ఉక్కు ఉత్పత్తిలో మూడో స్థానానికి భారత్


న్యూఢిల్లీ: భారత్‌లో ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో అమెరికాను మించిపోయింది. 2015 జనవరి, ఫిబ్రవరి  నెలల్లో అమెరికా 13.52 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగా,  భారత్ 14.56 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) వెల్లడించింది. దీంతో ఉక్కు ఉత్పత్తి విషయంలో మూడో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని పేర్కొంది. డబ్ల్యూఎస్‌ఏ గణాంకాల ప్రకారం..

 

 వివిధ ఉక్కు కంపెనీల కొత్త ప్లాంట్లు ఈ ఏడాదిలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించనున్నందున భారత్‌లో ఉక్కు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో భారత ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది 100 మిలియన్ టన్నులను దాటొచ్చు. మరోవైపు సమీప భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే సూచనలు లేనందున ఈ దేశంలో ఉక్కు ఉత్పత్తి కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. గత నాలుగేళ్లుగా అమెరికాలో ఏడాదికి 86 నుంచి 88 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది ఉక్కు ఉత్పత్తి విషయంలో చైనా, జపాన్‌ల తర్వాత స్థానం భారత్‌దే కానున్నది. ఇప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న అమెరికాను భారత్ దాటేసే అవకాశాలున్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top