ప్రేమ, శాంతి సందేశాలతో క్రిస్మస్ పండుగ వచ్చేసింది. చర్చిలు వెలుగుల కాంతులతో కళకళలాడుతున్నాయి. భక్తుల గీతాలు, ప్రార్థనలతో పవిత్రత నిండిన వాతావరణం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండల గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఉన్న నిర్మలగిరి కొండపై మేరీ మాత ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
ఒకప్పుడు ఈ కొండపై అంతా ముళ్లపొదలు ఉండేవి. ఏలూరుకు చెందిన బిషప్ జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు.
తొలుత 1995లో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు.
2000 సంవత్సరంలో.. అఖండ దేవాలయం నిర్మాణం పూర్తయింది. ఈ దేవాలయం ఒకేసారి సుమారు 5,000 మంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా నిర్మించారు.
నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు.
క్రిస్మస్ వేళ.. వెలుగుల క్షేత్రంగా మారే ఈ చోట వేలాది మంది భక్తులు చేరి పండుగ ఆనందాన్ని పంచుకుంటారు.


