కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ? | Pill Filing in High Court on Police investigation | Sakshi
Sakshi News home page

కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?

Jan 5 2020 3:21 AM | Updated on Jan 5 2020 3:21 AM

Pill Filing in High Court on Police investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధనవంతుల కుక్క తప్పిపోతే పోలీసులు సర్వశక్తులనూ ఒడ్డి ఆ కుక్కను పట్టుకున్నారని, అదే పేద వాళ్ల పిల్లలు అదృశ్యమైతే వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో ఓ ధనవంతుడి కుక్క తప్పిపోతే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుని యజమానికి అప్పగించారని, అయితే రాష్ట్రం లో పిల్లలు అదృశ్యమైన కేసుల్ని పోలీసులు మూసేస్తున్నారని పిల్‌లో పేర్కొన్నారు. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తిస్థాయిలో విచారించేలా  ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని, మూసేసిన కేసుల్ని తెరిచి విచారణ చేపట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యా యవాది రాపోలు భాస్కర్‌ పిల్‌ దాఖలు చేశారు.

దేశంలో ఆడ పిల్లల ఆక్రమ రవాణా జరుగుతోందని, 8,057 వేల పైచిలుకు కేసులు నమోదైతే.. అందులో తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 49 కేసుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో 2,122 మంది పిల్లలు అదృశ్యమైతే, అందులో 1,350 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇంతవరకు వీరి ఆ చూకీ తెలియలేదన్నారు. పిల్లల ఆచూకీ తెలియక మనోవేదన తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయన్నా రు. 2015లో 407 మంది పిల్లలు, ఆ తర్వాత మూడేళ్లలో వరసగా 474, 681, 560 మంది చొప్పున పిల్లల అదృశ్యం కేసులు నమోదైతే, వారిలో అత్యధికంగా బాలికలే 1,350 మంది ఉన్నా రని తెలిపారు. పిల్‌లో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను చేర్చారు.

క్రిమినల్‌ కేసుల పరిష్కారం: పెండింగ్‌ కేసుల పరిష్కారంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి 24 క్రిమినల్‌ పిటిషన్లు, 43 మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించారని హైకోర్టు రిజిస్ట్రార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement