కశ్మీర్ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
సాక్షి, హైదరాబాద్: జమ్మూ,కశ్మీర్ అభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.త్వరలోనే కశ్మీర్ ప్రజలకు అన్ని రాజకీయహక్కులు కల్పిస్తామని, అక్కడి అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు. అలాగే ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘ఆర్టికల్ 370 రద్దు’పై ఏర్పాటు చేసిన జనజాగరణసభకు రాంమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో చర్చలు జరిపే అవకాశమే లేదని, చర్చించాల్సి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దృష్టంతా పీఓకేను ఎలా సంపాదించాలన్నదానిమీదే ఉందన్నారు. ఉగ్రవాదులకు మద్దతుపలుకుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370 రద్దు చేశాక 200 మందివరకు మాత్రమే ముందస్తుగా అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 370 రద్దు ధైర్యంతో తీసుకున్న నిర్ణయమని, ఈ ఆర్టికల్ ద్వారానే వేర్పాటువాదానికి ఊతం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అన్నారు. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేయడాన్ని తప్పుబట్టారు. జమ్మూ, కశ్మీర్లో ఆర్మీ కోర్ కమాండర్గా, ఆ తర్వాత అక్కడి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నపుడు తన అనుభవాలను లెఫ్టినెంట్ మహ్మద్జకీ పంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు సాహసోపేతమైన చర్యఅని సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ఎంవీ కృష్ణారావు అన్నారు.