ఆరోగ్యానికి శ్రీరామరక్ష | Telangana Govt Hospital Is Good Working | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి శ్రీరామరక్ష

Feb 4 2019 1:23 PM | Updated on Feb 4 2019 1:23 PM

Telangana Govt Hospital Is Good Working - Sakshi

రోగులకు చికిత్సలు చేస్తున్న వైద్యులు 

మెదక్‌జోన్‌: ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానాకు అన్న ప్రజలు నేడు క్యూ.. కడుతున్నారు.  జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందుతోంది. దీంతో ఏ సమస్య వచ్చినా ప్రైవేట్‌ హాస్పటిల్‌కు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రి వైపు చూస్తున్నారు. ఈ వైద్యశాలలో ఏడాదికాలంలో ఐదు వేల శస్త్రచికిత్సలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. మెదటి స్థానంలో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రి ఉంది. సగటున నెలకు నాలుగువందల నుంచి 430 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. ఇందులో   అపెండెక్స్, వరిబీజం, థైరాయిడ్, కంటి సమస్యలకు, ఎముకలు  విరిగినా శస్త్ర చికిత్స ద్వారా సరిచేయడం, గర్భిణులకు సర్జరీ చేసి పురుడుపోయడం లాంటి అనేక రకాల రకాల ఆపరేషన్లు చేస్తూ  నిరుపేదలకు భరోస కలిగిస్తున్నారు.  

జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 100 పడకలు కాగా ఎప్పుడో  మూడు దశాబ్దాల క్రితం నియమించిన సిబ్బందితోనే ఇంతకాలంగా ఆస్పత్రిని నడిపించారు. నాలుగు నెలల క్రితం  సరిపడ వైద్యులను  నియమించారు. అయినా నేటికీ పారామెడికల్‌ సిబ్బంది,  నర్సింగ్‌తో పాటు ల్యాబ్‌టెక్నిషన్స్‌ తక్కువగానే ఉన్నారు.  అయినప్పటికీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొంటున్నారు.

 ఐసీయూలో అత్యవసర చికిత్సఏడాది క్రితం అత్యవసర చికిత్స విభాగంవిభాగం(ఐసీయూ)ని ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి  ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులు, పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడిన రోగులకు అన్నిరకాల శస్త్రచికిత్సలు అందుతున్నాయి. వెంటిలెటర్‌ అందుబాటులో ఉండటంతో రోగుల ప్రాణాలకు భరోసాకలిగే విధంగా వైద్యం అందుతోంది. దీంతో వేలాది శస్త్రచిత్సలతోపాటు అన్నిరకాల వ్యాధులను నయం చేస్తున్నారు.

డయాలసిస్‌తో.. 
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ను  ఏర్పాటు చేశారు. దీంతో కిడ్నీ వాధిగ్రస్థులకు స్థానికంగానే డయాలసిస్‌ చేస్తూ   చికిత్స అందిస్తున్నారు. ఈ డయాలసిస్‌ కేంద్రంలో ఒకేసారి ఐదుగురికి డయాలసీస్‌ను నిర్వహించే వెసులు బాటు ఉండటంతో చికిత్స త్వరతగతిన అందుతోంది. జిల్లా వ్యాప్తంగా 35 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గతంలో  డయాలసిస్‌ చేయించుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లేవారు. 

మాతాశిశు ఆస్పత్రికి  శంకుస్థాపన 
జిల్లా కేంద్రంలో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రూ.17 కోట్లను మంజూరు చేయించారు.    అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా శంశుస్థాపనను సైతం చేయించారు.  ఇందుకు సంబంధించి టెండర్‌ పక్రియ జిల్లాకేంద్ర ఆస్పత్రిలోనే జరిగింది. కానీ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోవడం లేదనే సందిగ్ధంలో కాంట్రాక్టర్‌ ఉన్నట్లు తెలిసింది.  ఈ మాతా శిశుఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే మాతాశిశు వ్యాధులకు ఇక్కడే పూర్తిస్థాయి చికిత్సలు అందే అవకాశం ఉంది. దీంతో మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

కంటి జబ్బుల నివారణ కోసం...
కంటి జబ్బుల నివారణకోసం  జిల్లా కేంద్ర  ఆస్పత్రిలో ప్రత్యేకంగా నిర్మించేందుకు 20  పడకల ఆస్పత్రి నిర్మాణంకోసం రూ.20 లక్షలు మంజూరి కాగా ప్రస్తుతం ఆస్పత్రిపై భాగంలో మొదటి అంతస్తుగా కంటివెలుగు ఆస్పత్రిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. త్వరలో నిర్మాణం పూర్తికానుంది. ఇది పూర్తయితే కంటిజబ్బు వ్యాధిగ్రస్థులకు  ప్రత్యేకమైన చికిత్సలు అందే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement