కాస్త రెస్ట్‌

TRS  Candidates Rest Of Election Campaign Nizamabad - Sakshi

పోలింగ్‌కు యాబై రోజుల వరకు గడువు ఉండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారానికి కాస్త విరామం ఇస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన అభ్యర్థులు ఇదే జోరు కొనసాగిస్తే ఖర్చు తడిసి మోపెడవుతోందని భావిస్తున్నారు.  సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం, అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో కాస్త దూకుడు తగ్గించారు. నెమ్మదిగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారం కంటే సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుకునే పనులపై దృష్టి సారించారు. అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడం ద్వారా అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన అభ్యర్థులకు ఇంటింటి ప్రచారానికి ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. వారి అభ్యర్థిత్వాలు ఖరారై 40 రోజులు దాటింది. పోలింగ్‌కు మారో 50 రోజులకుపైగా గడువుంది. ఈ తరుణంలో ఇంటింటి ప్రచారం ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఆర్థిక పరమైన భారం పడుతుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారానికి అ ప్పుడప్పుడు కొద్దిగా విరామం ఇస్తున్నా రు. నాలుగురోజులు నియోజకవర్గంలో కలియదిరుగుతూ.. రెండు, మూడు రోజు లు హైదరాబాద్‌కు వెళుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. సెప్టెంబర్‌ 6న తొ మ్మిది నియోజకవర్గాలకు సిట్టింగ్‌ ఎమ్మె ల్యేలనే అభ్యర్థులుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఉ త్సాహంగా ఎన్నికల ప్రచారంలోకి దిగా రు. ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని జోరుగా సాగించారు. అధినేత కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలకు నిజామాబాద్‌ నుంచే శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 3న న గరంలో భారీ బహిరంగ సభను నిర్వహిం చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. ఈ సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన రాగా, పోలింగ్‌ డిసెంబర్‌ 7న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

పోలింగ్‌కు మరో 50 రోజులు గడువుండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారాన్ని కాస్త తగ్గించారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించి రెండు, మూడు చోట్ల మాత్రమే అభ్యర్థిత్వాలపై స్పష్టత వచ్చింది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు ఓ కొలిక్కి రావడంతో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం, పొత్తుల్లో భాగంగా ఏ సీటు టీడీపీకి గానీ, టీజేఎస్‌కు గానీ వెళుతుందో స్పష్టత లేకపోవడంతో ఈ ఆరు చోట్ల కాంగ్రెస్‌ ఇంకా ప్రచారానికి శ్రీకారమే చుట్టలేదు.

బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కూడా ఆచితూచి ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభావితం చూపగలిగే నాయకులను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. అలాగే సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. దసరా తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో మళ్లీ దూకుడును పెంచుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top