గిరిజన విద్యార్థి గిన్నిస్‌ రికార్డు

Tribal Student Guinness Record - Sakshi

తైక్వాండో పోటీల్లో సుధాకర్‌ నాయక్‌ ప్రతిభ

కాళ్లకు 5 కేజీల బరువుతో గంటలో 1771 కిక్‌లు

ఇబ్రహీంపట్నంరూరల్‌ : గిరిజన విద్యార్థిను గిన్నిస్‌ రికార్డు వరించింది. తైక్వాండో పోటీల్లో కాళ్లకు బరువు కట్టుకొని ఏకంగా గంటకు 1771 కిక్‌లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. రెండుసార్లు గిన్నిస్‌ రికార్డు సాధించి తెలంగాణ సత్తా చాటాడు. కృషి పట్టుదలతో పని చేస్తే అసాధ్యం కానిదేమీ లేదని నిరూపించాడు. ఇబ్రహీంపట్నం నియోజవర్గం మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన బానోతు లక్ష్మణ్‌నాయక్, దేవి దంపతుల కుమారుడు సుధాకర్‌నాయక్‌. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీదత్త ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు.

గ్రాండ్‌ మాస్టర్‌ జయంత్‌రెడ్డి, మాస్టర్‌ చందర్‌రావుల పర్యవేక్షణలో తైక్వాండోలో రాణిస్తున్నాడు. 2017 సంవత్సరంలో టీకేఆర్‌ కళాశాలలో జరిగిన తైక్వాండో పోటీల్లో సుధాకర్‌నాయక్‌ పాల్గొన్నాడు. రెండు కాళ్లకు 5 కేజీల బరువు కట్టుకొని గంటలో 1771 కిక్‌లు కొట్టాడు. గత వారం క్రితం గిన్నిస్‌ రికార్డు వారు వెల్లడించిన ఫలితాల్లో సుధాకర్‌నాయక్‌ రికార్డు కైవసం చేసుకున్నాడు. 2014లో సైతం గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించాడు.

 అభినందించిన కళాశాల కళాశాల యాజమాన్యం  

గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించిన శ్రీదత్త కళాశాలకు చెందిన మెకానికల్‌ విద్యార్థి సుధాకర్‌నాయక్‌ను గురువారం కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. గిన్నిస్‌రికార్డు దక్కించుకొని కళాశాలకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టిన సుధాకర్‌నాయక్‌ను చైర్మన్‌ పాండురంగారెడ్డి అభినందించారు. వీరితో పాటు డైరెక్టర్‌ సమీరుద్దిన్‌ఖాన్, ఐసీటీ సాదన్‌ ఇండియా హెడ్‌ సురేష్‌బాబు, తెలంగాణ హెడ్‌ అమర్‌నాథ్, ప్రిన్స్‌పాల్‌ ప్రభుబిట్టోలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top