బిడ్డా.. జర భద్రం!! | siblings dead, mothers fainted at accident site | Sakshi
Sakshi News home page

బిడ్డా.. జర భద్రం!!

Jul 24 2014 1:30 PM | Updated on Oct 16 2018 3:12 PM

బిడ్డా.. జర భద్రం!! - Sakshi

బిడ్డా.. జర భద్రం!!

'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు.

'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు. పొద్దున్నే లేచి, శుభ్రంగా తయారై బ్యాగు తగిలించుకుని, క్యారేజి పట్టుకుని బస్సు మెట్లు ఎక్కేముందు ఆ మూడు గ్రామాల్లోని దాదాపు 20 మందికి పైగా తల్లులు తమ కన్న బిడ్డలను భద్రంగా వెళ్లి రమ్మంటూ టాటా చెప్పారు. అలా చెప్పి గంట సేపు కూడా గడిచిందో.. లేదో, అంతలోనే వాళ్లు ఎక్కిన బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసింది. ఆ తల్లుల గుండెలు ఝల్లుమన్నాయి. ఉరుకులు పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే చిరునవ్వులు చిందించాల్సిన తమ చిన్నారులు రక్తమోడుతూ విగతజీవులుగా కనిపించారు. అంతే.. వాళ్ల గర్భశోకానికి అంతులేదు. చాలామంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు.

బస్సులో ఆడుతూ పాడుతూ వెళ్తున్న చిన్నారులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు తమ బస్సును ఢీకొనడంతో ఏం జరిగిందో తెలిసేలోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుండేటిపల్లెకు చెందిన 11 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కొన్ని కుటుంబాల్లో వాళ్ల పిల్లలంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుండేటిపల్లెకు చెందిన వరుణ్ -శ్రుతి, కృష్ణాపూర్కు చెందిన రజియా-వహీద్ ఇలా మరణించినవారే. వీరిలో రజియా-వహీద్ల తల్లి తన బిడ్డలు లేరన్న విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించగా, వాళ్ల తండ్రికి కూడా గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement