చివరి చూపుకు ఆర్నెల్లు పట్టింది | Person Dead Body Came After Six Months From Dubai Because Of KTR | Sakshi
Sakshi News home page

చివరి చూపుకు ఆర్నెల్లు పట్టింది

Aug 11 2019 7:48 AM | Updated on Aug 11 2019 7:48 AM

Person Dead Body Came After Six Months From Dubai Because Of KTR - Sakshi

సాక్షి,సిరిసిల్ల : ఉన్న ఊరిలో ఉపాధిలేక 25ఏళ్ల నుంచి గల్ఫ్‌దేశాలు వెళ్తూ.. అక్కడ కూలీనాలీ చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లకోసారి ఇంటికొచ్చి భార్యా,బిడ్డల బాగోగులు చూసుకుని వెళ్తున్నాడు. ఆర్నెల్ల క్రితం గల్ఫ్‌లో పనిస్థలంలో గుండెపోటుతో మరణిస్తే.. ఆ విషయాన్ని అక్కడి కపిల్‌ మూడు నెలల వరకు గోప్యంగా ఉంచాడు. కుటుంబసభ్యులు మూడు నెలల క్రితం వాకాబు చేయగా అంతకు మూడు నెలల క్రితమే గుండెపోటుతో చనిపోయాడని సమాచారం అందింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ చొరవతో శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన బుడిద పోచయ్య(55) సొంత ఊరిలో ఉపాధిలేక 25ఏళ్లుగా గల్ఫ్‌ వెళ్తున్నాడు. రెండేళ్లకోసారి ఇంటికి వచ్చి భార్యా, పిల్లలను చూసుకునేవాడు. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆర్నెల్ల క్రితం పనిస్థలంలో గుండెపోటుతో మరణించాడు. కపిల్‌ ఆ విషయాన్ని పోచయ్య కుటుంబ సభ్యులకు చెప్పలేదు. మూడు నెలలుగా పోచయ్య నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి ద్వారా వాకాబు చేయగా అతడు 3నెలల క్రితం మరణించినట్లు తెలిసింది.

విషయాన్ని కుటుంబసభ్యులు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్‌ ఎన్‌ఆర్‌ఐ జనరల్‌ సెక్రటరీ తోపాటు సౌదీలోని ఇండియన్‌ ఎంబస్సీకి లేఖరాశారు. వెంటనే మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. జాగిత్యాల జిల్లాకు చెందిన గల్ఫ్‌ సోషల్‌ వర్కర్‌ శేఖ్‌చాంధ్‌ దగ్గరుండి మృతదేహాన్ని ఇండియాకు రప్పించి శనివారం తంగళ్లపల్లికి చేర్చారు. పోచయ్యకు భార్య లక్ష్మీ,కూతురు లత, కొడుకులు లవన్, నితిన్‌లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ పడిగెల మానసరాజు, సర్పంచ్‌ అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు అంకారపు రవీందర్, పడిగెల రాజు పరామర్శించారు.

స్వగ్రామం చేరుకున్న మల్లేశ్‌ మృతదేహం
దుబాయ్‌లో వారం రోజుల క్రితం మృతి చెందిన మండలంలోని సత్తెక్కపల్లివాసి మల్లేశ్‌ మృతదేహాం శనివారం స్వగ్రామం చేరుకుంది. ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లిన మల్లేశ్‌ అక్కడ భవన నిర్మాణ రంగ కార్మికునిగా పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 3న పని చేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement