ప్రజా ప్రయోజన వ్యాజ్యం | What is Public Interest Litigation, how it will be filed | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రయోజన వ్యాజ్యం

Mar 1 2017 10:51 PM | Updated on Sep 2 2018 5:28 PM

ప్రజా ప్రయోజన వ్యాజ్యం - Sakshi

ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ప్రజాప్రయోజన వ్యాజ్యమనేది న్యాయం పొందడం కోసం న్యాయస్థానాలు ప్రజలకు అందజేసిన ఓ ఆయుధం వంటింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు, కిందిస్థాయి కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసినట్లు తరచూ పేపర్లలో వార్తలు వస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌ నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ స్థలాన్ని మార్చాలంటూ దాఖలు చేసిన  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా హైకోర్టు మంగళవారం విచారించింది. ధన్‌ గోపాల్‌ రావు అనే వ్యక్తి ఈ పిల్‌ దాఖలు చేశారు.

దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌లకు, హైదరాబాద్‌ డీసీపీకి హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అసలు పిల్‌ అంటే ఏమిటి? ఎవరు? ఎప్పుడు? దాఖలు చేయవచ్చొ క్విక్‌రివ్యూలో తెలుసుకుందాం...

ప్రజా ప్రయోజన వ్యాజ్యం  అంటే?
ఒక వ్యక్తి కానీ, ఓ వర్గం కానీ తన సొంతం కోసం కాకుండా ప్రజా ప్రయోజనాన్ని ఆశించి కోర్టులో దాఖలు చేసే వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో Public& Interest Litigation అంటారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా న్యాయస్థానాలు ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం.

ఎందుకోసం?
ప్రజాప్రయోజన వ్యాజ్యమనేది న్యాయం పొందడం కోసం న్యాయస్థానాలు ప్రజలకు అందజేసిన ఓ ఆయుధం వంటింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత కోర్టులు జారీ చేసే ఆదేశాలతో బాధితులకు న్యాయం కలగడమే కాకుండా అనేక సందర్భాల్లో రక్షణ చర్యలు, బాధితు ప్రయోజనాల కోసం విధివిధానాలు రూపొందించడం వంటి మేలు కూడా జరిగింది.

ఎప్పుడు దాఖలు చేయవచ్చు?

  • సమస్యపై పోరాడేందుకు బాధితుడి వద్ద అవసరమైన వనరులు లేనప్పుడు లేదా ఆ వ్యక్తి న్యాయస్థానానికి వెళ్లే స్వేచ్ఛను హరించినపుడు లేదా అన్యాయంగా అడ్డుకున్నప్పుడు ఇటువంటి వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు.
  • అన్యాయం జరిగిన విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చినట్లయితే... న్యాయస్థానమే స్వయంగా విచారణ  చేపట్టవచ్చు. లేదా ప్రజాప్రయోజనాల కోసం కృషి చేసే వారెవరైనా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడం చేయవచ్చు.
  • సాయం కోరుతున్న వ్యక్తి స్వప్రయోజనాల కోసమో లేదా దురుద్దేశాలతోనో కాకుండా ప్రజల ఇబ్బందులకు పరిష్కారం పొందేందుకు విశ్వసనీయంగా ప్రవర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు సరిచూసుకుంటుంది. ఆ తర్వాతే విచారణకు స్వీకరిస్తుంది.


లేఖ కూడా వ్యాజ్యమే...
ప్రజలకు నష్టం కలిగిస్తున్న సమస్య తీవ్రతను, పర్యవసానాలను వివరిస్తూ ఎవరైనా న్యాయస్థానానికి లేఖ రాసినప్పుడు... ఆ లేఖపై సైతం కోర్టు స్పందించవచ్చు. ఆ లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వంటిదేనని కోర్టు భావించాల్సి ఉంటుంది. అటువంటి లేఖలను న్యాయస్థానాన్ని ఉద్దేశించి రాయాలే తప్ప ఏ న్యాయమూర్తిని ఉద్దేశించి రాయకూడదు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించిన మొట్టమొదటి న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎన్‌ భగవతి, జస్టిస్‌ వీఆర్‌ కృష్ణ అయ్యర్‌.

Advertisement
 
Advertisement
Advertisement