బహిష్కరణ ఎత్తివేసే వరకు ఆందోళన | People Protest For Justice In Nizamabad | Sakshi
Sakshi News home page

బహిష్కరణ ఎత్తివేసే వరకు ఆందోళన

Aug 14 2018 3:29 PM | Updated on Oct 17 2018 6:10 PM

People Protest For Justice In Nizamabad - Sakshi

కలెక్టరేట్‌ గేటు ఎదుట నిరసన తెలుపుతున్న  జాతీయ, రాష్ట్ర నాయకులు,  

నిజామాబాద్‌, నాగారం : పరిపూర్ణనందస్వామి బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. సోమవారం నాలుగువైపుల నుంచి కలెక్టరేట్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు, హిందుత్వవాదులు, హిందువాహిణి, భజరంగ్‌ దళ్, ఏబీవీపీ, సాధు పరిషత్, న్యాయవాదులు, మహిళ మోర్చ, బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఒక్కసారిగా కలెక్టరేట్‌ గేట్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరిని అడ్డుకున్నారు. అయిన కొంత మంది గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లిపోయారు. అక్కడే ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న వీహెచ్‌పీ నాయకులను, బీజేపీ నాయకులను, హిందుత్వ నాయకులను అరెస్టు చేసి పోలీసుల వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. 

ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తాం.. 

హిందుసామాజాన్ని ధర్మాన్ని మార్గదర్శనం చేస్తున్న గురువులను నిర్భందించి బహిష్కరించడం సరికాదని నాయకులు అన్నారు. ఇకనైన ప్రభుత్వం పరిపూర్ణనంద స్వామి బహిష్కరణను రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త, బస్వాలక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు, ప్రతినిధులు అరెస్టు అయ్యారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు గంగకిషన్, పిట్ల స్వామి, అల్జాపూర్‌ శ్రీనివాస్, యెండల సుధాకర్, న్యాలం రాజు, రోషన్‌బోరా, యశ్వంత్, లక్ష్మీనారాయణ, సురేష్‌ పాల్గొన్నారు.  

స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలి

కామారెడ్డి క్రైం: పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందు పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్‌ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడారు.

సర్వసంగ పరిత్యాగి అయిన పరిపూర్ణనందస్వామిపై నగర బహిష్కరణ విధించడం తగదన్నారు. ఆయనపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పరిపూర్ణనందస్వామిని హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను 50 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

నిరసనలో బీజేపీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతే క్రిష్ణాగౌడ్, మర్రి రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు నరేందర్, బాల్‌రాజ్, గంగారెడ్డి, వీహెచ్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ 

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): పరిపూర్ణానంద స్వామిపై ఉన్న నగర బహిష్కరణ ఎత్తేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అర్వింద్‌ ధర్మపురి డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. అర్వింద్‌ మా ట్లాడుతూ దేశంలో 80శాతానికిపైగా ఉన్న హిందువులపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న కేసీఆర్‌ని హిందూ సమాజం బహిష్కరించే రోజుదగ్గర్లోనే ఉందన్నారు. రాజకీయపార్టీల్లో విలువలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు.

సీఎం కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు రా కుండా పాలన పాతబస్తీ నుంచే సాగుతోందన్నారు. రాజకీయ పార్టీలను మళ్లీ ఎన్నుకుం టే, ఈ రాష్ట్రం పాతబస్తీ కనుసగల మీద నడిచే పరిస్థితి వస్తుందన్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇద్దరు ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులు పట్టుబడ్డారని, వీళ్లను పెంచి పోషించేది టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లాంటి పార్టీలేనని ఆరోపించారు. హిందూ సమాజం మేల్కొని జాగ్రత్త పడాలని, అందరికీ సమన్యాయం పంచే బీజేపీ వెంటనే నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement