సెటిల్మెంట్‌ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి.. | Two janashakti leaders arrested | Sakshi
Sakshi News home page

సెటిల్మెంట్‌ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి..

Aug 7 2017 1:27 AM | Updated on Apr 3 2019 8:28 PM

సెటిల్మెంట్‌ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి.. - Sakshi

సెటిల్మెంట్‌ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి..

జనశక్తి పునర్నిర్మాణంలో భాగంగా ఇద్దరు సభ్యులు ఓ సెటిల్‌ మెంట్‌లో పట్టుబడ్డారు.

- ఇద్దరు జనశక్తి నేతల అరెస్ట్‌
పార్టీ పునర్నిర్మాణ యోచనలో సభ్యులు
 
సిద్దిపేట రూరల్‌: జనశక్తి పునర్నిర్మాణంలో భాగంగా ఇద్దరు సభ్యులు ఓ సెటిల్‌ మెంట్‌లో పట్టుబడ్డారు. సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌ వాసి మూర్తి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ యాదన్న జనశక్తి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. పార్టీ వ్యవస్థాపకుడు కూర రాజన్న అలియాస్‌ కేఆర్, సభ్యులు కూర దేవేందర్‌ అలియాస్‌ అమర్, నర్సిరెడ్డి అలియాస్‌ విశ్వనాథం, భీంభరత్‌ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి 60 మందితో చేవెళ్లలో జూన్‌ 24 నుంచి 26 వరకు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన ఆయుధాల కోసం డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.

రాజన్న సిరిసిల్లా జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి వాసి మన్వాడ వసంత్‌ గతంలో పార్టీ నేత. యాదన్న అతన్ని కలసి కొంత డబ్బు ఇవ్వగా ఒక పిస్తోల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు ఇచ్చాడు. వీటితో దళాన్ని ఏర్పాటు చేసి, ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించారు. యాదన్నకు అతని సోదరుడు అశోక్‌రెడ్డికి మధ్య భూ వివాదం నెలకొంది. యాదన్న వసంత్‌ను కలసి మరో పిస్తోలు, ఐదు రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఇది తెలుసుకున్న అశోక్‌రెడ్డి.. తనకు యాదన్న నుంచి ప్రాణ భయం ఉందని పోలీసులను కలిశాడు. ఈ నెల 5న గంగాపూర్‌  వచ్చిన యాదన్న, వసంత్‌లను పోలీసులు పట్టుకున్నారు. వీరు గతంలో దేవుని పల్లి, దోమకొండ, మాచారెడ్డిలలో కూడా బెదిరిం పులకు పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద ఒక పిస్టల్, ఐదు రౌండ్లు, ఒక రివాల్వర్, 11 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement