చనిపోయిన 12 ఏళ్లకు ఇంటర్వ్యూ కాల్! | 16 years on, supreme court judgement on APPSC Group-II | Sakshi
Sakshi News home page

చనిపోయిన 12 ఏళ్లకు ఇంటర్వ్యూ కాల్!

Oct 4 2016 3:00 AM | Updated on Sep 2 2018 5:18 PM

కరుణాకర్ స్వామి (ఫైల్) - Sakshi

కరుణాకర్ స్వామి (ఫైల్)

చనిపోయిన 12 ఏళ్లకు ఆ యువకుడికి గ్రూప్ 2 ఉద్యోగం లభించింది..

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలగన్న కరుణాకర్ స్వామి..
2000వ సంవత్సరంలో గ్రూప్-2 పరీక్షకు హాజరు
ఏకపక్ష ఫలితాలతో మరికొందరితో కలసి కోర్టుకు..
తాజాగా వారికి ఉద్యోగాలివ్వాలని సుప్రీంకోర్టు తీర్పు
ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాలో పేరు

 
చెన్నూర్: గ్రూప్-2 ఉద్యోగం సాధించాలని కలలుగన్నాడు.. కష్టపడి చదివాడు.. ఫలితాల్లో అన్యాయం జరగడంతో కోర్టు మెట్లెక్కాడు.. ఉద్యోగానికి అర్హుడేనంటూ దాదాపు 16 ఏళ్లకు తీర్పు వచ్చింది.. 19, 20తేదీల్లో ఇంటర్వ్యూకు రావాల్సిన జాబి తాలో పేరూ ఉంది.. కానీ దానికి అతను హాజరుకాలేడు.. ఎందుకంటే 12 ఏళ్ల కిందే మరణించాడు.  ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన వంగల కరుణాకర్‌స్వామి కథ ఇది.
 
 మంచి ఫలితాలు సాధించినా..
ఉమ్మడి రాష్ట్రంలో 1999లో వెలువడిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు ఆంత్రోపాలజీ, సోషియాలజీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కరుణాకర్‌స్వామి దరఖాస్తు చేసుకున్నాడు. 2000లో జరిగిన పరీక్షకు హాజరయ్యూడు.  ఫలితాలు అతన్ని నిరాశపర్చారుు. ఆ ఫలితాల్లో తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకున్న అభ్యర్థులే ఎక్కువగా ఎంపికయ్యారు. కరుణాకర్ ఆంత్రోపాలజీలో 150 మార్కులకుగాను 112 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు.
 
దీంతో ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కరుణాకర్‌తోపాటు మరో 54 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. అయితే 2004 జూన్ 16న కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి వెళ్లి వస్తుండగా.. వరంగల్ జిల్లా సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కరుణాకర్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, సోదరి చనిపోయూరు.
 
 ఇటీవలే వెలువడిన తీర్పు
సుప్రీంకోర్టులో ఉన్న ఆ గ్రూప్-2 వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ 54 మంది ఉద్యోగాలకు అర్హులేనని కోర్టు తీర్పిచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో టీఎస్‌పీఎస్సీ (దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏపీపీఎస్సీ) నిర్వహించే ఇంటర్వ్యూలకు వారంతా హాజరుకావాలని ప్రకటించింది. ఆ జాబితాలో కరుణాకర్ పేరు (హాల్‌టికెట్ నం.27046995) కూడా ఉంది. గ్రూప్-2 ఉద్యోగం సాధిం చాలనే కరుణాకర్ కల నెరవేరకుండానే కన్నుమూశాడంటూ సోదరుడు వంగల కృపాకర్, స్నేహితుడు కుడుదుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement