విద్యుత్ ఆదాపై మున్సిపల్‌శాఖ కసరత్తు | Municipal Department trying to explain methods to Power-saving | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఆదాపై మున్సిపల్‌శాఖ కసరత్తు

Sep 6 2014 2:37 AM | Updated on Sep 5 2018 2:06 PM

మున్సిపాలిటీలకు గుదిబండగా మారుతున్న విద్యుత్ చార్జీల మోత తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. విద్యుత్ కొరతను సైతం దృష్టి లో ఉంచుకుని తక్కువ విద్యుత్ తో వెలిగే ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

టవర్‌సర్కిల్ : మున్సిపాలిటీలకు గుదిబండగా మారుతున్న విద్యు త్ చార్జీల మోత తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. విద్యుత్ కొరతను సైతం దృష్టి లో ఉంచుకుని తక్కువ విద్యుత్ తో వెలిగే ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇందులో జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీ  ఉన్నాయి.
 
ఎంపికైన మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా ఎల్‌ఈడీ బల్బులను అమర్చి విద్యుత్ ఆదాను పర్యవేక్షించనున్నారు. 50 శాతానికి పైగా విద్యుత్ చార్జీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం చేసిన సూచనలతో అధికారులు పైలట్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టారు. ఆయా మున్సిపాలిటీలోని ఒక ఏరియాను ఎన్నుకుని 150 నుంచి 200 స్ట్రీట్ లైట్లకు ఎల్‌ఈడీ బల్బులను బిగించి, విద్యుత్ మీటరు అమర్చి విద్యుత్ ఆదా ను పరీక్షించనున్నారు. గతంలో ఉన్న ఎస్వీ, ట్యూబ్‌లైట్లకు బదులు ఏర్పాటు చేసే ఈ ఎల్‌ఈడీలతో 50 శాతం పైగా విద్యుత్ ఆదా అవుతుందని, వెలుతురు కూడా పా త బల్బులకు సమానంగా పొందవచ్చని ప్రభుత్వం చె బుతోంది.
 
మొదటి దఫాలో ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ బల్బులను మున్సిపాలిటీలపై ఎలాంటి భారం లేకుం డా ప్రభుత్వమే  సరఫరా చేయనుంది. విద్యుత్ ఆదాలో విజయవంతమైతే దశలవారీగా అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బులు అమర్చుతారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో ఈ నెల 9న హైదరాబాద్‌లోని సీడీఎంఏ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నా రు. ఏడాది కాలానికి సంబంధించిన వీధిదీపాల బిల్లులతో హాజరుకావాలని సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement