ఆ సీరియల్‌కు షాక్‌! | Sakshi
Sakshi News home page

ఆ సీరియల్‌కు షాక్‌!

Published Tue, Aug 29 2017 10:51 AM

ఆ సీరియల్‌కు షాక్‌!

తీవ్ర వివాదాస్పదమైన హిందీ సీరియల్‌ 'పెహ్రెదార్‌ పియా కీ'కు బ్రేక్‌ పడింది. సోనీ చానెల్‌ ఈ సీరియల్‌ ప్రసారాన్ని అర్ధంతరంగా నిలిపేసింది. తొమ్మిదేళ్ల బాలుడు 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొనే కథాంశంతో రూపొందిన ఈ సీరియల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. సోనీ చానెల్ సోమవారం నుంచి అర్ధంతరంగా దీని ప్రసారాలు నిలిపేసింది. సీరియల్‌ ఒక్కసారిగా నిలిచిపోవడం ఇందులో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు షాక్‌నిచ్చింది.

ఈ సీరియల్‌కు వ్యతిరేకంగా ఛేంజ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో చేపట్టిన ఆన్‌లైన్‌ సంతకాల సేకరణకు పెద్దస్థాయిలో మద్దతు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఈ సీరియల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైట్స్‌ కౌన్సిల్‌ (బీసీసీసీ)కు లేఖ రాశారు. రంగంలోకి దిగిన బీసీసీసీ సీరియల్‌ ప్రసార సమయాన్ని మార్చాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించడంలేదంటూ సీరియల్‌ ప్రారంభంలో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీరియల్‌లో కాలాన్ని కొంత ముందుకుతీసుకెళ్లి ప్రధాన పాత్రలు యుక్త వయస్సుకొచ్చిన తర్వాత ఎపిసోడ్స్‌ను  ప్రసారం చేస్తారని భావించారు. కానీ, వివాదాల నేపథ్యంలో సోనీ చానెల్‌ ఏకంగా సీరియల్‌ ప్రసారాన్నే నిలిపివేయడం 'పెహ్రెదార్‌ పియా కీ' యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనీ చానెల్‌ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తసున్నారు.

ఈ సీరియల్‌లో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్‌ కథ. బాలుడు యువతి వెంటపడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో ఈ సీరియల్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైమ్ టైమ్‌లో వ‌స్తున్న ఈ సీరియ‌ల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచ‌నా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement