కాంగ్రెస్‌ నేతల ముల్లె ఏం పోయింది?  | Talasani Srinivas Yadav Comment On Congress Leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల ముల్లె ఏం పోయింది? 

Jul 2 2019 2:44 AM | Updated on Jul 2 2019 2:44 AM

Talasani Srinivas Yadav Comment On Congress Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా సచివాలయం, అసెంబ్లీ ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు దీన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్తగా కడితే కాంగ్రెస్‌ నేతల ముల్లె ఏం పోయిందో అర్థం కావడం లేదన్నారు. సోమవారం సచివాలయ మీడియా పాయింట్‌లో విలేకరులతో తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల సెక్రటేరి యట్‌ సందర్శన ఒక పిక్‌నిక్‌లా ఉందని, వచ్చి అరగంట కూడా ఉండలేదన్నారు.

వాళ్లు వచ్చి ఏం చూశారో, వారికి ఏం అర్థమైందో చెప్పాలన్నారు. ఏదో టైం పాస్‌కి వచ్చి టీవీలో, పేపర్‌లో కనపడాలని ఇష్టం వచ్చినట్లు గురుకులాలకు, ఇంకాదేనికైనా ఇవ్వాలని చెబుతున్నారని ఆరోపించారు. సచివాల యం చుట్టూ ఇరుకుగా రహదారులున్న సంగతి వాళ్లకు తెలియదా.. అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, గురుకులాలు నిర్మిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులు కనిపించడం లేదా.. అయినా వీళ్ల ముఖానికి ఏ రోజైనా ఇలాంటి ఆలోచన చేశారా అని అడిగారు. కాళేశ్వరంపై అనేక కేసులు పెట్టారని అయినా పూర్తి చేశామన్నారు. ఎవరెన్ని చెప్పినా సచివాలయం కట్టి తీరుతామని తేల్చి చెప్పారు. లక్ష ఉద్యోగాలు విడతల వారీగా ఇస్తున్నామని తెలిపారు. 

మా ప్లాన్లు మాకున్నాయి.. 
కాంగ్రెస్‌ హయాంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ రాజకీయ ఉద్యోగాలు మాత్రం తీసుకున్నారని తల సాని విమర్శించారు. ఏ పండుగకైనా ఒక్క రూపాయి కేటాయించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధ్యక్షు డు రాహుల్‌గాంధీ ప్రెసిడెంట్‌ పదవి వద్దని పారిపోతుంటే, ఆ పార్టీలో గ్రూప్‌ తగాదాలతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతున్నారన్నారు. జనం మధ్యకు వెళ్లలేని కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మిస్తే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. దానికి అనేక ఆలోచనలు చేశామని, మా ప్లాన్లు మాకున్నాయని తలసాని సమాధానం ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement