
సాక్షి, నిజామాబాద్ : గత పాలకుల విధానాల కారణంగానే పేదలకు సొంతిళ్లు లేవని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లేని వారి పేరు చెప్పి ఉన్న వాళ్లు ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. గత పాలకులు ఇళ్లు కట్టకుండా బిల్లులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. అన్ని వసతులతో కూడిన ఇళ్లు పేదలకు ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నా, ఇండ్లు కట్టే వాళ్లు దొరకడం లేదని చెప్పారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అంటే రాష్ట్రంలోని కోటి ఎకరాలకు ఎనిమిది వేల కోట్లు రైతు పెట్టుబడుల కోసం డబ్బును సర్కార్ ఇవ్వనుందని వివరించారు. వచ్చే ఏడాది నుంచి పుష్కలంగా సాగునీరు కూడా వస్తుందన్నారు. టీఆర్ఎస్ పరిపాలన దేశానికే దిక్సూచి అని చెప్పారు.