భూ సేకరణ నిబంధనలపై పిటిషన్‌ | telangana agricultural trade union filed petition on land acquisition rules | Sakshi
Sakshi News home page

భూ సేకరణ నిబంధనలపై పిటిషన్‌

Jul 16 2017 3:59 AM | Updated on Sep 5 2017 4:06 PM

కేంద్ర భూ సేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర భూ సేకరణ నిబంధనలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

- హైకోర్టులో దాఖలు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- ముసాయిదా నిబంధనలు జారీ చేయలేదని ఆరోపణ
- నిబంధనల తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌:
కేంద్ర భూ సేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర భూ సేకరణ నిబంధనలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నిబంధనలకు సంబం« దించి తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములు పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు తేలేంత వరకు ఈ నిబంధనలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో రెవెన్యూ శాఖ (భూ సేకరణ) ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చారు. ‘చట్ట ప్రకారం ముసాయిదా నిబంధనలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రజలకు తగిన గడువు ఇవ్వాలి. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ నిబంధనలకు తుది రూపు ఇవ్వాలి. కాని ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాల సమర్పణకు నాలుగు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఇది సరికాదు’ అని పేర్కొన్నారు.

అభ్యంతరాలు పట్టించుకోలేదు..
ప్రస్తుత కేసులో ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది నోటిఫికేషన్‌ జారీ చేసిందని వెంకటరాములు ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ భూ సేకరణ చట్ట నిబంధనలను జూలై 10వ తేదీ వరకు జారీ చేయలేదు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను, గెజిట్‌ నోటిఫి కేషన్‌ను వెబ్‌సైట్‌లోనూ ఉంచలేదు. అయితే అక స్మాత్తుగా ముసాయిదా నిబంధనలకు సంబంధించిన జీవో 92 జారీ అయింది. ఈ జీవో జూలై 10న ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. జూన్‌ 30న జారీ చేసినట్లు పేర్కొంటూ తుది నిబంధనలకు సంబం ధించిన జీవో 120ని కూడా ప్రభుత్వం జూలై 10నే వెబ్‌సైట్‌లో ఉంచింది. ఉద్దేశపూ ర్వకంగానే ఈ రెండు జీవోలను జూలై 10వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంచ లేదు’ అని ఆరోపించారు. స్థానిక భాషల్లో ఉత్తర్వులు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బాధిత వర్గాల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఈ నిబంధనలను జారీ చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు.

Advertisement

పోల్

Advertisement