'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది' | I escaped death the same day Sheena Bora was killed, says Mekhail Bora | Sakshi
Sakshi News home page

'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది'

Aug 29 2015 11:42 AM | Updated on Sep 3 2017 8:21 AM

'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది'

'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది'

షీనా బోరా హత్య కేసులో ఎన్నో కొత్త విషయాలు, కుట్రలు వెలుగు చూస్తున్నాయి.

ముంబై: షీనా బోరా హత్య కేసులో ఎన్నో కొత్త విషయాలు, కుట్రలు వెలుగు చూస్తున్నాయి. తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా తన సోదరి షీనాను హత్య చేసిన రోజే (2012 ఏప్రిల్ 24)  తననూ చంపాలని ప్రయత్నించిందని మైకేల్ బోరా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే ప్రమాదం నుంచి తాను తప్పించుకున్నానని చెప్పాడు. ముంబై పోలీసు బృందంతో కలసి గువహాటి నుంచి ఇక్కడకు వచ్చిన మైకేల్ విచారణలో కీలక విషయాలు చెప్పాడు.

రాహుల్ ముఖర్జియాతో షీనా పెళ్లి విషయం గురించి మాట్లాడేందుకు ముంబైలో ఇంటికి రావాల్సిందిగా తన తల్లి పిలిచిందని మైకేల్ వెల్లడించాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చారని, తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని చెప్పాడు. ఆ సమయంలో షీనాను తీసుకువస్తామని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త (రెండో భర్త)  సంజీవ్ ఖన్నా వెళ్లారని, ఆ సమయంలో తాను ఇంట్లో నుంచి పారిపోయానని తెలిపాడు. షీనాతో పాటు తనను చంపేందుకు ఇంద్రాణి పథకం పన్నిందని చెప్పాడు. ఆ సమయంలో ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ విదేశాల్లో ఉన్నారని చెప్పాడు.

ఆ తర్వాత ఇంద్రాణి, ఖన్నా.. షీనాను తీసుకుని నిశ్చితార్థం కోసం ఉంగరం కొనేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. ఓ హాటల్లో ఆమెకు మద్యం తాగించి గొంతునులిచి చంపేశారు. ఆ తర్వాత వర్లిలోని ఇంద్రాణి ఇంటికి రాగా ఇంట్లో మైకేల్ కనిపించలేదు. మైకేల్ను కూడా చంపేందుకు ఇంద్రాణి పథకం వేసిందని కారు డ్రైవర్ రాయ్ కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. పీటర్పై తన పట్టు కోల్పోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతాననే ఉద్దేశంతో ఇంద్రాణి.. షీనాను చంపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేగాక షీనా.. రాహుల్ను పెళ్లి చేసుకుంటే ఆమె తన కుమార్తె అని అందరికీ తెలుస్తుందని కూడా భయపడినట్టు చెప్పారు. ఇంద్రాణి.. పీటర్ను పెళ్లి చేసుకునే సమయంలో షీనా తన కూతురనే విషయం దాచిపెట్టి సోదరిగా పరిచయం చేసింది. పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్ కాగా, మొదటి భర్త ద్వారా ఇంద్రాణికి పుట్టిన పిల్లలు షీనా, మైకేల్లు.

Advertisement
 
Advertisement
Advertisement