2019 నాటికే 15 రాష్ట్రాల్లో అందరికీ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని, మిగిలిన రాష్ట్రాల్లో 2022 నాటికి అందుబాటు లోకి వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
సాక్షి, న్యూఢిల్లీ: 2019 నాటికే 15 రాష్ట్రాల్లో అందరికీ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని, మిగిలిన రాష్ట్రాల్లో 2022 నాటికి అందుబాటు లోకి వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ శాఖ పురోగతిపై ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఇప్పటివరకు 2,008 నగరాల్లో 17.73 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చామన్నారు.
ఈ పథకాన్ని మధ్య తరగతి ఆదాయం కలిగిన వారికీ వర్తింపజేస్తున్నామన్నారు. బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఈ పథకం కింద సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచే యోచనలోఉన్నామన్నారు. ఏపీలో 1,95,047 ఆఫర్డబుల్ ఇళ్లకు అనుమతి ఇచ్చామని, 54,082 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 2,892 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. తెలంగాణలో 82,985 ఇళ్లకు అనుమతివ్వగా 20,640 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 776 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.