కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

Preliminary bail to Konda Vishweshwar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ, రూ. 25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్వేశ్వర్‌రెడ్డిని విచారించాలనుకుంటే, ఆయనకు నోటీసు జారీచేసి విచారణకు హాజరు కావాలని కోరవచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై ఈ కేసు నమోదైందని తెలిపారు. పోలీసులే మొదట పిటిషనర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారని, దీనిపై ఆయన ఫిర్యా దు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు.

ఆ తరువాత గచ్చిబౌలి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై మాత్రం స్పందించి, పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్‌ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీసులనే నిర్భంధించి హిం సించారని తెలిపారు. ఈ కేసులో తాము అరెస్ట్‌ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం ఆందోళనతోనే పిటిషనర్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top