కొలీజియంపై ‘బార్’ విమర్శలు


న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలంగా మద్దతు తెలిపింది. కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు ఊరటనిస్తూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం ఇవ్వని జడ్జీలను ఈ కొలీజియం వ్యవస్థ అందించిందని ధ్వజమెత్తింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.



మానవ విలువలు, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో సామాన్యులకు న్యాయం అందించలేకపోవటం మనకు సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారితుడైన మాయా కొద్నాని వంటి వ్యక్తులు ఊరట పొందుతుంటే.. మరొకవైపు తీస్తా సెతల్వాద్ వంటి కార్యకర్తలు ముందస్తు బెయిలు కోసం అన్నివైపులా పరుగులు తీయాల్సి వస్తోందని ఆయన ఒక దశలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల వల్లే సినీతారలు, రాజకీయ నేతలకు తక్షణం ఊరట లభిస్తోందన్నారు. జడ్జీలు బురఖాలతో కోర్టుల ఆవరణలో తిరిగితే.. న్యాయవ్యవస్థ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవచ్చన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top