‘108’ సేవల్లో శంషాబాద్‌కు అగ్రస్థానం | shamshabad first place in 108 services | Sakshi
Sakshi News home page

‘108’ సేవల్లో శంషాబాద్‌కు అగ్రస్థానం

May 24 2014 12:07 AM | Updated on Mar 28 2018 10:56 AM

మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు శంషాబాద్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి.

శంషాబాద్, న్యూస్‌లైన్:  మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు శంషాబాద్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. బెంగళూరు జాతీయరహదారి, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం కొలువుదీరడంతో ‘108’ వాహనం ఇక్కడ చాలా బిజీగా మారింది. దీనికితోడు సమీపంలోనే తండాలు ఉండటంతో పెద్ద ఎత్తున ప్రసూతి కేసులు కూడా నమోదవుతున్నాయి. గతేడాది నవంబరు నెలలో కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో రైలులోని సిబ్బంది శంషాబాద్ స్టేషన్ మాస్టర్‌కి విషయం తెలిపారు.

 అప్పటికే రైలు శంషాబాద్ దాటింది. స్టేషన్ మాస్టర్ ద్వారా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కొత్తూరు రైల్వేస్టేషన్ వరకు చేరకుని అక్కడ రైలు డ్రైవర్ గణేష్‌బాబుకి ప్రాథమిక చికిత్స అందజేసి నగరంలోని ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. వెంటనే స్పందించి సేవలందించిన స్థానిక 108 సిబ్బందికి ఈమ్‌ఆర్‌ఐ సంస్థ జాతీయ, రాష్ట్ర స్థాయిలో 108 సేవియర్  ఉత్తమ అవార్డులను సైతం అందజేసింది.

 పల్లె ప్రజలకు విశిష్ట సేవలు..
 గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 692 గ ర్భిణులకు సంబంధించి ప్రసూతి కేసులు రాగా అందులో 52 మంది అంబులెన్స్‌లోనే పురుడు పోసుకున్నారు. మిగతా వారిని నగరంలోని ప్రసూతి ఆస్పత్రులకు చేర్చడంతో సత్వర సేవలు అందించారు. ఏడాది కాలంలో మొత్తం 484 రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్సలు అందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 124 ఆత్మహత్యాయత్నం కేసులు, 638 సాధారణ వైద్య కేసులతో పాటు ఇతర కేసుల్లో ప్రాథమిక చికిత్సలు అందజేసి వైద్యశాలలకు తరలించడంలో శంషాబాద్ 108 అంబులెన్స్ సేవలు విస్తృతంగా ఉపయోగపడ్డాయి. జిల్లాలో మరెక్కడ లేని విధంగా గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తరలించడంతో పాటు డెలివరీలు కూడా చేస్తూ ‘108’ పల్లె ప్రజలకు విశిష్ట సేవలందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement