డీఎస్‌సీ ఎప్పుడో! | unemployment waiting from two years for dsc posts | Sakshi
Sakshi News home page

డీఎస్‌సీ ఎప్పుడో!

Sep 3 2014 5:43 AM | Updated on Sep 2 2017 12:49 PM

ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు డీఎస్‌సీ కోసం రెండేళ్లుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.

 కామారెడ్డి: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు డీఎస్‌సీ కోసం రెండేళ్లుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా రు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని ఆశలతో ఉన్న వారు సర్కారు నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్‌సీ నిర్వహణకు అక్కడి ప్రభుత్వం చొరవ చూపుతుండగా, మన ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేస్తుందేమోనని వేచి చూస్తున్నారు.

 జిల్లాలో ఉన్న బీఈడీ కళాశాలల ద్వారా ఏటా 1,200 మంది పట్టభద్రులు ఉపాధ్యాయ శిక్షణ పొంది బయటకు వస్తున్నారు. అలాగే డీఎడ్, పండిత శిక్షణ కళాశాలల ద్వారా మరో రెండు వేల మంది శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో బీపీఈడీ, పండిట్ ట్రైనింగ్ కోర్సులు చదివినవారు కూడా వేలల్లోనే ఉంటున్నారు. గడచిన పది, పదిహేనేళ్ల కాలంలో బీఈడీ, డీఈడీ, బీపీఈడీ, పండిట్ శిక్షణ పూర్తి చేసినవారు జిల్లాలో 30 వేల మంది వరకు ఉద్యోగాల వేటలో ఉన్నారు.

 వయసు మీరిపోతుందేమోనని
 ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్‌సీ ప్రకటనలో ఆలస్యం జరుగుతుండడంతో నిరుద్యోగులలో ఆందోళన పెరుగుతోంది. పలుమార్లు డీఎస్‌సీ రాసినా తీవ్రమైన పోటీతో ఉద్యోగం సంపాదించలేనివారు తెలంగాణ రాష్ట్రంలోనైనా పోస్టుల సంఖ్య పెరిగి తమకు ప్రయోజనం కలుగుతుందని ఆశతో ఉన్నారు. ఆలస్యమైతే వయసు మీరిపోయి డీఎస్‌సీకి అర్హత కోల్పోతామేమోనని కంగారు పడుతుతున్నారు. చదువులో కొత్త బ్యాచ్‌లు వస్తున్నకొద్దీ పోటీ పెరుగుతోంది.

చదువును కొనసా గిస్తున్నవారు డీఎస్‌సీలో ఈజీగా సక్సెస్ అవుతుంటే, గతంలో శిక్షణ పూర్తి చేసినవారు తమకు పోటీ పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతుండడంతో ఉపాధ్యాయ పోస్టులు రేషనలైజేషన్‌లో తగ్గిపోతున్నా  యి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవారి సంఖ్య భారీగా పడిపోతోంది. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలలోనూ ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. తద్వారా ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతాయన్న ఆందోళన నిరుద్యోగ ఉపాధ్యాయులలో వ్యక్తమవుతోంది.

 నియామకాలు చేపట్టాలి
 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే అవకాశం ఉం    దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయడంతోపాటు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement