వినాయక చవితి వస్తే చేపలకు పండగే..! | Ganesh chaturthi becomes a feast for fish in mumbai | Sakshi
Sakshi News home page

వినాయక చవితి వస్తే చేపలకు పండగే..!

Sep 12 2015 5:11 PM | Updated on Sep 3 2017 9:16 AM

వినాయక చవితి వస్తే చేపలకు పండగే..!

వినాయక చవితి వస్తే చేపలకు పండగే..!

గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరైన ముంబైలో అటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు.. సముద్రంలో నివసించే చేపలకూ ప్రయోజనం కలిగేందుకు కొత్త పద్ధతులను పరిచయం చేస్తున్నారు.

వినాయక చవితి నవరాత్రులు వస్తున్నాయంటే సందడే సందడి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ హడావుడే. ఇటీవల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేలా మట్టితో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల తయారీపై జనంలో అవగాహన కల్పించడం కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఈసారి గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరైన ముంబైలో అటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు.. సముద్రంలో నివసించే చేపలకూ ప్రయోజనం కలిగేందుకు కొత్త పద్ధతులను పరిచయం చేస్తున్నారు ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ సభ్యులు.

ఎండిన మొక్కజొన్న, బచ్చలికూర మొదలైన పదార్థాలతో ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఆయా పదార్థాలను ఉచితంగా హోం డెలివరీ కూడా చేస్తున్నారు. ప్రతియేటా గణేష్ చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకొని దాదాపు లక్షన్నర విగ్రహాలను ముంబైలోని పలు నదులు, చెరువులు, సముద్రంలో నిమజ్జనం చేస్తుంటారు. ఈసారి మాత్రం ఈ నిమజ్జనం... నీటిలోని చేపలకు నిజమైన పండుగ అయ్యే అవకాశాన్ని సంస్థ సభ్యులు కల్పిస్తున్నారు. ఆహార పదార్థాలతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో.. అవి కరిగి చేపలకు ఆహారంగా మారుతున్నాయి.

నాలుగైదేళ్లుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల రూపకల్పనలో వివిధ కొత్త పంథాలను పరిచయం చేసిన సంస్థ.. ఈసారి కాలుష్య రహితంతో పాటు, చేపలకూ ఆహారాన్నందించేలా ఈ గింజ ధాన్యాల విగ్రహాలను పరిచయం చేశారు. మొదట్లో ఆహార పదార్థాలను విగ్రహాల్లో నింపడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. పదార్థాలు ఫంగస్ పట్టకుండా ఉండేందుకు పలు ప్రయోగాలు చేశారు. చివరికి ఎండబెట్టిన వాటిని వినియోగించడంతోపాటు, మార్కెట్లో విరివిగా దొరికే పదార్థాల వినియోగంతో, అవి నిల్వ ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పదార్థాలను కాగితాల్లో చుట్టి, పదిరోజుల పాటు ఎండబెట్టి వాటిని వినియోగిస్తున్నట్లు స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు.

పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ సంస్థ.. మొదట్లో మూడు నాలుగేళ్ల పాటు నిమజ్జనం తర్వాత బీచ్లను క్లీన్ చేయడంలో ఉత్సాహంగా పనిచేసేది. అయితే కేవలం బీచ్ లు శుభ్రం చేయడం వల్ల కాలుష్యాన్ని పూర్తిగా దూరం చేయలేమని, నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి మరింత కృషి అవసరమని గుర్తించారు. కాలుష్యకారకమైన వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని తగ్గించడంలో కృషి మొదలు పెట్టి, అందులో భాగంగానే ఈసారి గింజధాన్యాలు, మొలకలతో విగ్రహాల తయారీకి రూపకల్పన చేశారు. ముందుగా విగ్రహాలు తయారుచేసే వారిలో అవగాహన కల్పించి హానికారక రంగుల వినియోగాన్ని తగ్గించి సహజ రంగులతో పాటు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించారు. కొనుగోలుదారుల్లో కూడా అవగాహన కల్పించి 10-15 అడుగుల ఎత్తుండే హానికారక  విగ్రహాలకు బదులుగా రెండడుగుల కాలుష్యరహిత విగ్రహాలు కొనేలా ఒప్పించడంలో సంస్థ సక్సెస్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement