ముంబై ఉగ్రవాద దాడిపై మళ్లీ విచారణ జరపాలన్న భారత్ డిమాండ్ను పాకిస్థాన్ తిరస్కరించింది.
లాహోర్: ముంబై ఉగ్రవాద దాడిపై మళ్లీ విచారణ జరపాలన్న భారత్ డిమాండ్ను పాకిస్థాన్ తిరస్కరించింది. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్రపై వాస్తవమైన ఆధారాలుంటే ఇవ్వాలని పాక్ డిమాండ్ చేసింది. విచారణ ముగింపు దశకు వచ్చిందని, పునర్విచారణ చేయడం సాధ్యంకాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదదాడిపై మళ్లీ విచారణ జరపాలని, సయీద్ పాత్రపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ చేసింది. కాగా 24 మంది భారత సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం మినహా, కేసు విచారణ పూర్తయ్యిందని పాక్ వెల్లడించింది. ముంబై ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించారు. పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చిన ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. సయీద్ ఈ దాడికి పథకం పన్నాడని భారత్ ఆరోపిస్తోంది. సయీద్ను, ఆయన అనుచరులు నలుగురిని లాహోర్లో హౌస్ అరెస్ట్ చేశారు.