ఫీవర్‌..ఫియర్‌

People Suffering With Viral Fever in Hyderabad - Sakshi

ఫీవర్‌ ఆస్పత్రికి పెరుగుతున్న రోగులు  

రిపోర్టుల కోసం భారీ క్యూ

గాంధీ నుంచి నలుగురు వైద్యులు

వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓ

నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి రోగుల తాకిడి కొనసాగుతోంది. జ్వరపీడితులు ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. ఓపీ ప్రారంభ సమయానికి ముందే దాదాపు 500 మంది వరకు క్యూలైన్‌లో వేచి ఉంటుండడం గమనార్హం. ఉదయం 8.30 గంటకు ఓపీ చీటీలు జారీ చేస్తుండగా, 9 గంటలకు ఓపీలో రోగులకు చికిత్సలు ప్రారంభిస్తున్నారు.   చికిత్సల కోసం వచ్చే వారిలో అధికంగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 

గాంధీ నుంచి నలుగురు వైద్యులు..
ఫీవర్‌లో రోగుల రద్దీ కారణంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు వైద్యులను డిప్యుటేషన్‌ పంపించారు. సోమవారం డిప్యూటేషన్‌పై వచ్చిన మరో వైద్యుడు మంగళవారం సెలవుపై వెళ్లడం విస్మయాన్ని కలిగిస్తుంది.

రోగుల సేవలో ఆర్‌ఎంఓ,డిప్యూటీ ఆర్‌ఎంఓలు..
రోగుల తాకిడి పెరగడంతో ఫీవర్‌ ఆర్‌ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ ఓపీలో కూర్చుని రోగులను పరీక్షించారు.  మరో 30 మంది వైద్యులు, హౌజ్‌ సర్జన్లు 30 కౌంటర్లలో రోగులను పరీక్షించారు.   

రిపోర్టుల కోసం భారీ క్యూ..
గంటల తరబడి క్యూలో వేచి ఉండడం ఒక  సమస్య అయితే..రిపోర్టులు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. రిపోర్టుల జారీకి ఒక్కటే కౌంటర్‌ ఉండడంతో రోగులు ఆసుపత్రి ప్రధాన గేటు బయటి వరకు క్యూ కడుతున్నారు. అతి కష్టం మీద రిపోర్టులు తీసుకుని వెళితే, ఓపీలో వైద్యుల వద్దకు చేరుకోవాలంటే మరో గంట క్యూలైన్‌లో వేచి ఉంటే కాని వైద్య పరీక్షలు అందని పరిస్థితి.   

డెంగీతో చిన్నారి మృతి
చింతల్‌: డెంగీ జ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో జరిగింది. రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పంచశీల కాలనీకి చెందిన ప్రభాకర్, పవన్‌ కుమారి ల కుమార్తె దర్శిని (4) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఐదు రోజుల క్రితం దర్శిని తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్లినిక్‌కు తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యలు డెంగీ జ్వరంగా తేల్చారు. నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం  మృతి చెందింది.  

జేసీ ఆకస్మిక తనిఖీ
నల్లకుంట: ఫీవర్‌ ఆసుపత్రిలో రద్దీని, వైద్యసేవలను హైదరాబాద్‌ ఇల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) జి. రవి మంగళవారం మధ్యాహ్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి, ఆర్డీఓ డి.శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా ఓపీ ఫార్మసీ కౌంటర్లను, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. ఓపీలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరాతీశారు. ఆసుపత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ రేణుక రాణిలతో మాట్లాడారు.ఓపిలో రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం  ఆసుపత్రి ఆవరణలోని కొన్ని భవనాలను పరిశీలించారు.  అదనపు ఓపీ కౌంటర్ల ఏర్పాటుకు లెక్చర్‌ హాల్‌ అనుకూలంగా ఉంటుందని ఆసుపత్రి అధికారులు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top