కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?  | Why the eye surgeries are distorted? | Sakshi
Sakshi News home page

కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి? 

Oct 9 2018 1:01 AM | Updated on Oct 9 2018 7:52 PM

Why the eye surgeries are distorted? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్‌ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది.  

ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్‌ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రొటోకాల్‌ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. 

ఆస్పత్రి సీజ్‌..? 
ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్‌కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్‌ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్‌ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement