సీఎం ఆహ్వానం.. రెండు వర్గాలుగా బీజేపీ | Nitish's dinner invite divides Bihar BJP | Sakshi
Sakshi News home page

సీఎం ఆహ్వానం.. రెండు వర్గాలుగా బీజేపీ

Mar 28 2017 10:53 AM | Updated on Jul 18 2019 2:17 PM

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పంపిన విందు ఆహ్వానం విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు.

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పంపిన విందు ఆహ్వానం విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు వెళ్లాలని, మరికొందరు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు.

సీఎం నితీష్ అధికార నివాసంలో జరిగే డిన్నర్ పార్టీకి వెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పగా.. తాము వెళ్లబోమని ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్, మరో సీనియర్ నేత నంద కిశోర్ యాదవ్ స్పష్టం చేశారు. సుశీల్ కుమార్‌తో పాటు బీజేపీకి చెందిన మరో 12 మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొననున్నారు. కాగా ఈ విందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్లాలని బీజేపీ నాయకులు మొదట నిర్ణయించింది. అయితే 2010లో నితీశ్ తమతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని మనసు మార్చుకున్నారు. అప్పట్లో పట్నాలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎల్‌ కే అద్వానీ, నరేంద్ర మోదీ హాజరైనపుడు.. ఆ పార్టీ నేతలకు పంపిన విందు ఆహ్వానాన్ని నితీష్ వెనక్కు తీసుకున్నారు.

కాంట్రాక్టు టీచర్లు, ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ చేసినందుకు నిరసనగా సీఎం విందు ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రేమ్ కుమార్, నంది కిశోర్ యాదవ్‌కు సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలు కూడా సీఎం ఆహ్వానాన్ని తిరస్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement