ప్రశ్నించినందుకు ప్రాణం పోయింది!
మైసూరు: మొబైల్లో తన భార్యను వేధిస్తున్నందుకు ప్రశ్నించడానికి వెళ్లిన వ్యక్తిపై యువకులు మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జిల్లాలోని నంజనగూడు తాలూకాలో జరిగింది. కోణనూరు పట్టణానికి చెందిన మహదేవస్వామి భార్య ఇటీవల మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి సమీపంలోని మొబైల్ దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో మొబైల్ దుకాణం నిర్వాహకుడు యోగేశ్ ఆమె నంబర్ను సేవ్ చేసుకొని ప్రతీరోజు అశ్లీల ఫోటోలు, అసభ్య సందేశాలు పంపిస్తూ వేధించేవాడు.
దీంతో ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పడంతో నిందితుడు యోగేశ్ను ప్రశ్నించడానికి భర్త వెళ్లాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో యోగేశ్ తన స్నేహితులతో కలసి మహదేవ్పై మారణాయుధాలతో దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహదేవ్ను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మహదేవ్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.