breaking news
Airport arrange
-
మామునూరులో.. ఎగరనున్న విమానం !
వరంగల్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై ఈ కేబినెట్లో స్పష్టత ఇచ్చింది. ప్రధానంగా మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 253 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏళ్లతరబడిగా ఎయిర్పోర్ట్ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతోంది. వెయ్యి ఎకరాల స్థలానికి గాను 270 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 730 ఎకరాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఫెన్సింగ్ చేసింది. అయితే మరో 431 ఎకరాలు కావాలని సూచించిన అధికారులు చివరకు 253 ఎకరాలైనా పరవాలేదన్నారు. దీంతో ఎయిర్పోర్ట్కు 253 ఎకరాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలపడంతో త్వరలోనే మామునూరు నుంచి విమానాలు ఎగరవచ్చన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ఉద్యానవన కళాశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు.. రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ విలీనం చేసుకోవడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 3న అసెంబ్లీలో బిల్లు పెట్టి అమల్లోకి తేనున్నారు. దీంతో వరంగల్ రీజియన్ పరిధిలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన 3,627 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతో పాటు వివిధ కేడర్లకు చెందిన కార్పొరేషన్ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాకు ‘వరద’ సాయం.. ఉమ్మడి వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహా యక చర్యల కోసం రూ.500 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఇందులో సుమారు రూ.237 కోట్ల వరకు ఉమ్మడి వరంగల్కు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు రూ.587 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో వరదల వల్ల రూ.1,000 కోట్లకుపైనే నష్టం జరిగి ఉంటుందని అంచనా. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన 32 మందికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈసారి భారీగా నష్టం జరిగిందని అభిప్రాయపడిన మంత్రివర్గం.. అన్ని విధాల అండగా ఉండాలని, సీనియర్ అధికారులను ఇన్చార్జ్లుగా నియమించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. -
విమానాలు ఎగరాలంటే..
తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి సుమారు 250 ఎకరాలతోపాటు మరో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడి విమానాశ్రయ భూములను పరిశీలించేందుకు బుధవారం వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృంద సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఇదే సమయంలో పట్టణంలో మానవ రహిత విమాన తయారీ కేంద్రాన్ని రూ.రెండు వేల కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవల ప్రకటించారు. దీనివల్ల మూడువేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఇదే క్రమంలో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తదనంతర ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో భాగంగా మానవరహిత విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారా లేక విమానాశ్రయ నిర్మాణ పనుల్లో భాగంగా సర్వే పనులు జరుగుతున్నాయా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది. మొత్తం 350 ఎకరాలు అవసరం విమానాశ్రయం ఏర్పాటుకు 350 ఎకరాల భూమి అవసరం అవుతుందని సర్వే నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చిన రైట్స్ సంస్థ సీనియర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ( ఎయిర్పోర్ట్స్) సంజీవ్ జాన్ తెలిపారు . ఆయనతోపాటు అసిస్టెంట్ మేనేజర్ ఎస్హెచ్ గోవర్, సర్వేయర్ రౌతు రామకృష్ణ విమానాశ్రయ భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలను బుధవారం సేకరించి వెళ్లారు. విమానాశ్రయం ఏర్పాటుకు 350 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 247 ఎకరాలు పోను, మిగిలిన 103 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న 247 ఎకరాల భూమిని విమానాశ్రయ పనులు చేపట్టే సంస్థకు దఖలు పర్చే విధంగా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అనంతరం మిగిలిన భూమిని రైతుల నుంచి సేకరిస్తారు. ఎక్కడిదీ రైట్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 1974లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ( రైట్స్) పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ప్రారంభంలో రైల్వే రవాణా రంగానికి కన్సల్టెన్సీ సేవలను ఈ సంస్థ అందించేది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్స్ వంటి పనులు ఈ సంస్థ చేపడుతుంటుంది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, హైవేలు, అర్బన్ ప్లానింగ్ వంటి పనులను ప్రపంచంలోని 30 దేశాల్లో ఈ సంస్థ చేపడుతోంది. తాజాగా డీజిల్ లోకో లీజింగ్ సర్వీస్లోకి ప్రవేశించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటుకు సర్వే జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు ఏలూరు అర్బన్ : ఆర్టీసీ బస్సులను ఏలూరు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న కండక్టర్లు, డ్రైవర్లపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆర్టీసీ అధికారులు బస్లను ప్రైవేటు కార్మికులతో బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టగా, ఆర్టీసీ ఉద్యోగులు నిరోధించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మహిళా కండక్టర్లు, డ్రైవర్లతో కలిసి 38 మందిపై కేసు పెట్టారు.