ముహూర్త బలంతో నామినేషన్ల జోరు

Nominations Process In Nalgonda - Sakshi

జిల్లాలో మూడో రోజు భారీగా నామినేషన్లు 

ఆలేరులో భిక్షమయ్యగౌడ్, భువనగిరిలో పైళ్ల తరఫున కృష్ణారెడ్డి,

కొలుపుల.. కుంభం తరఫున ఆయనకూతురు నామినేషన్ల దాఖలు

మరోసారి జనసమీకరణతో వేసేందుకు ఏర్పాట్లు,భారీ సభలకు అభ్యర్థుల ప్రణాళికలు  

సాక్షి, యాదాద్రి : జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్లు వేయడానికి ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ మంచిరోజు, ముహూర్త బలం బుధవారమే ఉండటంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి అసెంబ్లీ అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి ఎంవీ భూపాల్‌రెడ్డికి, ఆలేరు అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 
నామినేషన్‌ వేసిన వారు..
భువనగిరి అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోకన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌తోపాటు మరో ముగ్గురు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే స్థానంనుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున ఆయన కుమార్తె కీర్తిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె వెంట అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు గర్ధాసు బాలయ్య ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యగౌడ్‌ నామినేషన్‌ వేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, కొలుపుల హరినాథ్, కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తరఫున మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈనెల 12న నా మినేషన్ల ప్రారంభమైన తొలిరోజునే ఆమె స్వ యంగా వచ్చి నామినేషన్‌ దాఖలు చేసిన విష యం తెలిసిందే. అలాగే బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మో త్కుపల్లి నర్సింహులు నామినేషన్‌ వేశారు. ఆయన వెంట గీరెడ్డి ముకుందారెడ్డి, కైరంకొండ శ్రీదేవి, ఆంజనేయులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట కావటి సిద్ధిలింగం, తునికి దశరథ ఉన్నారు.  అదే విధంగా   నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం తరఫున ఆయన సతీమణి పుష్ప నకిరేకల్‌లో నామినేషన్లు వేశారు. 
జన సమీకరణతో మనోసారి నామినేషన్లు..
మంచి ముహూర్తం ఉందన్న కారణంతో బుధవారం సాదాసీదాగా నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ జన సమీకరణ మధ్య మరోసారి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. భువనగిరిలో ఈనెల 16న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, 19న పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.బీజేపీ మద్దతుతో రంగంలోకి దిగబోతున్న యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం భారీ ఎత్తున నామినేషన్‌ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆలేరులో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 17న, కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌ 19న భారీ ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు.
మొదలైన రాజకీయం
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం, నామినేషన్లు వేస్తుండడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు నెలలుగా ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు తమ పోటీ అభ్యర్థులు ఎవరో తెలియకపోవడంతో కొనసాగిన టెన్షన్‌కు తెర దించుతూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. కాం గ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన జాప్యంతో ఒక దశలో కాంగ్రెస్‌ శ్రేణులు స్తబ్దుగా ఉన్నాయి.కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటాపోటీగా ప్ర చారానికి పదునుపెడుతున్నాయి. ఆయా పార్టీల్లోని అసంతృప్తివాదులను తమ వైపు తిప్పుకోవడానికి రెండు పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలకు శ్రీకారం చుట్టాయి.సామాజిక వర్గాల సమీకరణలు, తెరపైన ఇంటింటి ప్రచారం, ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తున్న పార్టీలు తెర చాటున సభలు, సమావేశాలతో తమ వైపుకు ఓటర్లను ఆకర్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అందెల లింగంయాదవ్‌ను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇదిలా ఉండగా ఆలేరు నియోజకవర్గంలోటీఆర్‌ఎస్‌  పార్టీకి చెందిన తుర్కపల్లి జెడ్పీటీసీ ఆపార్టీని వీడుతున్నట్లు సమాచారం. అయితే ఆమెతోపాటు మరికొందరు ముఖ్య నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ఆపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు చేరారు. భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్‌  పావులు కదుపుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top