లోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు! ఇలా నవంబర్ మాసంతో బెన్ హర్కి మంచీ చెడూ రెండూ ప్రాప్తించాయి. గ్రంథ ప్రచురణ, తొలి నాటకం, బెన్ హర్ రీమేక్, నిర్మాత మరణం ఇవన్నీ నవంబర్లోనే సంభవించాయి. పైగా తొలి, మలి మూకీలు రెండూ డిసెంబర్లోనే విడుదలయ్యాయి. 2003లో యానిమేషన్గానూ వచ్చింది. 2010లో టీవీ సిరీస్గానూ ప్రసారమైంది. మెట్రో గోల్డ్విన్ మేయర్(ఎం.జి.ఎం.) స్టూడియో 1925 నాటి బెన్ హర్ని రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించింది 1952లోనే. అంతలోనే స్టూడియోలు వచ్చేసి సినిమా థియేటర్ల మీద గుత్తాధిపత్యాన్ని వదులుకోవాలన్న కోర్టు తీర్పు శరాఘాతంలా తగిలి, పెపైచ్చు టీవీ ఛానెళ్లు వచ్చేసి సినిమా వ్యాపారాన్ని తూట్లు పొడవటంతో రీమేక్ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఐతే, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి స్టూడియోని గట్టెక్కించడానికి అప్పుడప్పుడే (1956లో) విడుదలైన ‘టెన్ కమాండ్మెంట్స్’ వంటి బైబిల్ కథాంశంతో కూడిన సినిమా అఖండ విజయం ధైర్యాన్నిచ్చింది. ‘టెన్ కమాండ్మెంట్స్’ని సాటి స్టూడియో పారమౌంట్ పిక్చర్స్ నిర్మించింది. ఈ స్ఫూర్తితో మొత్తమ్మీద ఎమ్జీఎమ్ 1957లో తన నూతన ఆవిష్కరణ 65 ఎం.ఎం. వైడ్ స్క్రీన్ ప్రాసెస్ అనే సాంకేతిక హంగుతో రీమేక్ని చేపట్టింది. ఇందుకు సామ్ జింబాలిస్ట్ని నిర్మాతగా ప్రకటించింది. బడ్జెట్ 70 లక్షల డాలర్లు. ప్రీ ప్రొడక్షన్ నాటికి కోటి డాలర్లు అని అంచనా వేశారు. తీరా నిర్మాణం ప్రారంభించే నాటికి, కోటిన్నర డాలర్లు అవసరమని లెక్కలేశారు. నిర్మాణం పూర్తయ్యేసరికి కోటి 52 లక్షల డాలర్లని లెక్క తేల్చుకున్నారు. స్క్రిప్టు రైటర్ కోసం కసరత్తు నిర్మాతగా వ్యవహరించిన సామ్ జింబాలిస్ట్ ఓ పట్టాన స్క్రిప్టుని ఒప్పుకునే మనిషి కాడు. నవల మాదిరిగా క్రైస్తవ ఆధిక్య సమాజాన్ని చూపించడానికి ససేమిరా అన్నాడు. భిన్న సంస్కృతుల అమెరికన్ సమాజమే కావాలని పట్టుబట్టాడు. పన్నెండు మంది రచయితల్ని పరీక్షించాడు. గోర్ విడల్ని ఖరారు చేశాడు. ఇంకో కృష్ణుడుగా క్రిస్టఫర్ ఫ్రై అనే రచయిత తెరపైకి వచ్చాడు. తర్వాత ఈ స్క్రిప్టు ఎవరిదన్న దానిమీద పెద్ద వివాదమే రేగింది. అంతిమ విజేత కార్ల్ టున్ బెర్గ్ అయ్యాడు. కానీ దర్శకుడు విలియం వైలర్ చేతికి ఆ స్క్రిప్టు వచ్చేసరికి పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. ఇది పరమ ఆటవికంగా ఉందని తిప్పికొట్టాడు వైలర్. హీరోలు, విలన్లు ఒక పద్ధతిగా లేరని చెప్పాడు. 1925లో మూకీ బెన్ హర్కి పనిచేసిన 30 మంది సహాయ దర్శకుల్లో విలియం వైలర్ ఒకడు. మూకీ బెన్ హర్ తర్వాత దర్శకుడుగా మారి, 1958 వరకూ 33 ఏళ్ల కాలంలో 57 సినిమాలకి దర్శకత్వం వహించాడు. వాటిలో ‘రోమన్ హాలిడే’, ‘డెస్పరేట్ అవర్స్’ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. రెండుసార్లు ఆస్కార్ అవార్డులు పొందాడు. ప్రస్తుత బెన్ హర్ తర్వాత మరో రెండు ఆస్కార్లు అందుకున్నాడు. 1970 నాటికి మరో అయిదు సినిమాలు తీసిన వైలర్, 1981లో 79వ ఏట మృతి చెందాడు. బెన్ హర్ స్క్రిప్టుకి సంబంధించి వైలర్ది ఒక్కటే అభ్యంతరం - ఆటవికంగా ఉందని. ‘‘అది నాకు తెలుసండీ, కానీ ఏం చేద్దాం? ఆ రథప్పందాల్ని మర్చిపోండి. అది సెకండ్ యూనిట్ చూసుకునే వ్యవహారం. మీరు దయచేసి ఆ మిగిలిన ఆటవిక తనానికి జీవం పోయండి. సంస్కరించండి, డెప్త్ తీసుకురండి. బాడీ - డెప్త్ - ఇంటిమసీ... వీటికే కదా మీరు ప్రసిద్ధులు. కానివ్వండి, అది పూర్తిచేస్తే ఆటవిక లక్షణాలు పోతాయని నా అభిప్రాయం’’ అని జింబాలిస్ట్ నచ్చజెప్పాడు. ఆ స్క్రిప్టు మీద పనిచేస్తున్న వైలర్కి కొన్నాళ్లకి మనసు మారి - దీనికి సరైన కథానాయకుడు లభించకపోతే తప్పుకుంటానని మళ్లీ మెలిక పెట్టాడు. అలాంటి కథానాయకుడుగా చార్ల్టన్ హెస్టన్ వచ్చి వైలర్ని మెప్పించగలిగాడు. కానీ హెస్టన్కి అంత త్వరగా ఆ అదృష్టం వరించలేదు. మరికొందరు హేమాహేమీలు కాలదన్నుకున్న తర్వాత వచ్చి ఒళ్లో పడింది. కాలదన్నుకున్న నట దిగ్గజాల్లో బర్ట్ లాంకాస్టర్ స్క్రిప్ట్ పరమ బోరుగా ఉందని తిరస్కరించాడు. పొడుగు జుబ్బాలు ధరిస్తే తన కాళ్లు అందంగా కనపడవని పాల్ న్యూమన్ కాదన్నాడు. మార్లన్ బ్రాండో, రాక్ హడ్సన్, జాఫ్రీ హార్న్, లెస్లీ నీల్సన్... ఇలా స్టార్లంతా ఇలాంటి వంకలే పెట్టి ఆస్కార్ అర్హత గల బెన్ హర్ పాత్రని చేజార్చుకున్నారు. ఆఖరికి ఇటలీలో కిర్క్ డగ్లస్ని కూడా అనుకున్నారు. అంతిమంగా చార్ల్టన్ హెస్టన్ ఎంపికయ్యాడు. అప్పటికి 1956లో టెన్ కమాండ్మెంట్స్లో మోజెస్గా నటించి ప్రముఖుడై ఉన్నాడు చార్ల్టన్ హెస్టన్. బెన్ హర్కి ముందు 1941 నుంచీ 21 సినిమాల్లో నటించాడు. బెన్ హర్ తర్వాత 2003 వరకూ మరో 62 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏర్పోర్ట్ 1975, ట్రూలైస్ ముఖ్యమైనవి. చివరికి 2008లో తనతో 64 ఏళ్లు కాపురం చేసిన భార్యని వదిలి, 84వ ఏట పైలోకాలకెళ్లిపోయాడు. చార్ల్టన్ హెస్టన్ (బెన్ హర్) లేకుండా ఈ మహాదృశ్య కావ్యాన్ని ఊహించగలమా? ఎర్రటి ఎండలో చుక్క నీటికోసం అల్లాడుతున్నాడు. అప్పుడు బైబిలు ఘట్టం! యోహాను 4:13-14 ‘‘అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవనమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను’’. ఇలా ఏసుప్రభువు దాహం తీరుస్తూంటే, అదేమిటి చివరికైనా కృతజ్ఞతాభావంతో చూడడే అన్పించినా, హెస్టన్ ఈజ్ హెస్టనే... ఆస్కార్ న్యాయనిర్ణేతల మనసు అలా గెలిచాడు. ఒకసారి నాటి ఆస్కార్ ప్రధానోత్సవ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం క్లిప్పింగ్ని చూస్తే - అవార్డునందుకుంటున్న హెస్టన్ కళ్ల నీళ్లు అచ్చంగా ఆ నిజజీవితపు అపూర్వ ఘట్టం తెప్పించినవే. కానీ మనకలాంటి నిజజీవితంలో కళ్లనీళ్లు కేవలం బెన్ హర్గా నటించి తెప్పించేస్తాడు! బెన్ హర్ని హాలీవుడ్ లెజెండ్గా ప్రతిష్టించి పెట్టినవాడు హెస్టన్. ముఖ్యపాత్ర జీసెస్ మాటేమిటి? షూటింగ్ ప్రారంభమైంది. 1958 మే 18న రోమ్ నగరంలో షూటింగ్ ప్రారంభమయ్యేనాటికి దర్శకుడు వైలర్ చదివింది మొదటి పదీ పన్నెండు పేజీల స్క్రిప్టే. స్క్రిప్టులో బెన్ హర్గా హెస్టన్ ఎంత ముఖ్యుడో అతడి తల్లీ చెల్లీ పాత్రల్లో ‘టెన్ కమాండ్మెంట్స్’లో హెస్టన్ తల్లిగా నటించిన మార్తా స్కాట్, వైలర్ మరదలు కేథీ ఓ డానెల్ అంతే ముఖ్యులు. ప్రేయసిగా హయా హరారీట్, బాల్య స్నేహితుడిగా స్టీఫెన్ బాయిడ్లు అంతే శ్రేష్ఠులు. అయితే... అయితే... అసలు అందరికంటే ముఖ్యపాత్ర జీసస్ క్రైస్ట్ మాటేమిటి? ప్రొడక్షన్ మేనేజర్ హెన్రీ హెనింగ్సన్ రోమ్ నగరంలో ఓ సంగీత విభావరికెళ్లినప్పుడు అక్కడ పాడుతున్న యువ అమెరికన్ సింగర్ కంఠస్వరం, అత్యంత సుందరమైన అతడి ఆధ్యాత్మికత ఉట్టిపడే ముఖారవిందమూ చూసి పరుగెత్తుకొచ్చి వైలర్, జింబాలిస్ట్ల చెవిన వేశాడు. తక్షణం అతన్ని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా కాకతాళీయంగా క్లాడ్ హీటర్ కరుణామయుడి పాత్రధారి అయ్యాడు. అయితే సినిమాలో అతడి పృష్ట భాగమే చూపించారు తప్ప ముందు నుంచి ఎక్కడా చూపించలేదు, ముఖం ఎక్కడా కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ప్రేక్షకుల ఇమాజినేషన్కి వదిలేస్తేనే న్యాయం చేసినవాళ్లవుతారు. ఇక టైటిల్స్లో క్లాడ్ హీటర్ పేరు కూడా వేయలేదు. 1927లో జన్మించిన క్లాడ్ హీటర్ ఇంకా జీవించే ఉన్నాడు. ఇంకా వేల మంది ఎక్స్ట్రాలు! 50 వేలమంది ఎక్స్ట్రాల కోసం రోమ్లో గాలించారు. ఈ ఎక్స్ట్రాలతో చాలా చిక్కొచ్చిపడింది. చిరునామాలుండవు, ఫోన్ నెంబర్లుండవు. సమాచారం చేరదు, వాళ్లకీ వీళ్లకీ చెప్పి పంపిస్తే ఆ సమాచారం చేరడానికి కొన్ని రోజులు పట్టేది. ప్రీ ప్రొడక్షన్లోనే కాస్ట్యూమ్స్కి, సెట్స్కి, ప్రాపర్టీస్కి సంబంధించి 15 వేల స్కెచ్చులు, డ్రాయింగులు స్టూడియో ఆర్ట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేసింది. 200 ఒంటెలు, 2,500 గుర్రాలు సమీకరించారు. క్లైమాక్స్లో రథప్పందాల్లో పాల్గొనడానికి 72 అశ్వాల్ని యుగోస్లేవియా నుంచీ, సిసిలీ నుంచీ ప్రత్యేకంగా రప్పించారు. సినిమాకి ఆయువు పట్టు లాంటి ఆ రథప్పందాల షూటింగ్ పూర్తిచేయడానికే మూడు నెలలు పట్టింది. ఈ షూటింగులో ఎంతో ఖరీదైన రెండు 70 ఎం.ఎం.లెన్సులు నాశనమయ్యాయి. మిగతా టాకీ పార్టు ఆరు నెలలు తీసుకుంది. చివర్లో కుష్టు వ్యాధిగ్రస్థులుగా చూపించాల్సిన తల్లీకూతుళ్ల పాత్రధారులిద్దర్నీ నెలరోజులు కుష్టు మేకప్లోనే వుంచేశాడు దర్శకుడు వైలర్. వాళ్లలాగే జీవించారు ఆ నెలరోజులూ. ఎట్టకేలకు 1959 జనవరి 7న ఆ చారిత్రాత్మక షూటింగ్ ముగిసింది. మొత్తం పదకొండు లక్షల అడుగుల ముడి ఫిలిం ఖర్చయ్యింది. ఎడిటింగ్ తర్వాత 19 వేల అడుగులతో, మూడు గంటలా 33 నిమిషాల స్క్రీన్ టైముతో విడుదలకి సిద్ధమయ్యింది. బెన్ హర్ కాపాడింది బెన్ హర్... కోర్టు తీర్పుతో, చానెళ్ల బెడదతో ఖాయిలా దిశగా దౌడు తీస్తున్న స్టూడియోని పుష్కలంగా ధనార్జన చేసి కాపాడింది. అది చేదు అనుభవాన్నే మిగిల్చి ఉంటే, తిరిగి అదే ఎమ్జీఎం స్టూడియో, పారమౌంట్ పిక్చర్స్తో కలిసి ఇప్పుడు మరోసారి రీమేక్ చేయడానికి సాహసించేది కాదు. అంత కచ్చితంగా 2016 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించేది కాదు. ఈ రీమేక్ ప్రస్తుత క్లాసిక్తో సాటి రాదో, వస్తుందో అప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం: ఓల్డ్ క్లాసిక్ ఎప్పుడూ ఓల్డ్ క్లాసిక్కే. రిఫరెన్స్కి ఎప్పుడూ నమ్మకమైన దిక్కే. చారిత్రక అంశాల్లో కచ్చితత్వానికి పెద్దపీట వేసిన బెన్ హర్ ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డులు కైవసం చేసుకుంది. మళ్లీ ఈ రికార్డుని చాలం కాలం తర్వాత ‘టైటానిక్’ బ్రేక్ చేసింది. ‘టైటానిక్’ రికార్డుని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ బ్రేక్ చేయగలిగింది. ప్రపంచ సినిమా చరిత్రలో బెన్ హర్ని మించిన కళాత్మక సాంకేతికం సాధ్యం కాదేమో. వైలర్కే ప్రత్యేకమైన ‘కాంపోజిషన్ ఇన్ డెప్త్’ అనే విజువల్ టెక్నిక్తో దృశ్యాలు ఊపిరి సలపనివ్వవు. అలా కళ్లప్పగించి చూస్తూండాల్సిందే. రాబర్ట్ సర్టీస్ ఛాయాగ్రహణం, మిక్లాస్ రోజ్సా సంగీతం... నటీనటుల అభినయాలు, సంభాషణలు, రథప్పందాల యాక్షన్ కొరియోగ్రఫీ... మొత్తంగా వెండితెర మీద నాటి పురాతన రోమ్ నగరపు నిలువెత్తు రంగుల శోభ బెన్ హర్! ఈ నవంబర్ 18తో 55 సంవత్సరాలు నిండిన ఈ క్లాసిక్ ఇంకా ముందు తరాల్ని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. సాత్విక - రాజసిక - తామసిక గుణాలతో కుదిపేస్తుంది - మనిషి ధర్మం ఎలా ఉండాలో ఉద్బోధిస్తుంది. జుడా బెన్ హర్ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారేచ్ఛతో ఎంత రగిలిపోయినా, దయామయుడి స్పర్శతో - క్షమాగుణం ఎంత శక్తిమంతమైనదో తెలుసుకోవడమే అతడి ముక్తికి మార్గమైంది. క్షమలోనే శాంతి ఉంది, పగ చల్లార్చుకోవడంలో లేనే లేదు. చిత్రం ముగింపు ఎంత హృద్యమో, ప్రారంభమూ అంతే ప్రశాంతమయం ఏసు జననంతో. అందుకే దర్శకుడు విలియం వైలర్ స్టూడియో అధిపతుల్ని కోరాడు - బ్యానర్ లోగోలో ఎప్పటిలా సింహం గర్జిస్తే ప్రారంభం రసభంగమౌతుందని. విజ్ఞులైన అధిపతులు అందుకు అంగీకరించారు. అందుకే ఆ సింహం ‘లియో ది లయన్’ సెలైంట్ అయింది, మూవీ బ్రిలియెంట్ అయింది. - సికిందర్ ఇదీ కథ క్రీస్తు శకం ఒకటో శతాబ్దపు రోమన్ సామ్రాజ్యంలో బెన్ హర్ ఒక ఐశ్వర్యవంతుడైన యూదు యువరాజు. చిన్ననాటి స్నేహితుడు మెసాలా రోమన్ సైన్యాధికారి. ఇద్దరికీ సైద్ధాంతిక విభేదాలు. యూదుల్ని రోమన్ ఉక్కుపిడికిలితో పాలించాలన్న కాంక్షతో వచ్చి, ఇక్కడ అవిధేయులైన యూదుల పేర్లు వెల్లడించమంటాడు మెసాలా. వాళ్లని చంపి ఒక హెచ్చరిక చేస్తానంటాడు. దీనికి బెన్ హర్ అంగీకరించడు. దీంతో ఇద్దరూ విరోధులవుతారు. పట్టణ వీధుల్లో ఒక ఊరేగింపులో భవంతి పైనించి ఒక పెంకు జారి మెసాలా మీద పడుతుంది. భవంతి పైన బెన్ హర్తో కలిసి ఊరేగింపు చూస్తున్న చెల్లెలి చేయి తగిలి వదులుగా ఉన్న ఆ పెంకు జారిపడిందన్న మాట. అసలే బెన్ హర్ మీద కోపంతో ఉన్న మెసాలా, దీన్ని తనమీద దాడిగా ఎంచి బెన్ హర్ చెల్లెల్నీ తల్లినీ చెరసాలలో వేసి, బెన్ హర్ని యుద్ధ నౌక మీద తెడ్డు వేసే బానిసగా పంపించేస్తాడు. అసలు జరిగిందేమిటో చెప్పి తనవాళ్లని వదిలెయ్యమన్నా వినిపించుకోడు మెసాలా. అక్కడ్నించీ బెన్ హర్కి పగ రగులుతుంది స్నేహితుడి మీద. ఆ నౌక మీది బానిసలకి, ఖైదీలకి దాహార్తి తీర్చే సామాన్యుడిలా ఉంటాడు ఏసుక్రీస్తు. నౌక మీద సముద్రపు దొంగల దాడి జరుగుతుంది. ఆ దాడిలో రోమన్ అధికారి ప్రాణాలు కాపాడతాడు బెన్ హర్. దాంతో ఆ అధికారి బెన్ హర్ని కొడుకుగా దత్తత తీసుకుంటాడు. అధికారి ఆప్యాయత ఎంత మాత్రం రుచించదు బెన్ హర్కి. మనసంతా మెసాలా చేసిన మోసం మీదే. ఎక్కడ్నునారో ఎలా ఉన్నారో ఇంకా తెలీని తల్లీ చెల్లెళ్ల మీదే. ఈ సమయంలో ఒక అరబ్ గుర్రాల వర్తకుడు పరిచయమౌతాడు. అతడి ద్వారా తెలుస్తుంది - త్వరలో జరగనున్న రథప్పందాల గురించి. అందులో పాల్గొనబోతున్న మెసాలా గురించి. వాణ్ని నువ్వోడించాలని తర్ఫీదునిచ్చి పందాల్లో దింపుతాడు బెన్ హర్ని అరబ్ వర్తకుడు. ఈ సందర్భంగా మెసాలాని కలిసి ఒక్కరోజు కోసం తనవాళ్లని విడుదల చెయ్యమని బెన్ హర్ వేడుకుంటే, వాళ్లెప్పుడో చనిపోయారంటాడు మెసాలా. దీంతో కుంగిపోయిన బెన్ హర్ అలాగే పందాల్లో పాల్గొంటాడు. ఆ పందాల్లో బెన్ హర్ చేతిలో చిత్తుగా ఓడిపోయి, కొనవూపిరితో ఉన్న మెసాలా - నీ తల్లీ చెల్లీ కుష్ఠు వ్యాధి సోకి లోయలో ఉన్నారని అసలు విషయం చెప్తాడు. లోయలో హృదయవిదారకంగా ఉన్న వాళ్లిద్దర్నీ చూసుకుని బావురుమంటాడు బెన్ హర్. ఇక సర్వ రక్షకుడు జీసస్సే శరణ్యమని వాళ్లిద్దర్నీ జీసస్ దగ్గరికి తీసుకుపోతూంటే - ఆ లోక రక్షకుడేమో శిలువెక్కుతూ..! మొదట ద్వేషించాడు! తర్వాత క్షమించమన్నాడు! బెన్ హర్ గ్రంథ రచయిత లివ్ వాలేస్ ఉద్గ్రంథాలు రాయాలంటే ఉగ్గుపాలప్పట్నించీ ఉదాత్త భావాల్ని ఉగ్గబట్టుకుని ఉండాలి. కానీ ‘బెన్ హర్’ లాంటి మహాగ్రంథ రచయిత లివ్ వాలేస్కి ఉగ్గుపాలప్పట్నించే క్రీస్తు అన్నా, క్రైస్తవం అన్నా అస్సలు వొంటికి పడలేదు. ఈ గ్రంథం రాయడానికి పూనుకున్నప్పుడు తను క్రైస్తవుడే కాదు. ఈ గ్రంథం రాసి క్రీస్తు అసలు దేవుడే కాదని నిరూపించదల్చుకున్నాడు. క్రీస్తు అనే నమ్మకాన్ని భూస్థాపితం చేయాలనుకున్నాడు. క్రీస్తు పునరుత్థానమే కాలేదనీ, క్రైస్తవమే బూటకమనీ స్థిరపర్చాలనుకున్నాడు. దీంతో 1873లో పరిశోధనకి పూనుకున్నాడు. ఏళ్ల తరబడి ఆ లోతైన పరిశోధన కాస్తా అతన్ని లోతైన క్రైస్తవంలోకే దిగ లాగింది. ఏసుక్రీస్తు అచ్చంగా దేవుడేనన్న నమ్మకాన్ని ససాక్ష్యంగా కల్పించింది. అప్పుడు ఒక్కసారిగా మోకాళ్ల మీద చతికిలబడి కుళ్లి కుళ్లి ఏడ్చి, గొంతెత్తి అరిచాడు - ప్రభువా నన్ను క్షమించమని! 1880లో గ్రంథ రచన పూర్తిచేశాడు. ప్రయాణాల్లోనూ, ఇంటి ముందు బీచ్లో చెట్టు కిందనూ కూర్చుని తడవతడవలుగా రాసి పూర్తిచేశాడు. తను తక్కువవాడేం కాదు. గ్రంథ రచన పూర్తిచేసే నాటికి న్యూ మెక్సికో గవర్నర్గా ఉన్నాడు. ఆ హోదాలోనే గులాబీ రంగు సిరాతో ముచ్చటగా ఫేర్ చేసిన రాత ప్రతితో ప్రచురణ కర్త దగ్గరికి న్యూయార్క్దాకా ప్రయాణించాడు. హార్పర్ బ్రదర్స్ సంస్థ అధిపతి మిస్టర్ జోసఫ్ హెన్రీ హార్పర్ చేతిలో ఆ రాత ప్రతిని పెట్టాడు. వాలేస్ రాసిన ఆ ప్రయోగాత్మక కాల్పనికానికి హార్పర్ చకితుడై, కళ్లకద్దుకుని ప్రచురించి, అదే సంవత్సరం -1880లో - నవంబర్ 12న విడుదల చేశాడు. 550 పేజీల ఆ ఉద్గ్రంథం ఒకటిన్నర డాలర్ ధరకి నెమ్మది నెమ్మదిగా అమ్ముడవుతూ పోయింది. 1900 కల్లా 36 ఆంగ్ల భాషా ఎడిషన్లలో ప్రచురణ అవడమే గాక, ఇరవైకి పైగా భాషల్లో అనువాదమైంది. ఈ భూమ్మీదికొచ్చినందుకు తన వంతు బాధ్యత అలా ప్రశంసనీయంగా నెరవేర్చిన వాలేస్, 1905 ఫిబ్రవరి ఐదున ప్రశాంతంగా కన్నుమూశాడు. బెన్ హర్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ షేక్ ఇల్డెరిమ్: ఒకే దేవుడంటే అర్థం చేసుకోగలను. ఒకే భార్యేమిటి? అనాగరికం! * మార్కెట్ ప్రాంతంలో బెన్ హర్ - మెసాలా వాదించుకుంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్లో వినిపించే డైలాగు: కిదర్ జాతా హై భాయ్, కిదర్ జాతా హై? * పాంటియాన్ పిలేట్: ఎదిగిన మనిషికి తను జీవిస్తున్న లోకం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ లోకం రోమ్ నగరం. * బెన్ హర్: దేవుడు నాకు పగదీర్చుకునే శక్తి నివ్వుగాక! నేను తిరిగి వచ్చే దాకా నువ్వు బతికే వుండాలని ప్రార్థిస్తున్నా. మెసాలా: తిరిగొస్తావా? * షేక్ ఇల్డెరిమ్: బల్తసార్ మంచి మనిషి.... కానీ అతనిలాగే అందరూ అయ్యేవరకూ మన ఖడ్గాలు మెరుస్తూ ఉండాలి! * బెన్ హర్: నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండకపోతే ముద్దిచ్చి గుడ్ బై చెప్పే వాణ్ణి. * ఈస్థర్: నేను పెళ్లి కూతుర్నై ఉండకపోతే చెప్పడానికి గుడ్ బైలే ఉండేవి కావు. * సెక్స్టస్: బుర్ర పగల గొట్టొచ్చు. అరెస్ట్ చేసి లోపలెయ్యెచ్చు. నరకంలో పడెయ్యొచ్చు. కానీ బుర్రలో ఉన్న ఐడియాల్ని ఎలా కంట్రోల్ చేస్తామబ్బా? ఐడియాలతో ఎలా పోరాటం చేస్తాం? * షేక్ ఇల్డెరిమ్: బుర్ర తక్కువ వెధవా, ఆ పగ్గాలిలా ఇవ్వు! నా గుర్రాల్ని జంతువుల్లాగా చూస్తావా? గొర్రెల్ని బర్రెల్ని తోలుకు వచ్చే వెధవ - గెటాఫ్ ఈడియెట్! * రియస్: నీ కళ్ళ నిండా ద్వేషం ఉంది. వెరీగుడ్! ద్వేషం మనిషిని బతికిస్తుంది. బలాన్నిస్తుంది. * సాలా: సెక్స్టస్! ఐడియాతో ఎలా పోరాడతామని అడిగావు కదూ? చెప్తా విను- ఐడియాని ఐడియాతోనే పోరాటం చేయాలి! -
అంబులపొదిలో ఐఎన్ఎస్ కమోర్తా
* యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి అరుణ్జైట్లీ * స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన జలాంతర్గాముల విధ్వంసక యుద్ధనౌక * పొరుగుదేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం: మంత్రి * విదేశాలకు దీటుగా భారత నౌకా నిర్మాణం విశాఖపట్నం: భారత నావికాదళ అంబుల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. శత్రు దేశాల జలాంతర్గాముల సింహస్వప్నంగా నిలిచే అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కమోర్తా’ భారత నావికాదళంలో భాగస్వామి అయింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక యుద్ధనౌకను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్జైట్లీ శనివారం జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం నేవల్బేస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశ సముద్రజలాల్లోకి చొరబడే శత్రుదేశాల జలాంతర్గాములను గుర్తించి విధ్వసం చేయగల సత్తా కమోర్తా సొంతమన్నారు. యాంటీ సబ్మెరైన్ వార్షిప్ (ఏఎస్డబ్ల్యూ) కొర్వెట్టే తరహాలో నిర్మించ తలపెట్టిన నాలుగు అత్యాధునిక కొర్వెట్టే యుద్ధనౌకల్లో ఇది మొదటిదని తెలిపారు. ఈ జలాంతర్గాముల విధ్వంసక నౌక డిజైన్ భారత నౌకాదళమే చేసిందని జైట్లీ వెల్లడించారు. ఐఎన్ఎస్ కమోర్తా 2013లో సీ ట్రయిల్స్ నిర్వహించారని, 2014 జూలై 12న భారత నావికా దళానికి నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) అప్పగించిదన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 190 యుద్ధనౌకలు, జలాంతర్గాముల్ని నిర్మిం చేందుకు రక్షణ శాఖ ప్రణాళిక రూపొందించగా అందులో 42 నిర్మాణదశలో ఉన్నాయని ఆయన తెలిపారు. అతిపెద్ద తీరప్రాంతం కలిగిన భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కాంక్షిస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీ పరిశ్రమలకు దీటుగా భారత్లో నౌకా నిర్మాణ పరిశ్రమ ఎదుగుతోందన్నారు. దేశంలోని ప్రైవేటు నిర్మాణ సంస్థలు సైతం రక్షణ శాఖ పీఎస్యూలతో పోటీపడుతున్నాయన్నారు. నౌకా నిర్మాణ రంగంలో హిందుస్థాన్ షిప్యార్డుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ, జీఆర్ఎస్ఇ ఎండీ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎ.కె. వర్మ, కమోర్తా కమాండింగ్ అధికారి కమాండర్ మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. కమోర్తా విశిష్టతలు ఇవీ.. - 110 మీటర్ల పొడవుతో 3,500 టన్నుల బరువుంటుంది. - 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతూ ఏకధాటిగా 3,450 నాటికల్ మైళ్ల వరకు వెళ్లగలదు. - నౌక ఉపరితలం మీదనుంచి గాలిలో లక్ష్యాల్ని చేధించడానికి వీలుగా క్షిపణులు మోహరించి ఉంటాయి. - యుద్ధనౌక ముందుభాగంలోని మెయిన్ గన్ 16 నాటికన్మైళ్ల లక్ష్యాల్ని చేధించగలదు. - ముందుభాగంలోనే ఉండే సోనార్ లక్ష్యాల్ని సులభంగా గుర్తించగలగుతుంది. - 13 మంది అధికారులు, 173 నావికులు కమోడోర్ మనోజ్ ఝా నేతృత్వంలో నిరంతరం సేవలందిస్తారు. - 1971లో ఐఎన్ఎస్ విక్రాంత్కు మార్గనిర్దేశం చేసిన విమాన వాహన నౌక కమోర్తా పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. - అండమాన్,నికోబార్ ద్వీప సముదాయంలోని ఓ ద్వీపం పేరే కమోర్తా. - ఈ యుద్ధనౌక డిజైన్ను డైరక్టరేట్ నావల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. - ఐఎన్ఎస్ కమోర్తా తరహా నౌక తొలుత 1965లో యూఎస్ఎస్ఆర్ నుంచి సబ్మెరైన్ చేజర్స్ నౌకగా భారత నావికా దళంలోకి చేరింది. - అది 1971 పాక్ యుద్ధంలోనూ, 1987 అమన్ ఆపరేషన్స్, 1989 పవన్ ఆపరేషన్స్, 1991 తషా ఆపరేషన్స్ తదితరాల్లో పాల్గొని 1991 అక్టోబర్ 31న సేవలు విరమించింది. -
తూర్పు నౌకాదళంలోకి కమోర్తా
రేపు ప్రారంభించనున్న రక్షణ మంత్రి విశాఖపట్నం: జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కమోర్తా తూర్పు నౌకాదళం అమ్ములపొదిలోకి చేరనుంది. శనివారం ఈ నౌకను రక్షణ శాఖ మంత్రి అరుణ్జైట్లీ నేవల్ డాక్యార్డులో ప్రారంభించనున్నారు. కొల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్యార్డ్లో దీనిని నిర్మించారు. ఇలాంటివి నాలుగు నిర్మించాలని నిర్ణయించగా అందులో తొలి నౌక కమోర్తా. ఈ యుద్ధనౌకల ప్రాజెక్ట్ డిజైను పూర్తికి నాలుగేళ్లు పట్టింది. గతేడాది జూన్లో కమోర్తా సీ ట్రయిల్స్ పూర్తిచేసుకుంది. భారత నావికా దళానికి నిర్మాణ సంస్ధ ఈఏడాది జూలై12నఅప్పగించారు. ఉన్నతశ్రేణికి చెందిన స్టీల్తో నౌక నిర్మితమైంది. ఇదీ స్వరూపం 13 మీటర్ల భీమ్ను కలిగి ఉండే కమోర్త నౌక 110 మీటర్ల పొడవుంటుంది. 25 నాటికన్ మైళ్ళ వేగంతో దూసుకుపోగలదు. 3500 నాటికన్ మైళ్ళ పాటు నిరంతర పయనం సాగించగలదు. పూర్తి ఆయుధ సామగ్రిని కలిగి సెన్సార్ల పరిజ్ఞానంతో అత్యంత ఆధునికత సంతరించుకుంది. భారీ టోర్పడేలు,ఎఎస్డబ్ల్యు రాకెట్స్,మధ్యంతర స్థాయి గన్,మరోరెండు మల్టీ బారన్ గన్లు ఈయుద్ధ నౌక సాధనసంపత్తి. 200 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సయితం గుర్తించగలదు. ఎఎస్డబ్ల్యు హెలికాఫ్టర్ను సయితం తీసుకుపోగలదు. 13 మంది అధికారులు173మంది నావికులతో కమోడార్ మనోజ్ ఝా నేతత్వంలో సేవలందించనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్కే ఈ యుద్ధ నౌక చేరి ప్రత్యేకతను చాటుకోనుంది. -
విక్రమాదిత్య జాతిపరం
ఐఎన్ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ ఐఎన్ ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక నుంచి: దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ నౌక నేవీలో చేరడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ‘‘నేడు దేశానికి చాలా ముఖ్యమైన రోజు. భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఐఎన్ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితం చేయడాన్ని నేను గర్వంగా భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం గోవా తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను మోడీ పరిశీలించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత సీ కింగ్ చాపర్పై యుద్ధనౌక పైకి చేరుకున్న ప్రధాని.. నేవీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 44,500 టన్నుల ఈ భారీ యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన అనంతరం కొద్ది గంటలపాటు నౌకపైనే కలియదిరిగారు. యుద్ధనౌక సామర్థ్యం, విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం మిగ్-29 యుద్ధ విమానంలో కూర్చున్నారు. ఆ తర్వాత నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. రక్షణ పరికరాల తయారీలో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ‘వార్ మెమోరియల్’ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రక్షణ సిబ్బందికి ‘ఒక ర్యాంకు.. ఒకే పెన్షన్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై వివిధ రకాల యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలను ప్రధాని మోడీ తిలకించారు. కాగా, రక్తదానంలో యువత చురుగ్గా పాల్గొనాలని ప్రధాని శనివారం రక్తదాన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బ్రహ్మోస్ సక్సెస్..
న్యూఢిల్లీ: యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారత్ సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా చేధించగలదు. ప్రయోగం సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలను విజయవంతంగా సాధించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని కార్వార్ తీరంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. మజ్గావ్ డాక్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకను ఇంకా నౌకాదళంలో ప్రవేశపెట్టలేదు. కదన రంగంలోకి దిగితే ఒకేసారి 16 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించగలిగే సత్తా ఐఎన్ఎస్ కోల్కతా సొంతం. ఐఎన్ఎస్ కోల్కతా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ తరహా యుద్ధనౌకలలో మొదటిది.విసృ్తత పరీక్షల అనంతరం వచ్చే జూలైలో దీన్ని నౌకాదళంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.రష్యా తయారీ తల్వార్ యుద్ధనౌకలు సహా పలు యుద్ధనౌకలలో బ్రహ్మోస్ క్షిపణి విధ్వంసక వ్యవస్థలను ప్రవేశపెట్టారు.సైనిక, వైమానిక దళాలలో బ్రహ్మోస్ క్షిపణులను ఇప్పటికే చేర్చారు.సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల నుంచి కూడా బ్రహ్మోస్ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనిక దళాలకు బ్రహ్మోస్ క్షిపణులను అందచేశారు.భారత్-రష్యాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభిన్న యుద్ధతంత్రాల కోసం పలు రకాల క్షిపణులను రూపొందించింది. మెరుపు వేగంతో దాడులు చేసే హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. -
సిరియా వైపుగా కదులుతున్న రష్యా యుద్ధనౌకలు
ఇస్తాంబుల్: సిరియాలో ప్రభుత్వం పౌరులపై రసాయన ఆయుధాలు ప్రయోగించిందన్న ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా దాడులకు సిద్ధమవుతుండగా.. మరో పక్క దాడులను వ్యతిరేకిస్తున్న రష్యా తన యుద్ధనౌకలను సిరియా వైపుగా పంపుతోంది. రష్యాకు చెందిన మూడు యుద్ధనౌకలు గురువారం టర్కీకి చెందిన బోస్ఫోరస్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని దాటి సిరియా తీరం వైపుగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతో మధ్యధరా ప్రాంతంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. సిరియా సంక్షోభం నేపథ్యంలో దాని మిత్ర దేశమైన రష్యా కొన్ని నెలలుగా నాలుగు యుద్ధనౌకలను అప్రమత్తం చేసింది. సిరియా నావికాదళ పోర్టులో రష్యాకు స్థావరం కూడా ఉంది. రసాయన దాడుల నెపంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐరాస అనుమతి లేకుండానే అమెరికా మిలటరీ దాడులు చేపట్టడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.