మావోల దాడిలో నలుగురు జవాన్లు మృతి | Maoist insurgent kill four soldiers in Central India | Sakshi
Sakshi News home page

మావోల దాడిలో నలుగురు జవాన్లు మృతి

Nov 28 2013 3:32 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోల దాడిలో నలుగురు జవాన్లు మృతి - Sakshi

మావోల దాడిలో నలుగురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి చేశారు.

చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. బుధవారం ముర్కీనార్ బేస్ క్యాంపులో సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం జరుగుతుండడంతో 50 మంది జవాన్లు రోడ్ ఓపెనింగ్ విధుల నిమిత్తం ముర్కీనార్, చేరామంగి ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో జవాన్లు నకున్‌పాల్ వద్దకు రాగానే అప్పటికే అక్కడ పొంచిఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.
 
  కాల్పులతో పాటు మావోయిస్టులు రహదారిపై, చెట్లపై అమర్చిన శక్తిమంతమైన 9 మందుపాతర్లను, 2 హ్యాండ్ గ్రనేడ్‌లను పేల్చడంతో జవాన్లు చెల్లాచెదురయ్యారు. ఈ కాల్పుల్లో ముందు వరుసలో వెళ్తున్న నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని అస్సాంకు చెందిన దగాతా బయాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దిలీప్‌కుమార్, అమితాబ్ మిశ్రా, మధ్యప్రదేశ్‌కు చెందిన మదన్‌లాల్‌గా గుర్తించారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. కాల్పుల అనంతరం మావోయిస్టులు జవాన్లకు చెందిన ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ 303 రైఫిళ్లతో పాటు గ్రనేడ్ లాంచర్‌ను అపహరించుకుపోయారు. కాగా, ఘటనా స్థలంలో పేలని ఐఈడీ, హ్యాండ్ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement