30వేల ఉద్యోగులపై ఆ కంపెనీ వేటు!
యూరప్లో అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న జర్మన్ కార్మేకర్ ఫోక్స్వాగన్ 30 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు ధృవీకరించింది.
వోల్ఫ్స్ బర్గ్ : యూరప్లో అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న జర్మన్ కార్మేకర్ ఫోక్స్వాగన్ 30 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు ధృవీకరించింది. కర్బన్ ఉద్గారాల స్కాంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఈ కంపెనీ, ఆ నష్టాల నుంచి బయటపడటానికి 2021లోపు 30వేల ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపింది. ఫోక్స్వాగన్, ఆ దేశ లేబర్ యూనియన్లు ఈ విషయాన్ని అంగీకరించాయి. తన ఫోక్స్వాగన్ బ్రాండును లాభాల బాటలో నడిపించడానికి, ఎలక్ట్రిక్, స్వీయనియంత్రణ కార్ల వైపు తమ వ్యాపారాలను మరల్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కర్బన ఉద్గారాల స్కాం అనంతరం కంపెనీ పడరాని పాట్లు పడింది. పలు దేశాల్లో ఈ కంపెనీకి భారీ నష్టపరిహారాలే ఎదురయ్యాయి.
జర్మనీలో కలిగిఉన్న తన అతిపెద్ద యూనిట్లో వ్యయాలు తగ్గించుకుని, పొదుపులను పెంచుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ యూనిట్ నుంచి కంపెనీకి అత్యధికంగా ఖర్చులు నమోదవుతున్నాయి. అదేవిధంగా డీజిల్ ఉద్గారాల చీటింగ్ స్కాండల్ నుంచి బయటపడటానికి అవసరమైన బిలియన్ల కొద్దీ యూరోలను సమకూర్చుకోవడంపై కూడా కంపెనీ ఫోకస్ చేసింది. ఉద్యోగాల కోత వివరాలను ఫోక్స్బాగన్ న్యూస్ కాన్ఫరెన్స్లో వివరించింది.
జర్మన్ ఒక్క దేశంలోనే 23వేల మంది ఉద్యోగాలపై వేటు వేసి, ఫోక్స్వాగన్ బ్రాండ్లో 3.9 బిలియన్ డాలర్లను (రూ.26,596కోట్లకు) వార్షిక పొదుపు చేసుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. మిగతా ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. ఫోక్స్వాగన్ గ్రూప్లో మొత్తం 6,10,076 ఉద్యోగులున్నారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టి, కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్టు కంపెనీ వాగ్దానం చేయడంతో లేబర్ యూనియన్ లీడర్లు ఈ కోతకు అంగీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సంప్రదాయ ఉద్యోగాలకు గుడ్బై చెబుతున్న ఈ కంపెనీ 9వేల ఉద్యోగాలను ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీలో సృష్టించనుంది.