అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా..

Parents Drowned In Grief As They Watched Their Son Die In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల : తన బుడిబుడి నడకలతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ.. తన చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆనందపజేసే బంగారు కొండ.. ముక్కుపచ్చలారని చిట్టి తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడేళ్ల బుడతడు రుత్విక్‌ మరణ వార్త విన్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా అని ఆ తల్లి విలపించిన తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కొమిటి దేవయ్య– రేణుక దంపతులకు రుత్విక్‌ (3) ఒక్కగానొక్క సంతానం. ప్రేమానురాగాలతో సాగిపోతున్న వారి కుటుంబంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. దేవయ్య– రేణుక ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా రుత్విక్‌ ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతడిని ఎవరూ గమనించలేదు. కొంత సేపటికి తల్లిదండ్రులు రుత్విక్‌ కోసం వెతుకుతుండగా నీటి సంపులో పడిఉండడం చూసి అతన్ని హుటాహుటిన సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుత్విక్‌ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఒక్కగానోక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top