గ్రామంలో ఎస్సీ కాలనీ సంబంధించిన బోరు మోటార్ పనిచేయడంలేదు. రెండు నెలలుగా దానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టడంలేదు.
సిద్దిపేట రూరల్, న్యూస్లైన్: నీటి కష్టాలను పట్టించుకునేవారు కరువవడంతో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. పాలకవర్గం దిగొచ్చి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన సిద్దిపేట మండలం రావురూకుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఎస్సీ కాలనీ సంబంధించిన బోరు మోటార్ పనిచేయడంలేదు. రెండు నెలలుగా దానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టడంలేదు. అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరవయ్యారు. అసలే ఎండలు మండుతున్నాయి. రెండు నెలలుగా నీటి కష్టాలు కొనసాగుతున్నాయి.
వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తే రైతులు తమ పొలాలకే నీరందడంలేదని అభ్యంతరం చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు.
అధికారులు, పాలక వర్గం స్పందించి సమస్య పరిష్కరించకపోతే అందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూదవ్వ, రామవ్వ, మల్లవ్వ, ఎల్లవ్వ, బద్దవ్వ, లలిత, నర్సవ్వ, పర్శరాములు, విజయ్కుమార్, భాను తదితరులు పాల్గోన్నారు.