టీజీటీ నియామకాలు పూర్తి

TGT Appointments Was Completed - Sakshi

వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) నియామకాల ప్రక్రియ పూర్తయింది. టీజీటీకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురుకుల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి పక్షం క్రితమే తుది జాబితా విడుదల చేయగా.. గతవారం ఫిజికల్‌ సైన్స్, బయోసైన్స్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో చేర్చింది. తాజాగా మ్యాథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలనూ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇప్పటికే నియమితులైన అర్హుల జాబితాలను సంబంధిత సొసై టీలకు పంపింది. ఆయా సొసైటీ కార్యదర్శులు పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈనెల 10లోగా నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇప్పటికి 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టుల భర్తీ పూర్తయినట్లే. 

నెలాఖరులోగా డీఎల్, జేఎల్‌ భర్తీ 
గురుకుల కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ భర్తీ సైతం వేగవంతమైంది. గురుకుల నియామకాల బోర్డు ఇటీవలే 466 డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరి ధ్రువపత్రాలు పరిశీలించాక తుది జాబితా ఖరారు చేయనుంది. వారంలోగా 281 జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను ఖరారు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. దీంతో గురుకుల నియామకాల బోర్డుకు అప్పగించిన రిక్రూట్‌మెంట్‌ బాధ్యతలు పూర్తి కానున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలంటే జోన్ల వ్యవస్థపై స్పష్టత రావాల్సి ఉంటుందని, పోస్టుల విభజన పూర్తయితేనే భర్తీ చేపట్టే వీలుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top