ఇరువురూ ప్రేమించుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించలేక ఇరువురూ ప్రేమను పక్కన పెట్టి వేరే వ్యక్తులను పెళ్లాడారు.
మధిర: ఇరువురూ ప్రేమించుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించలేక ఇరువురూ ప్రేమను పక్కన పెట్టి వేరే వ్యక్తులను పెళ్లాడారు. జీవిత భాగస్వాములతో ఇమడలేక ఆ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మధిరలోని హనుమాన్ కాలనీకి చెందిన నరసింహారావు (25), కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం భగవానులపురం గ్రామానికి చెందిన భూలక్ష్మి(22) గతంలో ప్రేమించుకున్నారు.
అయితే, ఆరు నెలల క్రితం వీరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు అయ్యాయి. అయితే, తమ జీవిత భాగస్వాములతో కలసి జీవించలేక నరసింహారావు, భూలక్ష్మి మంగళవారం మధిర పట్టణం బైపాస్ రోడ్డులో పురుగుల మందు తాగారు. వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందారు.