సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలపై మాట్లాడొద్దు: ప్రధాని మోదీ | stop talking on surgical strikes videos: PM Modi to his Ministers | Sakshi
Sakshi News home page

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలపై మాట్లాడొద్దు: ప్రధాని మోదీ

Oct 5 2016 3:50 PM | Updated on Aug 15 2018 6:34 PM

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలపై మాట్లాడొద్దు: ప్రధాని మోదీ - Sakshi

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలపై మాట్లాడొద్దు: ప్రధాని మోదీ

భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోల విడుదలపై కొందరు కేంద్ర మంత్రులు ఇష్టారీతిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లోని టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ల(దాడికి దిగబోయేముందు ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 28,29 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోల విడుదలపై పలువురు కేంద్ర మంత్రులు ఇష్టారీతిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ భేటీలో ప్రధాని.. వీడియోల విడుదలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మంత్రులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీకి చెందిన సీఎంలు, ఇతర నేతలు కొందరు 'మోదీ ఛాతి కొలతల'పై మాట్లాడటాన్ని కూడా పీఎం ఆక్షేపించినట్లు సమాచారం.

సర్జికల్ దాడుల వీడియోలు విడుదల చేయాలంటూ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వీడియోలను విడుదల చేయాలా? వద్దా? అనేదానిపైనా కేబినెట్ కమిటీ చర్చించింది. దాడుల వీడియోలను ఆర్మీ అధికారులు బుధవారమే కేంద్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. పలు మల్లగుల్లాల అనంతరం ప్రధాని మోదీ.. వీడియోలు నూటికి నూరు శాతం ఆర్మీకి సంబంధించిన విషయాలని, వాటిని విడుదల చేయాలా, వద్దా అనేది కూడా ఆర్మీ అధికారులే నిర్ణయిస్తాని అన్నట్లు తెలిసింది.

భేటీకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు రక్షణ, విదేశీ వ్యవహరాల శాఖల మంత్రులైన మనోహర్ పారీకర్, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం(అక్టోబర్ 2న) స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి రాజ్ నాథ్ మీడియాతో 'వీడియోలు విడుదల చేస్తాం'అని ప్రకటిచిన సంగంతి విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement