ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశం మరోమారు వాయిదా పడింది. పార్లమెంటు
నల్లగొండ : ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశం మరోమారు వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నామని, త్వరలోనే తేదీలను వెల్లడిస్తామని జెడ్పీ సీఈఓ మహేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. వాస్తవానికి పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాలు జరగడానికి వీల్లేదు.
ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉన్నందున చట్టసభలకు సంబంధించిన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందన్న ఆలోచనతో స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాలు నిర్వహించే ఆనవాయితీ లేదు. ఈ కారణంగానే సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అధికార వర్గాలు చెపుతున్నా..అంతర్గతంగా రాజకీయ విభేదాల కారణంగానే మరోమారు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలేవీ లేనందున, పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సిన ఎంపీలు (లోక్సభ, రాజ్యసభ సభ్యులు) అనుమతిస్తే సమావేశాలు నిర్వహించుకునే వీలుంది.
ఈ మేరకు ఎంపీల అనుమతి కోసం జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మంతనాలు జరిపినా పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని, నిబంధనలు ఎలా ఉంటే అలా వెళ్లాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తేల్చిచెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేశారని జెడ్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన ఇద్దరు ఎంపీలైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, బూర నర్సయ్య గౌడ్లు సమావేశాలు జరుపుకునేందుకు అంగీకరించారని, గుత్తా పెట్టిన మెలిక నేపథ్యంలోనే సమావేశాలు వాయిదా వేశారని సమాచారం. కాగా, జెడ్పీ చైర్మన్ నేరుగా గుత్తా సుఖేందర్రెడ్డితో మాట్లాడని నేపథ్యంలో జెడ్పీ సీఈవో మహేందర్రెడ్డి ఆయనను సంప్రదించారని తెలుస్తోంది. రూల్ ప్రకారం నడుచుకోవాలని సీఈఓకు గుత్తా తేల్చిచెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే, త్వరలోనే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మరో మూడు నెలలు ఈ సమావేశాలు జరిగే అవకాశం లేదని జెడ్పీ వర్గాలంటున్నాయి.